నాగర్కర్నూల్: ఓటేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాగర్కర్నూలులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఓటేసేటప్పుడు రాయేదో, రత్నమేదో చూసి వెయ్యాలన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటువేయవద్దని, ఆగమాగమై ఓటేస్తే మోసపోతమని సీఎం హెచ్చరించారు.
‘కుండ కొనాలంటే పర్రెలున్నయా..? మంచిగున్నదా..? అని చూస్తం. కూరగాయలు కొనాలంటే పుచ్చులేమన్న ఉన్నయేమో అని చూసి ఏరుకుంటం. మరె కుండ, కూరగాయాలు కొనేటందుకే అంత ఆలోచించే మనం.. ఎమ్మెల్యేను ఎన్నుకునేటందుకు ఎంత ఆలోచించాలె..? మంచి వ్యక్తికి, మంచి పార్టీకి ఓటేసి గెలిపించుకోవాలె. అప్పుడే మన బతుకులు బాగుంటయ్. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించి తెలంగాణ ప్రజలను పట్టించుకోలే. ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలే. పంటలకు నీళ్లియ్యలే. మంచి నీళ్లు ఇయ్యలే. ఏండ్ల తరబడి కరువు కాటకాలు అనుభవించినం’ అని సీఎం చెప్పారు.
‘టీఆర్ఎస్ పార్టీ పెట్టి 14 ఏండ్లు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఈ 14 ఏండ్లళ్ల గూడా తెలంగాణ ఇయ్యకుండా కాంగ్రెస్ దోఖా మీద దోఖా చేసింది. టీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు కుట్రలు చేసింది. తెలంగాణ వచ్చినంక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసింది. విధి వంచితులకు రూ.2 వేల ఆసరా పెన్షన్లు ఇస్తున్నం. లక్షల మందికి కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు చేసినం. ప్రభుత్వ దవాఖానల పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్ ఇస్తున్నం. అబ్బాయి పుడితే రూ.12 వేలు, అమ్మాయి పుడితే రూ.13 వేలు ఇస్తు్న్నం. ఆడపిల్ల పెండ్లికి కళ్యాణలక్ష్మి పేరుతోటి లక్ష రూపాయలిస్తున్నం. చేనేత కార్మికులకు 50 శాతం ధరకే నూలు, రంగులు ఇచ్చి ఆదుకుంటున్నం. గీత కార్మికులను ఆదుకుంటున్నం. ముదిరాజ్ బిడ్డలను, చేపలు పట్టే గంగపుత్రులను కాపాడుకుంటున్నం. రాష్ట్రం నుంచి ఇప్పటికే రూ.33 వేల కోట్ల చేపలు ఎగుమతి అయినయ్. యాదవ సోదరులకు లక్షలాదిగా గొర్రెలను పంపిణీ చేసినం. రైతులపై పన్నులు వేయడం లేదు. రైతుబంధు ఇస్తున్నం. కరెంటు ఇస్తున్నం. రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా ఇస్తున్నం. రైతులు పండించిన వడ్లను ప్రభుత్వమే కొంటున్నది. ఇవన్నీ మీరు గమనించాలె’ అని సీఎం కోరారు.
‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యంల ఏమున్నది..? మన్ను ఉన్నదా..? ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే ఎన్టీ రామారావు రూ.2కే కిలో బియ్యం పథకం ఎందుకు తెస్తుండే. ఇందిరమ్మ రాజ్యంలనే మనోళ్లను కాల్చి చంపిండ్రు. ఇందిరమ్మ రాజ్యంలనే ఎన్కౌంటర్లు అయినయ్. ఇందిరమ్మ రాజ్యంలనే హైదరాబాద్లో మత కల్లోలాలు అయినయ్. మరె ఇయ్యాల మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తమని కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు. ఇగ ఏమనాలె. మీరే బాగా ఆలోచించాలె’ అని అన్నారు.