CM KCR | నర్సాపూర్ : ఒకప్పుడు నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి నీళ్లు రాకపోయేది.. కానీ ఇప్పుడు కోమటిబండ నుంచి మంచినీళ్లు తీసుకొచ్చాం.. ఇప్పుడు మంచినీళ్ల బాధ లేదు.. ఇక పిల్లుట్ల కాలువ ద్వారా సాగునీరు తీసుకొస్తే, నర్సాపూర్ వజ్రపు తునకలా తయారవుతదని అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మంజీరా నది, హల్దీ నది ఎట్ల ఉండేది కాంగ్రెస్ రాజ్యంలో. ఎవరన్న పట్టించుకున్నడా..? ఇంకా వాళ్ల తెలివికి ఏం చేసిండ్రు అంటే ఈ రెండు నదుల మీ చెక్ డ్యాంలు కట్టొద్దని బ్యాన్ పెట్టిండ్రు. ఈ రోజు రెండు నదుల మీద చెక్ డ్యాంలు కడితే అవి ఇప్పుడు జీవనదుల్లా ఉంటున్నాయి. హల్దీ వాగుకు అయితే కాళేశ్వరం నీళ్లు పోసి ఎండకాలంలో మత్తళ్లు దుంకుతున్నాయి. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు.
ఒకప్పుడు నర్సాపూర్లో మంచీనీళ్లకు బాధలు ఉండే. కోమటిబండ నుంచి మీకు మంచి నీళ్లు వస్తున్నాయి. అనేకమైన బాధలు తీరినయి. ఒకసారి పిల్లుట్ల కాల్వ అయిపోయింది అంటే బ్రహ్మాండమైన నీటి పారుదల వచ్చి నర్సాపూర్ నియోజకవర్గంలో రైతులు మంచి పంటలు పండిస్తరు. వజ్రపు తునకలా తయారవుతుంది. పిల్లుట్ల కాల్వ అయిపోతే నేనొచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్లు తీసుకువస్తాను. ఆ బాధ్యత నాదే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కులం, మతం అనే తేడా లేకుండా ముందుకు పోతున్నాం. దౌల్తాబాద్, కాసాలా మున్సిపాలిటీ కావాలని కోరారు. తప్పకుండా చేస్తాం.. అదేమీ గొంతెమ్మ కోరిక కాదు. రంగంపేట మండలం కావాలని కోరారు. దాన్ని తప్పకుండా చేసుకుందాం. కౌడిపల్లికి డిగ్రీ కాలేజీ మంజూరు చేశాం. ఐటీఐ తప్పకుండా మంజూరు చేస్తాం. నర్సాపూర్లో చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి. తెలంగాణను బంగారం లాగా కాపాడుకోవాలి అని కేసీఆర్ కోరారు.
మదన్ రెడ్డి ఖాళీగా ఉండడు. ఆయన సముచితమైన, గౌరవప్రదమైన పదవిలో ఉంటారు. ఆయన నాకు చిరకాల, పాత మిత్రుడు. ఇవాళ కొత్తగా కాదు. ఆయన ఎమ్మెల్యే కావడానికి నేను ఎన్నో బాధలు పడ్డాను. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. సునీతా లక్ష్మారెడ్డి, మదన్ రెడ్డి కలిసి నర్సాపూర్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తరు. సునీతా లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను అని పేర్కొంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.