హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ముఖాముఖి సమావేశమయ్యారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలపై ఇద్దరు నేతలు విజ్ఞాన్ భవన్లో గంటపాటు చర్చలు జరిపినట్టు తెలిసింది. అనంతరం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్ గోయల్తో కేసీఆర్ సమావేశమయ్యారు. ధాన్యం సేకరణ విషయంలో సహకరించాలని కోరారు.
తెలంగాణలో కొంత కాలంగా ధాన్యం సాగువిస్తీర్ణం భారీగా పెరిగిన విధానాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్లో బాయిల్డ్ రైస్ వాటా కొనుగోలును పెంచాలని, గత యాసంగి బియ్యంపై 30 రోజులు అదనపు గడువు ఇవ్వాలని, వానకాలంలో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని సీఎంకు కేంద్ర మంత్రి చెప్పినట్టు సమాచారం.