హైదరాబాద్ : తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రగతి భవన్లో ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. నిఖత్ జరీన్, ఇషా సింగ్, వారి కుటుంబ సభ్యులతో కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో ముచ్చటించారు. ఇవాళ ఉదయం పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిఖత్ జరీన్, ఇషా సింగ్ను సీఎం కేసీఆర్ సన్మానించి, రూ. 2 కోట్ల నగదును అందించిన సంగతి తెలిసిందే.
బాక్సింగ్ పట్ల చిన్నప్పట్నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమ గురించి నిఖత్ జరీన్ను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. స్వయంగా క్రీడాకారుడైన తన తండ్రి జమీల్ అహ్మద్ తనకు బాల్యం నుంచే అందించిన ప్రేరణ, ప్రోత్సాహం గురించి సీఎంకు ఆమె వివరించారు. తాను బాక్సింగ్లో శిక్షణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపాయని నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక సమయంలో అన్ని విధాలా సాయం అందించినందుకు సీఎం కేసీఆర్కు నిఖత్ జరీన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణ పథాకాన్ని సాధించిన ఇషాతో కూడా సీఎం కేసీఆర్ ముచ్చటించారు. చిన్నతనంలోనే షూటింగ్ క్రీడలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఇషాను అభినందించారు. ఇషాను గొప్ప క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన ఆమె తల్లిదండ్రులు సచిన్ సింగ్, శ్రీలతను సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు.
నిఖత్ జరీన్ పట్టుదలను, ఆత్మస్థైర్యాన్ని సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణ క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా వుంటానని, క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీరకంగా, మానసికంగా, ధృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన నిఖత్ జరీన్, ఇషా సింగ్లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్పూర్తి పొందాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మల్యే గణేశ్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఘనంగా సన్మానించి, ఆతిథ్యం ఇచ్చారు. pic.twitter.com/1fMYxMMI00
— Namasthe Telangana (@ntdailyonline) June 2, 2022