హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చింతల్లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్ స్వామితో సీఎం సమావేశమై చర్చించారు. ఫిబ్రవరిలో చినజీయర్ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, సంబంధిత ఏర్పాట్లపై కూడా సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పూర్ణకుంభంతో రుత్వికులు స్వాగతం పలికారు.
ఆశ్రమంలోని యాగశాలకు వెళ్లిన ముఖ్యమంత్రికి… అక్కడ చేసిన ఏర్పాట్లను చినజీయర్ స్వామి వివరించారు. ఈ సందర్భంగా సుదర్శన యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలోనే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
యాగం సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికోసం స్వయంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘురామారెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. అలాగే మిషన్ భగీరథ నీరు కూడా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నిశాఖలు ఈ యాగం కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
యాగం సమయంలో ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలన్నారు. దీంతోపాటు యాగస్థలికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్, మైం హోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు.