హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం యధాతథంగా అమలు అవుతోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దళిత బంధు పథకం హుజూరాబాద్లో సంపూర్ణంగా అమలై తీరుతోంది. దళిత బంధు పథకంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్లో ఈ పథకం అమలు కోసం రూ. 2 వేల కోట్లు విడుదల చేశాం. పథకంపై అవగాహన కల్పించి, శిక్షణ ఇస్తున్నాం. దళితులకు అన్నింట్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.
తెలంగాణ దళిత జాతిని అభివృద్ధి చేసే బాధ్యత నాదే. హుజూరాబాద్లో ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అమలు చేసి తీరుతాం. మిగతా నాలుగు మండలాల్లో కూడా నేనే స్వయంగా వెళ్లి.. 100 కుటుంబాల చొప్పున అమలు చేస్తాం. మిగతా నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున దళిత బంధు అమలు చేస్తాం. ఈ ప్రక్రియ మార్చి లోపు అమలవుతోంది. వచ్చే మార్చి లోపు 20 లక్షల కుటుంబాలకు అమలు చేస్తాం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్ది అన్ని కుటుంబాలకు వర్తిస్తాం. తెలంగాణ దళితజాతి అభివృద్ధి ఏడాది, రెండేండ్లో చేసి చూపిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.