CM KCR | నిర్మల్ : తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కారణమని(ప్రభుత్వ ఉద్యోగులు) కేసీఆర్ స్పష్టం చేశారు. నిర్మల్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
చక్కటి సమీకృత పరిపాలన భవనాన్ని నిర్మింపజేసి నా చేతుల మీదుగా ప్రారంభించనిందుకు నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులను, అధికారులను అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరోసారి మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దశాబ్ది వేడుకల ప్రాంరభంలో 90 నిమిషాల పాటు ప్రసంగించాను. ఇంటికి వెళ్లిన తర్వాత కొందరు 20 నుంచి 30 విషయాలు చెప్పలేదు సార్ అని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం కలిసి.. సమిష్టి కృషితో అద్భుత ఫలితాలు సాధించగలిగాం. అందులో అనుమానం అక్కర్లేదు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజింపబడి పరిపాలన ప్రజలకు చేరువైంది. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చింది. ఏపీలో ఉంటే 50 ఏండ్లకు కూడా ఈ కాలేజీ వచ్చేది కాదు. పవర్ పర్ క్యాపిటలో నంబర్ వన్ లో ఉన్నాం. ముఖ్రా కే గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొని మనకు గౌరవం తెచ్చిపెట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా హ్యుమన్ ఇండెక్స్ డెపవల్మెంట్లో విద్యుత్ పర్ క్యాపిట, పర్ క్యాపిట ఆదాయం.. ఈ రెండు మన గురించి తెలియజేస్తాయి. ఈ రెండింటి విషయంలో ఎక్కడో ఉన్న మనం చాలా పురోగమించం. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను దాటేసి వెళ్లిపోయాం. మనందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. దీంతో పొంగిపోవద్దు. చాలా పేదరికం ఉంది. దళిత జాతి, గిరిజన జాతి, వెనుకబడి తరగతుల్లో నిరుపేదలు ఉన్నారు. జరగాల్సింది చాలా ఉంది. ఇదే పట్టుదల, కృషితో ముందుకు పోయి మన సోదరులుగా ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదలను సమాన స్థాయికి తీసుకుపోవాలి. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. గతంలో తాగు, కరెంట్, సాగునీటి సమస్యలు ఉండేవి. వీటన్నింటిని 9 ఏండ్లలో అధిగమించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి.. భవిష్యత్ కోసం పురోగమించాలి. బాగా కష్టపడి పేదరికాన్ని తరిమేయాలి. దేశానికే తలమానికంగా ఉండాలి. పోడు భూముల పంపిణీని బ్రహ్మాండంగా నిర్వహించాలి. ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉంది. వారి బ్యాంకు ఖాతాలు సేకరించాలి. మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. మహారాష్ట్ర ప్రజలు మన పథకాలను చూసి తెలంగాణ మోడల్ కావాలని కోరుతున్నారు. తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతుంది. అందుకు మీరే కారణం అని కేసీఆర్ ఉద్యోగులను అభినందించారు.