హైదరాబాద్ : ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ సోమేశ్ కుమార్తో పాటు ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దళితబంధుతోపాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, ప్రభుత్వ పథకాల అమలు, కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, పోడు భూముల సమస్యపై విస్తృతంగా చర్చించనున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించడం, యాసంగి పంటల సాగు, జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కార్యాచరణ ఖరారు చేసి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం, మెడికల్ కాలేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్లు, ధరణి సమస్యల వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు. దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.