షాద్నగర్: బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నదని, కాంగ్రెస్ హయాంలో రైతులు కరెంటు బిల్లు కట్టలేకపోతే తలుపులు పీక్కపొయేటోళ్లని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్నగర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. బాగా ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. ఆలోచన లేకుండా ఆగమాగం ఓటేస్తే మోసపోతరని హెచ్చరించారు. అభ్యర్థి గుణగణాలను, అ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ నడవడిక, చరిత్రను బేరీజు వేసుకుని వేటు వేస్తే మంచి జరుగుతదని సూచించారు.
‘నేను మీ అందరికి ఒక మాట చెబుతున్న. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ప్రజాస్వామ్యం ఉన్నా ఇంకా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదు. ప్రజాస్వామ్య పరిణతి వచ్చిన దేశాలు, సమాజాలు బాగా అభివృద్ధి చెందినయ్. అక్కడ ఓటర్లు బాగా ఆలోచించి ఓటేస్తరు. మన దగ్గర కూడా ఆ పరిస్థితి రావాలె. ఇక్కడ ఎన్నికలు రాగానే జనం చాలా మంది ఆగమాగం అయితరు. చెప్పుడు మాటలు నమ్మి ఓటేస్తరు. సొంతంగా ఆలోచించరు. కాబట్టి ఆ పరిస్థితి మారాలె. ఎవరికి వాళ్లు సొంతంగా ఆలోచించి ఓటేయాలె. అభ్యర్థి గుణగణాలు, ఆ అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్ర చూసి మంచి నడవడిక, చరిత్ర ఉన్న అభ్యర్థికి, పార్టీకే ఓటేయాలె. ఎవరికి ఓటేయాలనే విషయంలో స్పష్టత కోసం గ్రామాల్లో చర్చ చేయాలె. అప్పుడే రాయేదో రత్నమేదో తేల్తది. మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతది’ అన్నారు.
‘పార్టీల చరిత్ర విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసు. ఇది తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ సమాజం అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టింది. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపి సర్వనాశనం చేసింది. మళ్ల మన రాష్ట్రాన్ని సాధించుకోవడానికి 58 ఏండ్లు అవస్థలు పడ్డం. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలన చేసింది. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్ఎస్ పార్టీ పదేండ్లుగా అధికారంలో ఉంది. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది..? పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది..? అనేది మీరు బేరీజు వేసుకుని ఓటేయాలె’ అని సీఎం కోరారు.
‘బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ రూ.200 పెన్షన్ ఇచ్చేది. మేం అధికారంలో వచ్చినంక దాన్ని రూ.1000 చేసినం. తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచుకున్నం. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం పెరిగింది కాబట్టి ఎన్నికల తర్వాత ఆసరా పెన్షన్ను రూ.5 వేలకు పెంచబోతున్నమని హామీ ఇస్తున్నా. ఆడపిల్ల పెండ్లి ఖర్చులు ఎక్కువుంటయ్. అది ఆలోచించి మేం ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో రూ.లక్ష సాయం అందిస్తున్నం. గతంలో ఏ ప్రభుత్వానికి గూడా ప్రజలకు కంటి పరీక్షలు చేయించాలనే ఆలోచన రాలె. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించినం. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మందికి కండ్లద్దాలు ఇచ్చినం’ అని చెప్పారు.
‘ఒకప్పుడు గర్భిణిలు ప్రవసం కోసం ప్రభుత్వ దవాఖానలకు పోతే నరకం ఉండె. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ప్రభుత్వం చేసిన మార్పులతో ప్రైవేటు దవాఖానల కంటే ప్రభుత్వ దవాఖానల్లనే ప్రసవాలు ఎక్కువ అవుతున్నయ్. అదేవిధంగా వ్యవసాయ స్థిరీకరణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినం. ఇదివరకు నీటి పన్నులు వసూలు చేసేవారు. మేం ఆ నీటి తీరువాను రద్దు చేసినం. పాత బకాయిలను కూడా మాఫీ చేసినం. మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసుకున్నం. దాంతో భూగర్భ జలాలు పెరిగినయ్. అంతేగాక రైతుల పంటల కోసం 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నం. కాంగ్రెస్ రాజ్యంల రైతులు కరెంటు బిల్లు కట్టలేకపోతే తలుపులు పీక్కపొయేటోళ్లు’ సీఎం గుర్తుచేశారు.