నల్లగొండ: కాంగ్రెస్ 50 ఏండ్ల హయాంలో తనకంటే దొడ్డుగ, ఎత్తుపొడుగు ఉన్నోళ్లు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రని, కానీ ఎవరు గూడా తెలంగాణ ప్రాంతానికి కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని సీఎం కీసీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణం అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నల్లగొండ నియోజకవర్గం, పట్టణం అభివృద్ధి చెందాయని చెప్పారు.
‘కేసీఆర్ కంటే దొడ్డుగ, ఎత్తుగ ఉన్నోళ్లు చాలా మంది కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. కానీ ఎవరు గూడా తెలంగాణకు మంచినీళ్లు ఇయ్యలే. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉండె తెలంగాణకు మంచినీళ్లు కూడా ఇయ్యలేక పోయిండ్రు. కరెంటు ఇయ్యలే. మరె ఇయ్యాల కరెంటు ఎట్ల వచ్చింది..? మంచి నీళ్లు ఎట్ల వచ్చినయ్..? మీరు ఆలోచించాలె. పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తనని చెప్పిన. మధ్యల కరోనా వచ్చి ఓ ఏడాది ఆలస్యమైనా.. ఆ తర్వాత తగిల్నమంటే నల్లగొండ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇదంతా మీ కళ్ల ముందు ఉంది. నల్లగొండకు ఐటీ టవర్ కూడా వచ్చేసింది. వెయ్యి, పదిహేను వందల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నయ్’ అని సీఎం తెలిపారు.
‘అంతకుముందు రెండు దశాబ్దాలు ఇక్కడ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండె. ఆయన కాలంలో నల్లగొండ పట్టణం ఎట్లుండె..? మంచి నీళ్లు ఎట్లుండె..? కరెంటు ఎట్లుండె..? పని ఏం జరిగింది..? వట్టిగ అడ్డం పొడుగు మాట్లాడు గాదు. నల్లగొండ పట్టణం అప్పుడెట్లుండె, ఇప్పుడెట్లుంది..? అనేది ఆలోచన చేయండి. బీఆర్ఎస్ వచ్చినంక రూ.200 ఉన్న పెన్షన్ రూ.2 వేలు అయ్యింది. భవిష్యత్లో దాన్ని రూ.5 వేలకు పెంచుతం. ఆరోగ్యం విషయంలో మేం ఎన్ని చర్యలు తీసుకున్నమో మీరు చూస్తున్నరు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంలో పాత నల్లగొండ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ రాలే. ఇయ్యాల మూడు మెడికల్ కాలేజీలు వచ్చినయ్. నల్లగొండలో ఐదారు వందల బెడ్లతోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చింది. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్నం’ అని చెప్పారు.
‘ఇక్కడి రైతాంగానికి నేను మనవి చేస్తున్నా. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీరు వస్తది. ఉదయ సముద్రం గతంలో ఎట్లుండె, ఇప్పుడెట్లుంది..? ఇయ్యాల ఉదయ సముద్రం కింద చాలా చక్కటి పంటలు పండుతున్నయ్. ఇవన్నీ మీరు ఆలోచించాలె. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు గంటలే కరెంటు ఇస్తమని ఆ పార్టీ నాయకులు చెప్తున్నరు. ధరణిని తీసేస్తమంటున్నరు. ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నరు. కేసీఆర్కు పనిలేక రైతుబంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు ఎట్ల వేస్ట్ అయితది..? మీరు మళ్ల భూపాల్రెడ్డిని గెలిపియ్యండి.. రైతుబంధును రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతం. కరెంటు మూడు గంటలు చాలు అంటున్నరు. మూడు గంటల కరెంటు సరిపోతదా..? మరె 24 కరెంటు ఉండాల్నంటె గూడా భూపాల్రెడ్డి గెలువాలె’ అన్నారు.
‘మూషంపల్లిలో బోర్ల రాంరెడ్డి అనే రైతు 54 బోర్లు వేసిండు. అయినా నీళ్లు పడలే. తెలంగాణలో బోర్లు, బావుల మీదనే వ్యవసాయం ఎక్కువ ఆధారపడి ఉంటది. మరె కరెంటు లేకపోతే మోటార్లు ఎట్ల పోస్తయ్..? కాంగ్రెసోళ్లు ఇంకేమంటున్నరు..? రైతులు 10 హెచ్పీ మోటార్లు పెట్టుకోవాలె అంటున్నరు. రైతుల దగ్గర 10 హెచ్పీ మోటార్లు ఉంటయా..? మరె రాష్ట్రంలో 30 లక్షల బోర్లకు 10 హెచ్పీ మోటార్లు ఎట్ల రావాలె. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరట. భూమాత పోర్టల్ తెస్తరట. అది భూమతనో మరె భూమేతనో..! బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ భూమిని మరొకరి పేరు మీదకు మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేకుండా చేసినం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల గోల లేకుండా రైతుబంధు మీ బ్యాంకుల ఖాతాల్లో పడేటట్లు చేసినం. మరె కాంగ్రెస్ వచ్చి ధరణిని తీసేస్తే పాత రోజులే వస్తయ్. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లయితది’ అని సీఎం హెచ్చరించారు.