హైదరాబాద్: నాంపల్లిలోని బజార్ఘాట్ ఏరియాలో ఈ ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం గురించి తెలియగానే సీంఎ కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. గవర్నర్ తమిళిసై సైతం నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
సోమవారం ఉదయం 9.30 గంటలకు నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పసిబిడ్డ ఉన్నారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.