హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): భూలోక వైకుంఠంగా ఆవిష్కారమవుతున్న యాదాద్రి దివ్యక్షేత్రం పునర్నిర్మాణం, ప్రారంభం గురించి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం చినజీయర్ స్వామితో చర్చించారు. యాదా ద్రి పునర్నిర్మాణంలో భాగంగా తుది దశకు చేరుకొన్న ఆలయ నిర్మాణ పనుల గురించి తెలిపారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని తాను ఆహ్వానించానని వెల్లడించారు. యాదాద్రి ప్రారంభోత్సవం ఎప్పుడు చేయాలి? మంచిరోజులు ఎప్పుడు ఉన్నాయి? ఈ సందర్భంగా చేయ తలపెట్టిన శ్రీసుదర్శన మహాయాగం ఏర్పాట్లు, రుత్విక్కుల ఆహ్వానం, మూలవరుల దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు వంటివాటిపై సీఎం కేసీఆర్ జీయర్ స్వామితో చర్చించారని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్తో దాదాపు గంటన్నరకు పైగా వివిధ అంశాలపై జీయర్ స్వామి చర్చించారు. ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బృహత్ రామానుజ పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన, ఆవిష్కరణ గురించి ముఖ్యమంత్రికి జీయర్స్వామి విశదీకరించారు. ఈ ప్రాంగణంలో నిర్మిస్తున్న 108 దివ్యదేశాలు.. ఇతర బృహత్తర నిర్మాణాల గురించి వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు.. ప్రధాని, రాష్ట్రపతి, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆహ్వానించిన విషయాలను ముఖ్యమంత్రితో పంచుకొన్నారు.
ఉత్సవాల నిర్వహణ, కార్యక్రమ ప్రణాళిక, భక్తులకు ఏర్పాటుచేస్తున్న సౌకర్యాల గురించి జీయర్ స్వామి సీఎం కేసీఆర్కు తెలియజేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుటుంబసభ్యులతో కలిసి సోమవారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని దివ్యసాకేతం ఆశ్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిశారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆశ్రమంలోని వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం దంపతులను జీయర్ స్వామి శాలువాలతో సత్కరించి మంగళాశాసనాలు అందించారు. జీయర్స్వామితో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సామాన్య భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఆయన సతీమణి శోభమ్మ, తోబుట్టువులు వినోద, లక్ష్మి, లలిత, కుటుంబ సభ్యులు శశిరేఖ, ఎంపీ సంతోష్కుమార్తోపాటు.. టీటీడీ బోర్డు సభ్యులు మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు, కావేరీ సీడ్స్ భాస్కర్రావు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్కుమార్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేయ్కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ఇతర అధికారులు పాల్గొన్నారు.
జమ్మి మొకను నాటిన సీఎం, జీయర్
తెలంగాణకు హరితహారం స్ఫూర్తిగా ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాచాలెంజ్లో భాగంగా ‘ఊరూరికో జమ్మిచెట్టు.. గుడిగుడికో జమ్మిచెట్టు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్స్వామి పాలుపంచుకొన్నారు. ముచ్చింతల్ ఆశ్రమ ప్రాంగణంలో జీయర్స్వామితో కలిసి సీఎం కేసీఆర్ జమ్మి మొక్కను నాటారు. హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ను పట్టుదలతో చేస్తున్నారంటూ ఎంపీ సంతోష్కుమార్ కృషి గురించి జీయర్స్వామికి సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం సాధిస్తున్న పురోగతి, ఇప్పటివరకు చేరుకున్న లక్ష్యాన్ని స్వామికి సీఎం వివరించారు. సాధారణ మొక్కలు నాటడమే కాకుండా ప్రధానంగా జమ్మి మొకను నాటే ఆలోచన చాలా గొప్పదని సంతోష్కుమార్ను చినజీయర్స్వామి అభినందించారు. ‘భక్తి అంటే భగవంతుడిని ప్రార్థించడం మాత్రమే కాదు.. ఆ భగవంతుడు సృష్టించిన ఈ భూమిని కాపాడుకోవడం కూడా. అందుకే సకల చరాచర జీవరాశులకు వేదికైన ఈ నేలను, ప్రకృతిని కాపాడుకొనే మహత్తర సంకల్పానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వేదికగా నిలుస్తుంది. సామాన్యుల నుంచి సాధు పుంగవుల వరకూ ప్రతి హృదయాన్ని కదిలిస్తుంది. చేయిపట్టి మొకలను నాటిస్తుంది’ అని తెలిపారు.
జీవితంలో చెట్టు పాత్ర కీలకం
మనిషి పుట్టినప్పటినుంచి కాడదాక జీవితంలో చెట్టు ప్రధానపాత్ర పోషిస్తుందని, అందుకే చెట్లల్లో నీడనిచ్చేవి, కాయలిచ్చేవి, పూలు ఇచ్చేవనే భావన లేకుండా అన్ని మొకల్ని పెంచాలన్నారు. ఈ భావనలు రాకూడదనే భగవంతుడు జమ్మి చెట్టును మన ఆలోచనలో భాగం చేశాడన్నారు. జమ్మిచెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించేలా చేశాడన్నారు. భగవంతుడే జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి ఆరాధన చేసి, తమ ఆయుధాలను చెట్టుపై పెట్టి పూజించి మనకు పండుగలో చెట్టును భాగం చేశాడని, ఈ కారణంగానే పూర్వికులు జమ్మిని రాణిగా పిలిచారని, దోషాలను శమింపచేసేదిగా జమ్మికి ప్రాధాన్యం కల్పించారన్నారు. మన పూర్వికులు అందించిన గొ ప్ప సదాశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎంపీ సంతోష్కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ద్వారా కోట్ల మొకలను నాటించిన కృషిని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఆయన ఆశయానికి శ్రీమన్నారాయణమూర్తి ఆశీస్సులు ఎల్లవేళలా ఉం డాలని శుభాకాంక్షలు తెలిపారు. వారి భవిష్యత్ కా ర్యక్రమాలు దిగ్విజయం కావాలని ఆశిస్తున్నానని ఆశీర్వదించారు. ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడు తూ.. గురుతుల్యులు, సత్పురుషులు శ్రీశ్రీశ్రీ త్రిదం డి చిన జీయర్ స్వామిజీ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొకలు నాటడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ఆయన ఆశీస్సులతో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.
వృక్షో రక్షతి రక్షితః
చెట్లను మనం కాపాడుకొంటే.. మనల్ని అ వి రక్షిస్తాయని పెద్దలు చెప్పారని, కానీ, ఇప్పు డు మనిషి చెట్లను, కొండలను తవ్వేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడని జీయర్స్వామి అ న్నారు. ‘మన భారతీయ సంస్కృతి.. భూమి ప్రకృతి, సకల చరాచర జీవరాశుల గురించి ఎన్నెన్నో అద్భుతమైన ఉపదేశాలను అందించింది. వాటిని సదా ఆచరించింది. ముఖ్యంగా దైవం మీద ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తి ఏ రూపం లో అయినా దేవుడిని ప్రార్థించవచ్చు. ఆయా దేవుళ్లతో జంతువు, పక్షి, చెట్టు వంటివాటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మన వేదాలు స్పష్టంగా వివరించాయి. విష్ణువుతోపాటు అశ్వత్థామ, పక్షి గరుత్మంతుడు, సర్పం కనిపిస్తే.. పరమశివుడితోపాటు బిల్వపత్రం, నంది, సర్పాన్ని అనుసంధానించారు. అంటే ప్రకృతితో మనిషి జీవం సాగించడానికి ప్రతిరూపంగా భగవంతుడు తన రూపాన్ని ఆవిషరించాడు’ అని చినజీయర్స్వామి అన్నారు.