మక్తల్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరు కొనసాగుతున్నది. రోజుకు మూడు, నాలుగు బహిరంగ సభలతో ఆయన ఎన్నికల ప్రచారంలో తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. సోమవారం కూడా దేవరకద్ర, గద్వాల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించిన అనంతరం మక్తల్ నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభకు సీఎం విచ్చేశారు. మక్తల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.
మక్తల్ సభలో సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘హెలిక్యాప్టర్లో సాంకేతిక లోపం వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఇంకా నేను నారాయణపేట వెళ్లాల్సి ఉంది. ఒక ఐదారు నిమిషాలె మాట్లాడుత. దయచేసి ఏమనుకోవద్దు. అర్థం చేసుకోవాలె. మీ అందరికి నేను మనవి చేసేది ఏందంటే.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు. గాబరా పడి ఓట్లు వేయొద్దు. పరణతితో ఆలోచించాలి. ఏ అభ్యర్థిని గెలిపిస్తే మంచి జరుగుతది..? ఏ పార్టీని గెలిపిస్తే మంచి జరుగుతది..? అనేది ఆలోచన చేయాలి. అట్ల ఆలోచించి ఓటేసినప్పుడే ఎన్నికల్లో మీరు గెలుస్తరు. మీరు గెలిస్తేనే మీకు న్యాయం జరుగుతది’ అన్నారు.
‘ఉమ్మడి పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ. వాల్మీకి బోయలను ముంచింది కూడా కాంగ్రెస్ పార్టీనే. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రా బోయలను ఎస్టీల్లో పెట్టి, తెలంగాణ బోయలను బీసీల్లో పెట్టిండు. నాటి కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రి చేసిన పాపమే ఇయ్యాలటి దాకా మనలను బాధపెడుతున్నది. బోయలను ఎస్సీల్లో చేర్చాలని రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా బీజేపీ సర్కారు కింద పెట్టుకుని కూసున్నది. ఈ ఎన్నికల తర్వాత వాల్మీకిల తరఫున ఉద్యమం చేసైనా కేంద్రం మెడలు వంచి మీకు న్యాయం చేస్తా అని మనవి చేస్తున్నా’ అని హామీ ఇచ్చారు.