హైదరాబాద్ : కేంద్రంపై సీఎం కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ను ఉతికారేశారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనను అని చెబుతున్నావ్. ఇది నీ చేతకాని తనం కాదా? కేంద్రం వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపడుతాం. లక్షలాది మంది రైతులతో కలిసి ధర్నాలు చేయబోతున్నాం. వడ్లు కొంటవా? కొనవా? అనేది తేలాలి. రైతులతో కలిసి పోరాడుతాం. శుక్రవారం మాతో కలిసి నువ్వు కూడా ధర్నాకు కూర్చుంటావా? తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనాల్సిందే.
తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. మా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. మీ తాత జేజమ్మ ఎవరున్నా వదిలిపెట్టం. ఈ దేశ ఖజానాలో మా వాటా ఉంది. ఈ దేశం మీ అయ్య సొత్తు కాదు. మిమ్మల్ని వదలం, వేటాడుతాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వరకు పోరాడుతాం. మీరు వడ్లు కొనం అంటే మీకు ఓటేయ్యాలా? వద్దా? అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. తెలంగాణ రైతులు, ప్రజలు కేసీఆర్ను నమ్ముతున్నారు. మీరు డిపాజిట్లు కోల్పోయారు అని కేసీఆర్ గుర్తు చేశారు.