CM KCR | హైదరాబాద్ : బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది చాలా విశిష్టమైన సందర్భం. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాట చరిత్రనీ, స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను ఘనంగా స్మరించుకోవటం ప్రతి భారతీయుని బాధ్యత. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను, ఆదర్శాలనూ, నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజులపాటు నిర్వహించుకున్నాం. నేడు ముగింపు ఘట్టానికి చేరుకున్నాం. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని కేసీఆర్ తెలిపారు.
30 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. సమాచార ప్రజా సంబంధాల శాఖ, విద్యాశాఖల అధికారులు, సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. వారికి నా అభినందనలు అని సీఎం తెలిపారు.
భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు, ఉన్నతమైన నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని కేసీఆర్ పేర్కొన్నారు. అతి ప్రాచీనకాలంలోనే యావత్ ప్రపంచానికీ మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయింది. అనేక మంది మేధావులు దేశ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని వివరించడం వల్ల భారతీయులలో జాతీయ స్పృహ రగిలింది. బ్రిటిష్ పాలన మన దేశానికి లాభదాయకమని, బ్రిటిషర్లు మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారని నమ్మే దురాలోచనాపరులు ఆనాడు కూడా ఉండేవారు. విభిన్న సంస్కృతుల కలయిక అయిన భారతదేశాన్ని ఒక్కతాటి మీద నిలబెట్టింది స్వాతంత్ర సమరం అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆనాడు మహత్మాగాంధీ వంటి మహనీయులు ఎంతో శ్రమకోర్చి దేశ ప్రజలందరిలోనూ భారతీయ భావనను పాదుకొల్పారని కేసీఆర్ గుర్తు చేశారు. రెండు శతాబ్దాల పరాధీనత నుండి విముక్తి కోసం జరిగిన సమరంలో ఎంతో నెత్తురు ధారపోయాల్సి వచ్చింది. ఎందరో ప్రాణాలను బలిపెట్టవలసి వచ్చింది. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ల వంటి అనేకమంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుంది. ‘‘మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్నిస్తాను’’ అని పిలుపునిచ్చి సాయుధ సమరాన్ని నడిపారు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికీ మనందరికీ గొప్ప ప్రేరణనిస్తుంది అని సీఎం తెలిపారు.
ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ అగ్రగణ్యులు అని కేసీఆర్ కొనియాడారు. యుద్ధాలతో కొట్టుకుచస్తున్న మానవ జాతికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం చేశాడు గాంధీ. గాంధీజీ చరఖా చేత బట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికి వాడలు శుభ్రం చేసినా, ఉప్పు వండినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. ‘‘ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్’’ అంటూ మత సామరస్యం కోసం యావజ్జీవం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం చారిత్రిక విషాదం అని కేసీఆర్ పేర్కొన్నారు.
గాంధీజీ ఒక్క భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారని కేసీఆర్ తెలిపారు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి, నెల్సన్ మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచింది. గాంధీని ఎంతగానో ఆరాధించిన నెల్సన్ మండేలా ఈ విధంగా అన్నారు. “నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమలో మహత్మాగాంధీ యొక్క స్థాయిని నేనెన్నటికీ అందుకోలేకపోయాను. గాంధీ ఏ బలహీనతలు లేని మనిషి. నేను అనేక బలహీనతలున్నవాడిని..” అని మండేలా చెప్పుకున్నారు. నేటికీ యావత్ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తున్నది. గాంధీ చూపిన అహింసామార్గంలో స్వాతంత్రోద్యమం విజయ తీరం చేరింది అని కేసీఆర్ అన్నారు.
స్వాతంత్ర సమర ఆశయాల వెలుగులోనే అంబేద్కర్ మహాశయుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని సీఎం పేర్కొన్నారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలకు వేదికగా నిలుస్తున్నది. గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. పోరాటం గమ్యాన్ని ముద్దాడింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేది. టీఆర్ఎస్ను స్థాపించినపుడు అహింసాయుత ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను స్పష్టంగా ప్రకటించాను. మొదట కొందరు నాతో ఏకీభవించలేదు. కానీ రానురాను అందరూ నేను ఎంచుకున్న మార్గమే సరైనదని అంగీకరించారు. వెంట నడిచారు. ప్రాణాన్ని పణంగా పెట్టయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప, అహింసా మార్గాన్ని వీడకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఆ నేపథ్యంలోంచి వచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన అని కేసీఆర్ వివరించారు.
స్వతంత్ర పోరాటకాలంలో బ్రిటిష్ పాలనే బాగుందని అన్న ప్రబుద్ధుల వంటివారు… తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారని కేసీఆర్ తెలిపారు. వారు తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలం కాక తప్పలేదు. విచిత్రం ఏమిటంటే… వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనది అయినట్టే.. తెలంగాణ పరిపాలన కూడా స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణమైనదే. స్వతంత్ర భారతంలో ఏనాడూ లేని విధంగా వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాం. రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతన్నల కళ్ళలో వెలుగులు చూస్తున్నాం. గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయంపోషకత్వం దిశగా మనం ఎంతో దూరం ప్రయాణించాం. గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహమిచ్చాం. గ్రామాలు సుసంపన్నంగా మారాయి. ప్రజలందరికీ మంచినీళ్ళు కూడా ఇంతకాలం ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
సంక్షేమానికి అగ్ర తాంబూలమివ్వడంలోనూ, రైతు కేంద్రంగా ప్రణాళికల రచన చేయడంలోనూ, గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక గాంధీ ప్రభావమే ఉన్నది అని కేసీఆర్ తెలిపారు. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉన్నదని గాంధీ పదే పదే చెప్పారు కదా.. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా, వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధి దాకా, గిరిజనులు, దళితులు, మైనారిటీలు మొదలుకొని… అగ్రవర్ణ పేదలదాకా అన్నిటికీ, అందరికీ సమప్రాధాన్యతనిస్తున్నాం. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి నమూనాతో పురోగమిస్తున్నాం. అందుకే ఈరోజు తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఈ అభివృద్ధి నమూనా ఇదేవిధంగా కొనసాగిస్తూ, సకల జనులకూ ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్ర్యోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతామని సవినయంగా తెలియజేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
మనది న్యాయపథం.. మనది ధర్మపథం.. సకలజనుల సంక్షేమమే మనకు సమ్మతం.. సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం.. మన నిబద్ధతా, నిజాయితీ జనావళికి అభయం.. ముమ్మాటికి మనలనే వరిస్తుంది విజయం.. ఇది సత్యం, ఇది నిత్యం, ఇది తథ్యం… స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నిజంచేద్దాం. జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదాం. యతో ధర్మస్తతో జయః జై తెలంగాణ.. జై భారత్.. అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.