CM KCR | పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కలెక్టర్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి మూడు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా, పండుగ వాతావరణంలో జరుపాలన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖర్చుల నిమిత్తం కలెక్టర్లకు రూ.105కోట్లు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.
అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశానికే ఆదర్శంగా తెలంగాణ హరితహారం సాధించిన విజయాలను కేసీఆర్ వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి పంట నాట్లను ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణిలో కాకుండా ముందస్తుగా సకాలంలో నాటు వేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అదే సందర్భంలో గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ గురించి సీఎం ప్రకటించారు.
దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఏర్పడే నాటికి ఉన్న పరిస్థితులను పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పరిపాలనలో సాధించిన గుణాత్మక అభివృద్ధిని సీఎం కేసీఆర్ రంగాల వారీగా వివరించారు. ఏ రోజు కారోజుగా రోజువారీ కార్యక్రమాలను వివరించిన ముఖ్యమంత్రి ఆయారోజు చేపట్టే శాఖలు అవిసాధించిన అభివృద్ధిని వివరిస్తూ అందుకు ప్రభుత్వం అనుసరించిన ప్రజాసంక్షేమ కోణాన్ని తాత్విక ధోరణి దాని వెనకున్న దార్శనికతను కలెక్టర్లకు అర్థమయ్యేలా వివరించారు.
గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు జూన్ 2 నుంచి 22 వరకు ఏరోజున ఏ కార్యక్రమం చేపట్టాలో కలెక్టర్లకు తెలిపారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని వివరించారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణపై సీఎం కేసీఆర్ సమావేశంలో అంశాల వారీగా లోతుగా విశదీకరించారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
పదేండ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానంలో ఆదర్శంగా నిలిచిన ఆయా శాఖలకు సీఎం అభినందనలు తెలిపారు. వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, ఆర్అండ్బీ తదితర శాఖల మంత్రులను అధికారులను సీఎం అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను అనుసరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సాధించిన అభివృద్ధి దేశం నలుదిక్కులా కనిపించేలా తెలంగాణ గరిమ ప్రస్పుటించేలా చాటేందుకు, పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు కృషిచేస్తామని కలెక్టర్లు పేర్కొన్నారు.