నిజామాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తరతరాలుగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇలాంటి ఐక్యతే మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ కనిపించింది. రకరాల భాషలు మాట్లాడే జనం. వివిధ మతాలకు చెందిన ప్రజలతో కేసీఆర్ సభ హోరెత్తింది. సిక్కులు, హిందువులు, ముస్లింలు, బౌద్ధులు ఇలా రకరకాల మతస్థులంతా ఈ సభలో పాలుపంచుకున్నారు. ఇక హిందీ, ఉర్దూ, పంజాబీ, ఇంగ్లిష్, తెలుగు, మరాఠా వంటి భాషలు మాట్లాడే ప్రజలంతా కేసీఆర్ సభలో కనిపించారు. వీరంతా ఈ ప్రాంతానికి చెందిన వారే. దేశ రాజకీయాల్లో రెపరెపలాడుతున్న గులాబీ జెండా పట్ల మక్కువతో కేసీఆర్ లాంటి మహానేతను చూసేందుకు తరలి వచ్చారు. సిక్కుల ఆధ్యాత్మిక క్షేత్రం హుజుర్సాహిబ్ గురుద్వారా కు కూత వేటు దూరంలోనే ఈ క్షేత్రానికి సంబంధించిన మైదానంలో బీఆర్ఎస్ సభతో జరిగింది.
గురుద్వారాలో పూజలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్కు చేరుకున్నారు. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. విమానంలో కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట రాజశేఖర్, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు వచ్చారు. నేరుగా గురుద్వారాకు చేరుకున్నారు. సిక్కు మత సంప్రదాయం ప్రకారం తలపాగా ధరించారు. గురుద్వారాలో సీఎం కేసీఆర్కు ప్రత్యేకమైన వస్ర్తాలను ధరింపజేశారు. అనంతరం పూలమాలతో సత్కరించి ఆశీర్వాదం అందించారు. సిక్కు మత పెద్దల సమక్షంలో గురు గోబింద్ సింగ్కు సాష్టాంగ నమస్కారం చేశారు. గురుద్వారా బయట పెద్ద ఎత్తున మరాఠీలు, తెలంగాణ ప్రాంత ప్రజలంతా పోగై కేసీఆర్కు అభినందనలు తెలియజేశారు.
గురుద్వార్ చరిత్ర
దేశంలో సిక్కు మతానికి చెందిన ఐదు ప్రధాన గురుద్వారాలలో నాందేడ్లోని గురుద్వారా ఒకటి. గురుగోవింద్ సింగ్ తుది శ్వాస విడిచిన ప్రదేశమిది. క్రీ.శ. 1830- 1839 మధ్య కాలంలో పంజాబ్ గొప్ప పాలకుడైన మహారాజా రంజిత్ సింగ్ ఈ గురుద్వారా నిర్మించారు. ఇందులో సిక్కుల పదవ మత గురువు సమాధి ఉంది. రకరకాల ఆయుధాలు కూడా ఈ గురుద్వారాలో వీక్షించవచ్చు.