హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన బిడ్డలకు సమాన హోదా దక్కేందుకు జాతీయస్థాయిలో పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. గిరిజన బిడ్డలకు సమన్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ విషయంలో దేశం అంతా తెలంగాణను అనుసరించే పరిస్థితి వస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్సేవాలాల్ మహరాజ్ బంజారా భవన్లను శనివారం ముఖ్యమంత్రి వేర్వేరుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ వస్తే ఏం జరుగుతదనేది ఉద్యమం చేసే సందర్భంలో చాలాచోట్ల నేను చెప్పిన. అనేక సందర్భాల్లో చెప్పిన. మన హైదరాబాద్లో బంజారాహిల్స్ అనే గొప్ప ప్రాంతం ఉంటది. కానీ ఆడ బంజారాలకే గజం జాగలేదు అని బాధపడిన. ఇయ్యాల ఆ మాట తారుమారు చేస్తూ.. మన సొంత రాష్ట్రంలో మన బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసేవిధంగా బంజారాభవన్ను ప్రారంభించుకోవటం చాలా సంతోషం. ఇది యావత్ దేశ గిరిజన జాతికి సుదినం. స్ఫూర్తి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ మన బాటపట్టి అన్నిచోట్లా గిరిజన బిడ్డలకు గౌరవం దక్కేలా ఇది దశ, దిశ చూపుతుందని భావిస్తున్న. ఎంతోమంది బంజారా బిడ్డలు ఉత్తమైన సేవలను అందిస్తున్నారు. ఈ రోజు మన నీటిపారుదల శాఖలో హరిరామ్ గారు అందించిన సేవలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నయి. అట్లనే అనేకమంది అధికారులు అనేక రంగాల్లో, అనేక హోదాల్లో విశేష సేవలను అందిస్తున్నరు. ప్రపంచంలో ఎక్కడికి పోయినా బంజారా బిడ్డలకు భాషమాత్రం ఒక్కటే. బంజారాజాతి విశిష్టత, గొప్పతనం అది. నేను సాహిత్యం చదివే రోజుల్లో ఒక పరిశోధనలో తెలుసుకొని చాలా ఆశ్యర్యపోయిన. మన తెలంగాణ తండాలల్ల మాట్లాడే భాష దాదాపు 28-30 దేశాల్లో కూడా మాట్లాడతరు. ప్రత్యేకమైన ఆహార్యం, ప్రత్యేకమైన జీవన విధానం, ప్రత్యేకమైన సంస్కృతి, ఆత్మగౌరవంతో బతికే పరంపరను మన బంజారా బిడ్డలు కాపాడుతున్నరు.
పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరించుకోబోతున్నం. గ్రామస్థాయిలో కమిటీలు, జిల్లాస్థాయి కమిటీలు చురుకుగా ఉండి చొరవ తీసుకోవాలి. మన గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలె. ఈ సభలో ఉన్న అధికారులు, బంజారా మేధావులు చదువుకొని కష్టపడి ఈ రోజు ఉన్నతస్థాయికి వచ్చినారు. కానీ, అడవుల్లో, తండాల్లో ఉన్న మన బిడ్డలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు వస్తున్నారు.
భవనం కట్టుకోంగనే అయిపోదు. ఇల్లు అలుకంగనే పండుగ కాదు. ఆదివాసీ, గిరిజను బిడ్డల బాగుకోసం ఈ భవనాల్లో చర్చ జరగాలి. మేధోమథనం జరగాలె. తమాషాకో, పెండ్లిండ్లు చేసుకోవటానికో ఈ భవనం కాదు. ఏ జిల్లాలో, ఏ తండాలో ఏ సమస్యలున్నయి? వాటిని ఎలా రూపుమాపాలె? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలె? ఇక్కడ మేధోమథనం జరుగాలె. ఇక్కడొక టాస్క్ఫోర్స్లాగా పెట్టి ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా.. ఇక్కడి నుంచి ఫీనిక్స్లాగా పోయి.. వారికి రక్షణ కవచంగా ఉంటామనే సందేశం ఇచ్చినప్పుడే ఇన్ని కోట్లు పెట్టి కట్టుకున్న ఈ భవనానికి సార్థకత. ఈ ఆత్మగౌరవ భవనాల్లో ఎలాంటి విభాగాలు ఉండాలె? ఏ రకమైన సమాచారం ఉండాలె? అనే విషయంలో మంత్రి, సీఎస్, అధికారులు ఒక చక్కటి కార్యక్రమానికి ఈ వేదిక నుంచే రూపకల్పన చేయాలి. మనకు సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు తీరాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా కొంత అడుగుపడుతున్నది. చదువుల విషయంలో, విదేశాలకు పోయే విషయంలో, పోడుభూముల విషయంలో, ఆదివాసీ బిడ్డల రక్షణ విషయంలో కొద్దికొద్దిగా పురోగమిస్తున్నాం. ఇది మరింత ముందుకు పోవాలె.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్సేవాలాల్ బంజారా భవన్లను సీఎం కేసీఆర్ ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఆదివాసీ భవన్లో మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలోని వడ్డెలు (ఆదివాసీ పూజారులు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బంజారా సంప్రదాయానికి అనుగుణంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. రెండు భవనాల ప్రాంగణంలో కుమ్రంభీం, సంత్సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, డీఎస్ రెడ్యానాయక్, హరిప్రియానాయక్, ఆత్రం సక్కు, రవీంద్రకుమార్, రేఖానాయక్, జీవన్రెడ్డి, మెచ్చా నాగేశ్వర్రావు, కార్పొరేషన్ చైర్మన్లు రాంచంద్రనాయక్, వాల్యానాయక్, రూప్సింగ్, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆదివాసీ, సంత్సేవాలాల్ మహరాజ్ బంజారా భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా రెండు భవనాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వారి వారి భాషల్లో నమస్కారం చేశారు. ఆదివాసీ భవన్లో ‘ఆదివాసీబిడ్డలందరికీ సందీర్కుర్ రాం..రాం..’ అని అభివాదం చేశారు. అలా గే బంజారాభవన్లో “యాడిన్.. బాపున్.. రాం.. రాం’ అని అభివాదం చేశారు. సీఎం కేసీఆర్ ఇలా అభివాదం చేయటంతో సభలో ఒక్కసారిగా ‘జై కేసీఆర్’ అని నినాదాలు మిన్నంటాయి. ‘మావా సాటే.. మావా రాజ్’ (మా తండాలో మా రాజ్యం) నినాదం తెలంగాణ రాష్ట్రంలో నిజమైందని పేర్కొన్నారు. ‘ఇది మా రాష్ట్రం.. ఇది మా కుమ్రంభీం ఆదివాసీ భవన్.. ఇది మా సంత్సేవాల్ మహరాజ్ బంజారా భవన్ అని అందరూ సగర్వంగా చెప్పుకోవాలి’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
మనది ఒక విచిత్రమైన దేశం. గిరిజన బిడ్డలు మనరాష్ట్రంలో ఎస్టీలు. మహారాష్ట్రలో బీసీ. మరోచోట ఓసీలుగా ఉన్నరు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన బిడ్డలకు సమానహోదా దక్కేలా జాతీయస్థాయిలో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఈ మాటే అన్నరు. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇతర రాష్ర్టాల నాయకులు కలిసిచెప్పినారు. ఇది సమతుల్యంగా లేదు. దీని గురించి పునర్విచారణ జరగాలె.