హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకు సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ( AMRP ) నుంచి నీటి విడుదలకు కూడా కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
నేటి సాయంత్రం వరకు సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో క్రస్ట్ గేట్లు ఎత్తివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4,80,222 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ప్రస్తుతం ఔట్ఫ్లో 37,743 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 579.20 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం డ్యామ్లో 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.