హైదరాబాద్ : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జ్యుడిషీయల్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. హైకోర్టు ప్రాంగణం నుంచి 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్తో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు చాలా మంచి దినం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో ఒకసారి తెలంగాణ హైకోర్టు ప్రారంభోత్సవానికి వచ్చాను. ఇప్పుడు మళ్లీ 33 జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమనంలో ఉంది. చాలా అంశాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం ఉజ్వలంగా దేదీపమాన్యంగా దూసుకుపోతోంది. ఎన్వీ రమణ ఇదే హైకోర్టులో పని చేసినటువంటి ఈ గడ్డబిడ్డ. వారు ఎంతో పెద్ద మనసుతో కేంద్రంతో మాట్లాడి మన హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచారు. వెంటనే నియామకాలు చేపట్టి, ఒక పటిష్టమైన కోర్టుగా రూపుదిద్దుకున్నాం.
లోయర్ జ్యుడిషీయరీలో పటిష్టత కోసం ఇటీవలి కాలంలో న్యాయశాఖ అధికారులతో మే సుదీర్ఘమైన భేటీ నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. జిల్లా కోర్టులు కావాలని కోరిన వెంటనే సీజే అంగీకరించి.. ఏర్పాటు చేశారు. ఇవాళ జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం మనందరికీ గర్వకారణం. సెషన్స్ కోర్టులకు వెళ్లేందుకు ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరిపాలనలో సంస్కరణలను అమలు చేశాం. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఎన్నో సత్ఫలితాలను సాధించాం. పటిష్టమైన జ్యుడిషీయరీ ఏర్పాటు కావాలని సీజేను కోరాం. ఆయన వెంటనే మంజూరు చేసి ముందుకు వెళ్తున్నారు. ఈ కోర్టులకు కావాల్సిన సిబ్బందిని మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిటి సివిల్ కోర్టులు, రంగారెడ్డి కోర్టు చాలా ఓవర్ లోడెడ్గా ఉన్నట్టు సమాచారం అందింది. వీటిని కూడా విభజించాలని అనుకుంటున్నాం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తుందన్నారు. దీంతో ప్రజలకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.