హైదరాబాద్: పౌరహక్కుల నేత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal), ఇతరులపై నమోదైన దేశ ద్రోహం కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారిపై ఉపా (UAPA) కేసులు ఎత్తివేయాలని డీజీపీ అంజనీ కుమార్కు (DGP Anjani Kumar) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశాలు జారీచేశారు.
ప్రొఫెసర్ హరగోపాల్తోపాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులపై 2022, ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో దేశద్రోహం కేసు నమోదయింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని 10 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్, ప్రొఫెసర్ పద్మజా షా, హైకోర్టు సీనియర్ న్యాయవాది వీ రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ తదితరుల పేర్లున్నాయి.