హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐపీఎస్ పోస్టుల అదనపు కేటాయింపు త్వరగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. కేంద్ర హోం మంత్రి అమిత్షాను కోరారు. శనివారం హోం మంత్రితో భేటీ అయిన సీఎం ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ పోస్టుల సంఖ్యను 139 నుంచి 195కు పెంచాలని తెలిపారు. సీనియర్ డ్యూటీ అధికారుల సంఖ్య ప్రస్తుతం 76గా ఉన్నదని.. దాన్ని 105కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర హోంశాఖ 2016లో ఐపీఎస్ క్యాడర్ను రివ్యూ చేసిందని తెలిపారు. ఆ సమయంలో తెలంగాణకు 76 సీనియర్ డ్యూటీ పోస్టులు సహా మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రంలో అధికారుల అవసరం పెరిగిందని వివరించారు. పోలీస్ జిల్లాల సంఖ్య 20కి, పోలీస్ కమిషనరేట్ల సంఖ్య 9కి పెరిగిందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అదనపు పోస్టులు కేటాయించాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 24న హోంశాఖకు ప్రతిపాదనలు పంపినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అమిత్షాకు గుర్తుచేశారు. కొత్తగా ఏర్పడిన జోన్లు, మల్టీజోన్లు, పోలీస్ జిల్లాల్లో శాంక్షన్డ్ క్యాడర్ పోస్టులు లేవని, కొత్తగా పోస్టుల మంజూరుతో ఈ సమస్య తీరుతుందని పేర్కొన్నారు. ఐపీఎస్ క్యాడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలని, వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ అమిత్షాను కోరారు.