సమైక్య పాలకుల వివక్షతో కరువుసీమగా మారిన పాలమూరు గడ్డపై సీఎం కేసీఆర్ సంకల్పంతో అపూర్వ జలదృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
కొల్లాపూర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 25 కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. కొల్లాపూర్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. జీల్దార్తిప్ప లిఫ్ట్, బాచారం హైలెవల్ కెనాల్, పసుపుల బ్రాంచి కెనాల్ వైడెనింగ్, మల్లేశ్వరం మినీ లిఫ్ట్లను వెంటనే సర్వే చేయించి.. మంజూరు చేస్తామని తెలిపారు. బోడగట్టు చెక్డ్యామ్కు రేపే జీవో ఇస్తానని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీకి 15 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. మహబూబ్నగర్ పట్టణానికి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయిస్తానని తెలిపారు.
తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆర్డీఎస్ను కూడా ఆంధ్రా పాలకులే నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు 1954లో ఆర్డీఎస్ కట్టారు.. దాన్ని కూడా నాటి పాలకులే నాశనం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో నేను అలంపూర్ వద్ద మొట్టమొదటి పాదయాత్ర చేశాను. ఆంధ్రాలో ఉన్న నాయకులు కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్టీఎస్ తూములు మూసివేస్తే మళ్లీ బాంబులు పెట్టి ఆర్డీఎస్ బద్దలు కొడుతామని చెప్పారు. సుంకేశుల బరాజ్ వద్ద ఉన్న నాకు రక్తం మరిగింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హెచ్చరించాను. నువ్వు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టడం కాదు.. అక్కడ అడుగు పెడితే.. సుంకేశుల బరాజ్ను 100 బాంబులు పెట్టి లేపేస్తాను అని హెచ్చరించానని కేసీఆర్ గుర్తు చేశారు.
ఆ ప్రకటనను పాలమూరు ప్రజలు తప్పుగా తీసుకోలేదు. మాకు కూడా ఒక బాంబు వేసే మొనగాడు పుట్టిండు.. నీళ్లు వస్తాయని సంతోషపడ్డారు అని కేసీఆర్ తెలిపారు. మనం బాంబులు వేయలేదు. కానీ ఇంటి దొంగలే ప్రాణగండం అయ్యారు. ప్రాజెక్టులను అడ్డుకున్నారు. నాటి ముఖ్యమంత్రులను చూస్తే వారికి లాగులు తడిసిపోయేవి. పదవులకు భయపడి ఆనాడు సమైక్య పాలకులను ప్రశ్నించలేదు. ప్రాజెక్టులు ఎలా కడుతావు.. పాలమూరు పైన ఉన్నది కదా? అని నాటి నాయకులు ప్రశ్నించారు. నీళ్లు కిందకు లేవు వెదవా.. మీ మెదడు మోకాళ్లలో ఉందని చెప్పాను. ఇప్పుడు కూడా బతికే ఉన్నారు. పాలమూరు లిఫ్ట్ పొంగును చూస్తుంటే.. కృష్ణమ్మ తాండవం చేసినట్లు ఉంటుంది. నా ఒళ్లంతా పులకరించి పోయింది. నా జీవితం ధన్యమైంది. ఒకటే పంపు వాగు పారిన రీతిలో ఉంది. కాల్వలు కంప్లీట్ కావాలి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి. నల్లగొండలోని డిండి, మునుగోడుకు నీళ్లు ఇవ్వాలి అని కేసీఆర్ అన్నారు.
పాలమూరును చూస్తుంటే నా కండ్లలో రక్తం వచ్చేది. పాలమూరులో గంజి కేంద్రాలు పెడతారా? ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా మనకు విముక్తి రాదా? చివరకు తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది.
పాలమూరుకు, మా తెలంగాణకు కృష్ణానదిలో ఎంత వాటా వస్తుందో తేల్చాలని అడిగితే పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసింది. నీళ్ల పంపకాలు చేయాలని లేఖ రాయడానికి విశ్వగురు అని చెప్పుకునే ప్రధానమంత్రి మోదీ.. మా అంత సిపాయిలు లేరని చెప్పుకునే బీజేపీ.. పోజులు కొట్టే జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పదేండ్లు పడుతుందా? చీమునెత్తురు ఉంటే కృష్ణా ట్రిబ్యూనల్లో వాటా తేల్చండి. కృష్ణా ట్రైబ్యూనల్ వాటా తేల్చడానికి పదేండ్లు ఎందుకు పట్టిందని ఎవరైనా పాలమూరు జెండా పట్టుకుని వస్తే నిలదీయండి.
ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్లో అడ్డా కూలీ. కానీ ఇవాళ పాలమూరుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారు. స్థానికులు ఇక్కడే తమ పొలాలు పని చేసుకుంటున్నారు. పాలమూరు బిడ్డల మారిన ముఖచిత్రం
2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత తెలంగాణ కోసం గర్జించాం. సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి అని ఆనాడు చంద్రబాబు, ఆయన తాబేదారులు మాట్లాడేవాళ్లు. ఆ టైమ్లో జూరాలను ఎందుకు నింపడం లేదని నిలదీస్తే అప్పుడు ముందుకొచ్చారు. మోకాళ్ల మీద పరుగులు పెట్టి.. కర్ణాటక ప్రాజెక్టుకు డబ్బులు కట్టి.. జూరాల కాల్వకు డబ్బులు కట్టారు.
1975లో బచావత్ తీర్పు ఇచ్చే టైంలో మహబూబ్నగర్ నీళ్లు ఏవని నాటి పాలమూరు పాలకులు అడగలేదని కేసీఆర్ గుర్తు చేశారు. ఆంధ్రాతో తెలంగాణను కలపకుండా ఉంటే.. ఈ ప్రాంతం బాగుపడేది అని బచవాత్ జడ్జిలే అన్నారు. 17 టీఎంసీలతో జూరాల మంజూరు చేస్తున్నామని బచావత్ జడ్జిలే చెప్పారు. సాంకేతిక కారణాలు చెప్పి మేం చూసించిన చోటే కట్టాలని నిబంధన పెట్టారు. 1981 దాకా జూరాలలో ఆంధ్రా పాలకులు తట్టెడు మట్టి తీయలేదు. తెలంగాణ వ్యక్తి అంజయ్య సీఎం అయ్యాక శంకుస్థాపన చేశారు.
పాలమూరు ఎత్తిపోతల పతకం కూడా దాదాపు మూడు నాలుగేండ్ల క్రితమే పూర్తయ్యేది. దాన్ని అడ్డుకున్నవాళ్లు ఎక్కడివాళ్లో కాదు.. ఇదే మహబూబ్నగర్లో ఉన్న గత్తరబిత్తిరి నాయకులు. వాళ్లు చేయలేదు.. ఏనాడు నోరు తెరవలేదు. తెలంగాణకు శత్రువులు ఇతరుల కంటే ఇక్కడ ఉండే దద్దమ్మ రాజకీయ నాయకులే.
తెలంగాణ వస్తేనే సకల దరిద్రాలు మాయమవుతాయి.. మన నీళ్లు మనకొస్తాయి.. మన నిధులు మనకొస్తయి.. మన హక్కులు మనకు వస్తాయని చెప్పిన. దాని దరిమిలా చాలా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. పోరాటం ఎంత చేసినప్పటికీ.. ఎన్నో దిక్కుల ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నప్పటికీ.. మహబూబ్నగర్ ఎంపీగనే నేను తెలంగాణ సాధించా. అదొక చరిత్ర. మహబూబ్నగర్ కీర్తి కిరీటంలో ఆ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది.
పాలమూరు గడ్డపై అపూర్వ జలదృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అద్భుత ప్రాజెక్టుపై యావత్ దేశం దృష్టిపెట్టింది. సోషల్మీడియాలోనూ దీనిపైనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల కల సాకారం చేయడంలో సీఎం కేసీఆర్ కృషిని కీర్తిస్తూ పోస్టులు పెడుతున్నారు. దశాబ్దాల పాలనలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉత్తమాటలు చెప్పి కాలయాపన చేస్తే.. సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేండ్లలోనే అనేక అద్భుతాలను ఆవిష్కరించారని ట్విట్టర్ వేదికగా కొనియాడుతున్నారు. దీంతో #PalamuruRangareddyProject హ్యాష్ట్యాగ్ ట్విట్టర్ ( ఎక్స్)లో ట్రెండింగ్గా మారింది.
మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉన్నాయి. కృష్ణానది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గుండా 300 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నది. వ్యవసాయోగ్యమైన భూములు నది సాధారణ ప్రవాహ స్థాయికి 270 మీటర్ల నుంచి 660 మీటర్ల ఎత్తున ఉంటాయి.
ఈ నేపథ్యంలో లిఫ్ట్లు ఏర్పాటుచేసి తాగు, సాగునీటిని అందించడం అనివార్యంగా మారింది. ఉమ్మడిరాష్ట్రంలో ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఎప్పటికప్పుడు స్థానిక రైతుల డిమాండ్ మేరకు వాగులు, చెరువుల మీద చిన్నచిన్న ఐడీసీ లిఫ్ట్లను ఏర్పాటుచేసి, వానకాలంలో వరదను ఎత్తిపోసి 5 నుంచి 10 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించేవారు. ఆ లిఫ్ట్లకయ్యే కరెంటు చార్జీల భారాన్ని కూడా రైతులపైనే మోపారు.
రాష్ట్రంలో మొత్తం ఐడీసీ లిఫ్ట్స్కీమ్లు 640 ఉండగా, అందులో అత్యధిక లిఫ్ట్లు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నాయి. అందులో ఆయకట్టుపరంగా పాలమూరుది అగ్రస్థానం. తెలంగాణ ఉద్యమ సమయంలో లిఫ్ట్లు ఏర్పాటుచేయాలనే డిమాండ్ రావడంతో ఉమ్మడి పాలకులు తూతూమంత్రంగా పలు లిఫ్ట్లను ప్రకటించినప్పటికీ, వాటి సామర్థ్యం అతి స్వల్పమే. రాష్ట్ర ఏర్పాటు వరకూ ఆయా ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. కృష్ణాబేసిన్లో ఇప్పటివరకు ఉన్న అన్ని లిఫ్ట్స్కీమ్ల సామర్థ్యం అర టీఎంసీ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే అత్యధిక నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ కానున్నది. అత్యధికంగా 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే పథకమూ ఇదే కావడం మరో విశేషం.
ప్రాజెక్టుల నిర్మాణమే కాదు వాటికి పేర్లు పెట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తారు. స్థానికంగా ఉండే ఇలవేల్పుల పేర్లను అక్కడి నిర్మాణాలకు పెడుతూ భక్తిని, ప్రాజెక్టులపై అనురక్తిని చాటుకొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, శ్రీరాజరాజేశ్వర జలాశయాల పేర్లే అందుకు నిదర్శనం. ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని రిజర్వాయర్లకు పేర్లు పెట్టడంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే సంప్రదాయాన్ని చాటడం విశేషం.
జలాశయాలన్నింటికీ స్థానిక దైవాల పేరునే పెట్టారు. నార్లాపూర్ సమీప గుట్టపైకొలువైన అంజనేయుడి పేరు మీదుగా నార్లాపూర్ రిజర్వాయర్కు అంజనగిరిగా, ఏదులలో నిర్మించిన జలాశయానికి సమీప ఎర్రగట్టు ఆంజనేయస్వామి పేరుమీదుగా వీరాంజనేయ రిజర్వాయర్గా, వట్టెంలోని వేంకటేశ్వరస్వామి పేరు మీదుగా వట్టెం రిజర్వాయర్కు వెంకటాద్రి రిజర్వాయర్గా, కరివెన రిజర్వాయర్కు సమీపంలోని కురుమూర్తిరాయ దైవం పేరును ఖరారు చేశారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మించిన పలు జలాశయాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో మొత్తంగా రెండు జంట జలాశయాలున్నాయి. ఇప్పటికే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా 0.25 టీఎంసీతో 345 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఎల్లూరు రిజర్వాయర్ను ఆనుకొనే దానికి సమాంతరంగా అదే లెవల్లో నార్లాపూర్ వద్ద పాలమూరు ప్రాజెక్టులో భాగంగా అంజనగిరి రిజర్వాయర్ను నిర్మించారు. ఆ రెండు రిజర్వాయర్లను అనుసంధానించారు. 345 లెవల్ వల్ల రెండు రిజర్వాయర్లలో ఒకే స్థాయిలో జలాలు ఉండనున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కల్వకుర్తి లిఫ్ట్లతో పనిలేకుండానే ఎల్లూరు రిజర్వాయర్ను నింపే వెసులుబాటు కలుగనున్నది.
అదేవిధంగా వెంకటాద్రి, కురుమూర్తిరాయ రిజర్వాయర్లను కూడా ఒకరకంగా జంట జలాశయాలుగా పిలుస్తారు. ప్రాజెక్టు మొత్తంలో సొరంగమార్గం లేకుండా 9.75 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ఉన్నది ఈ రెండు రిజర్వాయర్ల మధ్యనే కావడం విశేషం. ఇక కురుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లకు మరో ప్రత్యేకత ఉన్నది. ప్రాజెక్టు మొత్తంలో ఈ రెండు రిజర్వాయర్ల మధ్య నీరు బయటకు కనిపించకుండా పూర్తిగా 8.9 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన సొరంగమార్గం గుండా ప్రవహించనుండటం మరో విశేషం. ఇక రిజర్వాయర్ల మధ్య కూడా అనేక ఐలాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం వీరాంజనేయ రిజర్వాయర్ మధ్యలో రంగనాయకసాగర్ తరహాలో గెస్ట్హౌజ్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండటం మరో విశేషం.
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల, వట్టెం వద్ద నిర్మిస్తున్న సొరంగ మార్గాలు రాష్ట్రంలోనే అతిపెద్దవిగా రికార్డులకు ఎక్కనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు 3 ఫేజ్లో నిర్మిస్తున్న టన్నెల్ వ్యాసార్థం 5.6 డయామీటర్లు మాత్రమే. ఎస్ఎల్బీసీ టన్నె ల్ వ్యాసార్థం 2.10 డయామీటర్లు. కా గా వాటన్నింటి రికార్డులను కాళేశ్వరం ప్రాజెక్టు బ్రేక్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 10 డయా మీటర్ వ్యాసార్థంతో నిర్మించిన సొరంగమార్గాలే ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక వ్యాసార్థంతో నిర్మించిన సొరంగమార్గాలు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డును కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రేక్ చేయనుండటం విశేషం.
రాష్ట్రంలోనే మొదటిసారిగా 11.5 డయా మీటరు వ్యాసార్థంతో సొరంగమార్గాలను నిర్మిస్తున్నారు. అంజనగిరి (నార్లాపూర్) రిజర్వాయర్ నుంచి ఏదుల పంప్హౌస్కు నీటిని తరలించేందుకు 2 సొరంగాలను, వీరాంజనేయ (ఏదుల) జలాశయం నుంచి వెంకటాద్రి (వట్టెం) జలాశయానికి జలాలను కాలువతోపాటుగా 19 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న 2 సొరంగాలను మొదటిసారిగా 11.5 వ్యాసార్థంతో నిర్మిస్తుండడం విశేషం.
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను రెండు కిలోమీటర్ల అప్రోచ్ చానల్ ద్వారా తొలుత హెడ్రెగ్యులేటర్కు, అక్కడి నుంచి మూడు సొరంగాల ద్వారా నార్లాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడి నుంచి ఎనిమిది పంపుల ద్వారా 104 మీటర్ల మేర ఎత్తి అంజనగిరి రిజర్వాయర్లోకి పోస్తారు. అక్కడి నుంచి ఓపెన్ కెనాల్, సొరంగ మార్గం నుంచి ఏదుల పంప్హౌజ్కు తరలిస్తారు. అక్కడ తొమ్మిది మోటార్ల ద్వారా 124 మీటర్ల మేర ఎత్తిపోస్తారు. ఈ జలాలు వీరాంజనేయ రిజర్వాయర్లోకి వెళ్తాయి. ఆ తర్వాత రిజర్వాయర్ నుంచి జలాలను కాల్వలు, సొరంగాల ద్వారా నీటిని వట్టెం పంప్హౌజ్కు జలాలను తరలిస్తారు. అక్కడి నుంచి తొమ్మిది మోటర్ల ద్వారా 121 మీటర్లపైకి ఎత్తి వెంకటాద్రి రిజర్వాయర్లో పోస్తారు.
అనంతరం అక్కడి నుంచి 14 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా జలాలను కురుమూర్తి రిజర్వాయర్కు తరలిస్తారు. అనంతరం కురుమూర్తి రిజర్వాయర్ నుంచి 8.5 కిలోమీటర్ల పొడవున నిర్మించిన సొరంగాల నుంచి ఉద్దండాపూర్ సర్జ్పూల్కు తరలిస్తారు. అక్కడ ఐదు మోటర్ల ద్వారా 122 మీటర్ల మేర లిఫ్టు చేసి ఉద్దండాపూర్ రిజర్వాయర్లో పోస్తారు. ఇలా… సముద్రమట్టానికి 345 మీటర్ల ఎత్తులో ఉన్న కృష్ణా జలాలను వివిధ దశల్లో ఎత్తిపోస్తూ.. పలు రిజర్వాయర్లలో నిల్వ చేస్తూ… చివరకు 629 మీటర్ల ఎత్తులో ఉన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కు తరలిస్తారు. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 15.91 టీఎంసీలు. ఈ రిజర్వాయర్ నుంచే బీడు భూముల్లోకి భారీ ఎత్తున కృష్ణా జలాలు పారనున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు) పరిధిలోని 6.18 లక్షల ఎకరాలకు పైగా భూములకు సాగునీరు అందనున్నది.
దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ఖ్యాతి దక్కించుకోనున్న ఈ పథకం రూపశిల్పి సీఎం కేసీఆర్.. అంతటి లిఫ్ట్ ఇరిగేషన్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లిఫ్ట్ పరిధిలో నిర్మించిన అండర్గ్రౌండ్ సర్జ్పూల్స్ ఆసియాలోనే అతిపెద్దవి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంజనగిరి, వనపర్తి జిల్లా ఏదుల వద్ద నిర్మించిన సర్జ్పూల్స్ ఆసియాలోనే బిగ్గెస్ట్గా రికార్డు నమోదు చేయనున్నాయి. ఒక్కోటి 255 మీటర్ల పొడవు.. 20 మీటర్ల వెడల్పు.. 74 మీటర్ల ఎత్తు ఉన్నాయి. ఇంత భారీగా ఆసియాలోనే మరెక్కడా లేవని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. ఇక బాహుబలిని మించిన పంపులు ఇక్కడ బిగించారు. జీరో పాయింట్ నుంచి 24,000 క్యూసెక్కుల నీరు గ్రావిటీ కాల్వలోకి వస్తుంది. అక్కడి నుంచి హెడ్రెగ్యులేటరీ మీదుగా ఒక్కోటి వెడల్పు 11 మీటర్లు, ఎత్తు 11 మీటర్లు ఉండే టన్నెల్లో మీదుగా సర్జ్పూల్లోకి వెళ్తాయి. నిత్యం ఒక్కో పంపు 0.25 టీఎంసీలను ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నాయి. ఇలా ఎనిమిది పంపులు ఒక్కో రోజులో రెండు టీఎంసీలు ఎత్తిపోసేలా వీటిని డిజైన్ చేశారు. సర్జ్పూల్లోకి వచ్చే చెత్తాచెదారాన్ని అడ్డుకునేందుకు టన్నెల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందుకే ఈ ఎత్తిపోతల పథకం ఓ ఇంజినీరింగ్ అద్భుతమన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధాన నీటి తరలింపు నెట్వర్క్ పొడవు 112.06 కిలోమీటర్లు కాగా, అందులో ప్రధాన ఓపెన్ కాలువ 50.49 కిలో మీటర్లు.. కాగా మిగిలిన 61.08 కిలోమీటర్ల మార్గమంతా సొరంగమే కావడం విశేషం. అదీగాక ప్రాజెక్టుకు నీటిని తీసుకునే ఇన్టేక్ పాయింట్ నుంచే సొరంగ నిర్మాణాలు ప్రారంభం కావడం మరో విశేషం. నీటిని శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్వాటర్ నుంచి తొలుత ఓపెన్ అప్రోచ్ కెనాల్ ద్వారా నార్లాపూర్ హెడ్రెగ్యులేటర్కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్ సర్జ్పూల్కు తీసుకెళ్తారు.
☞ నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్ నుంచి ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్కు మొత్తంగా 21.68 కిలోమీటర్ల కెనాల్ ఏర్పాటు చేయగా, అందులో 5.92 కిలోమీటర్లు మాత్రమే ఓపెన్ కెనాల్. అక్కడి నుంచి 15.75 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన రెండు సొరంగమార్గాల గుండా కృష్ణమ్మ ప్రవహించి తుదకు వీరాంజనేయ రిజర్వాయర్కు చేరుకొంటుంది.
☞ వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్కు నీటిని తరలించేందుకు మొత్తంగా 25.100 కిలోమీటర్ల కెనాల్ను తవ్వారు. అందులో కేవలం 3.100 కిలోమీటర్లు మాత్రమే ఓపెన్కాలువ కాగా, మిగతా మొత్తం సొరంగ మార్గమే. అందుకోసం 22 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను తవ్వారు.
☞ ఇక ప్రాజెక్టులో మొత్తంగా 9.750 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారానే నీరు తరలిపోయేది కేవలం వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి కురుమూర్తిరాయ (కరివెన) రిజర్వాయర్కు మాత్రమే.
☞ కురుమూర్తి రిజర్వాయర్ నుంచి ఉద్దండాపూర్ రిజర్వాయర్కు ప్రాజెక్టు మొత్తంలో ఓపెన్ కెనాల్ లేకుండానే పూర్తిగా 8.935 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారానే నీటిని తరలిస్తుండడం విశేషం. అందుకోసం రెండు సొరంగాలను ఏర్పాటు చేశారు.
☞ సొరంగమార్గాలు మినహాయించిన దాదాపు 10 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ ప్రెషర్ మెయిన్స్ పైపులు, అండర్గ్రౌండ్ సర్జ్పూల్స్, డ్రాఫ్ట్ ట్యూబుల గుండానే పరుగులు తీయనుండడం విశేషం.
☞ ప్రాజెక్టులో నీటి తరలింపు కోసం ప్రధాన సొరంగమార్గాలు కాకుండా ఇతరత్రా వాటి కోసం సొరంగమార్గాలను నిర్మించారు. పంప్హౌస్లు, సర్జ్పూల్స్ నిర్మాణం కోసం, వాటిని చేరుకునేందుకు, నిర్వహణ కోసం, అత్యవసర పరిస్థితుల్లో లోపలి సిబ్బంది బయటకు వచ్చేందుకు ఎస్కేప్ టన్నెల్స్ను కూడా అదనంగా నిర్మించారు. ఒక్కో పంప్హౌస్ వద్ద నిర్మించిన ఆ సొరంగమార్గాల మొత్తం సగటు పొడవు 5-7 కిలోమీటర్లు పైనే కావడం విశేషం.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ సాంకేతిక అద్భుతం. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ఏర్పాటు చేసిన వాటర్ కండక్టర్ సిస్టమ్ పొడవు మొత్తంగా 112 కిలోమీటర్లు కాగా.. అందులో 61.08 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉండడం విశేషం. ప్రధాన ఓపెన్ కెనాల్ పొడవు కేవలం 50 కిలోమీటర్లు.. అంటే కృష్ణమ్మ నీళ్లు ఎక్కువ భాగం భూగర్భంలోనే పరవళ్లు తొక్కనున్నాయి. అదీగాక భారీ జలాశయాలు, వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్న్లు, సబ్ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి.
మిగతా నిర్మాణాలన్నీ పెద్దపెద్ద పంప్హౌస్లు, సర్జ్పూల్స్ భూగర్భంలోనే ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతులో నిర్మితమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్టు యావత్తు ఓ భూగర్భ అద్భుతం. ఒక్కో సర్జ్పూల్ సగటు లోతు 75 మీటర్లు కావడం విశేషం. ప్రాజెక్టులో పంప్హౌస్లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్ ద్వారా సగటున కిలో మీటర్ వరకు ప్రయాణించాల్సి ఉంది.
రాష్ట్ర ఇంజినీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్కు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన కేసీఆర్ కొల్లాపూర్కు బయల్దేరి వెళ్లారు. మార్గమధ్యలో నాగర్కర్నూల్ తేజ గార్డెన్స్లో లంచ్ చేసి.. కొల్లాపూర్కు వెళ్లారు కేసీఆర్. నాగర్కర్నూల్లో కేసీఆర్కు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న స్వాగతం పలికారు.
సాధారణంగా మన ఇండ్లల్లో ఒక హెచ్పీ (హార్స్ పవర్) మోటర్ను వాడుతుంటాం. వ్యవసాయ బోర్లు, బావులకైతే 5 హెచ్పీ మోటర్లను వినియోగిస్తారు. కానీ ఈ పథకంలో ఉపయోగిస్తున్న ఒక్కో మోటర్ సామర్థ్యం అక్షరాలా 1,94,445 హార్స్పవర్. ఒక మెగావాట్ 1,341 హెచ్పీకి సమానం. ఈ లెక్కన 145 మెగావాట్లు 1,94,445 హెచ్పీ అవుతుంది. అంటే ఈ ఒక్క మోటర్.. వ్యవసాయ బావులకు వాడే 38,889 మోటర్లకు సమానం అన్నమాట. 5
హెచ్పీ మోటర్ నుంచి 2.5 అంగుళాల నుంచి 3 అంగుళాల వ్యాసార్థంలో నీరు బయటకు వస్తే, 145 మెగావాట్ల మోటర్ నుంచి వచ్చే నీరు ఏకంగా 5 మీటర్ల వ్యాసార్థంతో ఉండే పైపుల నుంచి 124 మీటర్లనిండుగా వస్తుంది. 5 మీటర్ల వ్యాసార్థం అంటే.. ఒక ట్రక్కు ఆ పైపులో నుంచి ప్రయాణించవచ్చన్నమాట. ఆ స్థాయిలో ఈ మోటర్ నీటిని పంపింగ్ చేస్తుంది. పది గుర్రాల బలం ఒక ఏనుగు శక్తికి సమానమని చెప్తుంటారు. ఈ లెక్కన కాళేశ్వరంలోని 139 మెగావాట్ల మోటర్ 18,640 ఏనుగుల శక్తికి సమానం. పాలమూరు రంగారెడ్డిలో ఉపయోగిస్తున్న 145 మెగావాట్ల మోటర్ 19,444 ఏనుగుల శక్తికి సమానం.
ఇంతటి భారీ మోటర్లను నడిపించాలంటే అదే స్థాయిలో విద్యుత్తు అవసరం. అందుకే ఒక్కో పంపు హౌజ్ దగ్గర 400/11 కేవీ సామర్థ్యంగల సబ్స్టేషన్ను నిర్మించారు. సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకే రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. వీటిని నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్ పంప్హౌజ్ల వద్ద ఏర్పాటు చేశారు. 400 కేవీ సబ్స్టేషన్ నుంచి భారీ కేబుళ్ల ద్వారా విద్యుత్తును మోటర్లకు అనుసంధానిస్తారు. 34 మోటర్లకు 3,665 మెగావాట్ల విద్యుత్తు అవసరం. అందుకు తగినట్టుగానే విద్యుత్తు సంస్థలు ఏర్పాట్లు చేశాయి.
నీటిపారుదల ప్రాజెక్టుల్లో పీఆర్ఎల్ఐఎస్ కొత్త చరిత్ర సృష్టించనున్నది. అత్యధిక సామర్థ్యంగల మోటర్లను వినియోగిస్తున్న ప్రాజెక్టుగా ఇది రికార్డు నెలకొల్పనున్నది. కృష్ణా నది బ్యాక్ షోర్లోని జలాలను సముద్ర మట్టానికి 232.5 మీటర్ల ఎత్తు నుంచి, 629 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడమంటే మాటలు కాదు. దాదాపు నాలుగు వందల మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడానికి నాలుగు దశల్లో పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఏదుల పంప్హౌజ్లో ఏర్పాటు చేసిన మోటర్లు నీటిని ఏకంగా 124 మీటర్లపైకి ఎత్తిపోయనున్నాయి. 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ఈ పథకంలో భాగంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజులపాటు మొత్తం 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పంపులను అమర్చుతున్నారు
.
ఈ ప్రాజెక్టులో బిగిస్తున్న 145 మెగావాట్ల మోటర్ గరిష్ఠంగా 85 క్యూమెక్ల నీటిని పంపింగ్ చేస్తుంది. ఒక క్యూమెక్ అంటే 35.313 క్యూసెక్కులు. ఈ లెక్కన 3,000 క్యూసెక్కులకు మించిన సామర్థ్యంతో ఒక్కో మోటర్ నీటిని పంపింగ్ చేస్తుంది. నార్లాపూర్లోని మొత్తం 8 పంపుల (మరొక పంప్ను రిజర్వ్లో ఉంచుతారు) ద్వారా 24,000 క్యూసెక్కుల నీటిని 106 మీటర్ల ఎగువకు పంపింగ్ చేస్తాయి. నార్లాపూర్లో ఉండే పంపులు కృష్ణానది బ్యాక్ షోర్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి పంపింగ్ చేస్తాయి. అలాగే ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్లో ఉండే మోటర్లు 2,650 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని ఎత్తిపోస్తాయి. ఏదుల, వట్టెంలో 9 చొప్పున ఉన్న మోటర్ల ద్వారా సుమారు 23,840 క్యూసెక్కుల ప్రవాహం రిజర్వాయర్లలోకి వస్తుంది. ఇలా 24 గంటలు మోటర్లు నడిస్తే 2 టీఎంసీలు అవుతాయి. రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని తోడిపోసుకోవచ్చు.
☞ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉపయోగిస్తున్న మోటర్లు ఏ రకంగా చూసుకున్నా రికార్డే అని చెప్పవచ్చు.
☞ ఒక్కో మోటర్ (పంప్ కాకుండా) బరువు 550 టన్నులు.
☞ రోటర్, షాఫ్ట్ (టాప్ అండ్ బాటమ్) బరువు 220 టన్నులు. ఒక్క రోటర్ బరువే 160 టన్నులు. రోటర్, స్టేటర్లకు విద్యుత్తు సరఫరా చేస్తే.. వాటి మధ్య అయస్కాంత శక్తి పుడుతుంది. దీనితో రోటర్ తిరుగుతుంది. దీనికి అనుసంధానించిన షాఫ్ట్, దానికి అనుసంధానించిన ఇంపెల్లర్ తిరుగుతాయి. దీనితో సర్జ్ఫూల్ నుంచి వచ్చే నీటిని సుడి తిప్పుతూ బలంగా పైపుల్లోకి నెడుతుంది.
☞ స్టేటర్ బరువు 200 టన్నులు. ఇందులో వాడే రాగి తీగ (కాయిల్స్) బరువే సుమారు 2 టన్నులు ఉంటుంది.
☞ మెయిన్ షాఫ్ట్ బరువు 33.5 టన్నులు. ఇది ఒక పెద్ద స్థంభంలా ఉంటుంది. ఇది రోటర్ను, దిగువన ఉండే పంప్ ఇంపెల్లర్ను అనుసంధానిస్తుంది. దీని వ్యాసార్థం 0.864 మీటర్లు. దీని చుట్టు కొలత 2.5 మీటర్లు. అంటే ఒక మనిషి తన రెండు చేతులు చాచి ఆలింగనం చేసుకున్నా సరిపోవన్నమాట.
☞ పంప్ ఇంపెల్లర్ బరువు 36 టన్నులు. సర్జ్పూల్ నుంచి వచ్చే నీటిని వేగంగా తిప్పుతూ బలంగా పైపుల నుంచి బయలకు పంపిస్తుంది.
☞ ఈ మోటర్ 214.3 ఆర్పీఎం వేగంతో తిరుగుతుంది. అంటే కన్నుమూసి తెరిచేంతలో 3.57 సార్లు తిరుగుతుందన్నమాట.
సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్ష, పట్టుదల వల్లే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ఆవిష్కృతమవుతున్నదని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తున్న పాలమూరు జిల్లావాసుల కల సాకారమవుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల బృందం ఇటీవల సందర్శించింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అంజనగిరి రిజర్వాయర్, నీటి ఎత్తిపోతలకు సిద్ధమైన మోటర్లు, పంప్హౌస్లను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు.
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లిఫ్ట్-1లో 8+1, ఏదుల, వట్టెం రిజర్వాయర్ల వద్ద 9+1, ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద 5+1 మోటర్లను ఏర్పాటు చేయనుండగా.. 8 మాత్రమే పంపింగ్కు వినియోగించనున్నారు. ఒకటి చొప్పున ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ లిఫ్టుల్లో ఒక్కో మోటరు సామర్థ్యం 145 మెగావాట్లు కాగా నార్లాపూర్లో ఒక్కో మోటర్ 85 క్యూసెక్కులను, మిగిలిన లిఫ్టుల్లో 75 క్యూసెక్కుల చొప్పున నీళ్లను ఎత్తిపోయనున్నాయి. ఇలా రోజుకు 1.5 టీఎంసీల చొప్పున శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 60 రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేలా ప్రాజెక్టు అందుబాటులోకి రానుండటం విశేషం. ఇక ప్రాజెక్టు పనులకు అవసరమైన విద్యుత్ కోసం నాలుగు 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను సైతం రూ.2 వేల కోట్లకుపైగా నిధులతో పూర్తి చేయడం, చార్జింగ్ ప్రక్రియ పూర్తయింది.
స్వరాష్ట్రంలో చేసుకున్న సాగునీటి ప్రణాళికలన్నీ 70 ఏండ్లపాటు వలస పాలకులు అటకెక్కించారు. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 107, 108 ప్రకారం నదీ జలాల వినియోగం కోసం హైదరాబాద్ స్టేట్ రూపొందించిన ప్రాజెక్టుల ద్వారా మహబూబ్నగర్ జిల్లాకు జలాలను కేటాయించే అవకాశమున్నా ఏనాడూ ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. మహబూబ్నగర్ దుర్భర పరిస్థితిని చూసి బచావత్ ట్రిబ్యునల్ చలించిపోయి జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు కేటాయించడమేకాదు.. ఆ జలాలను మహబూబ్నగర్ జిల్లాలో మాత్రమే వినియోగించాలని ఉమ్మడి ఏపీ సర్కారుకు షరతులు పెట్టింది. 70 ఏండ్ల అనంతరం నేడు తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మొక్కవోని సంకల్పంతో నాటి ప్రణాళికలన్నీ జీవం పోసుకొన్నాయి. హైదరాబాద్ స్టేట్ మహబూబ్నగర్ జిల్లాలో 174 టీఎంసీల జలాలతో 7 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే దశాబ్దాల స్వప్నం.. సాకారమైంది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మించిన పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించేందుకు శనివారం సీఎం కేసీఆర్ కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్కు చేరుకొంటారు. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలతో కలిసి పూజలు చేయనున్నారు. అనంతరం లిఫ్ట్లోని కంట్రోల్ రూమ్లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్ చేస్తారు. అక్కడే సర్జ్పూల్, పంప్హౌస్ను పరిశీలించి, అక్కడి నుంచి నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకొంటారు. రిజర్వాయర్ వద్ద డెలివరీ సిస్టర్న్స్ నుంచి వచ్చే కృష్ణా జలాలకు పూజలు చేసి, పుష్పాభిషేకం చేస్తారు. అనంతరం ఎత్తిపోతల పథకంలో భాగస్వాములైన ఇరిగేషన్ ఉన్నతాధికారులను అభినందించనున్నారు. అనంతరం ఉన్నతాధి కారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, మిగిలిన మూడు రిజర్వాయర్లకు నీటిని తరలించే ప్రక్రియను అడిగి తెలుసుకొంటారు. అనంతరం కొల్లాపూర్ సభా వేధిక వద్దకు చేరుకుంటారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని (పీఆర్ఎల్ఐఎస్)కి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్కర్నూల్, మహబూబ్నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు అధికారయంత్రాంగం సన్నాహాలు చేసింది.
నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయల్దేరారు. రోడ్డు మార్గాన కేసీఆర్ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగర్కర్నూల్లోని తేజ గార్డెన్స్కు చేరుకోని.. అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2:30కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్కు చేరుకుంటారు. అనంతరం కంట్రోల్ రూమ్లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోల్లాపూర్లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ప్రగతి భవన్కు చేరుకుంటారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (PRLIS) భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించనున్నారు. దీంతో సమైక్య పాలకుల వివక్షతో కరువుసీమగా మారిన పాలమూరు గడ్డపై నేడు అపూర్వ జలదృశ్యం ఆవిష్కృ తం కానుంది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల సాగునీటి గోసను శాశ్వతంగా తీర్చేందుకు కృష్ణమ్మ బిరబిరా తరలిరానున్నది. దశాబ్దాల కల నెరవేరుతుండటంతో పాలమూరు ప్రజలు అనందంలో మునిగి తేలుతున్నారు. సీఎం కేసీఆర్ పర్యటణ నేపథ్యంలో కొల్లాపూర్ పట్టణం బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది.