ఏండ్ల నాటి కలలను నిజం చేస్తూ.. కుట్రల సంకెళ్లను తెంచుకొని.. కొండకోనలను దాటి నింగికెసిన కృష్ణమ్మ తాండవాన్ని తనివితీరా చూస్తూ పాలమూరు గడ్డ పరవశించింది. గడియ కూడా రెప్పవాల్చకుండా.. ఊపిరిబిగపట్టి.. ఒళ్లంత కళ్లుజేసుకొని.. మనసులోనే కోటిదేవుళ్లను తలుచుకొంటూ నార్లాపూర్ వేదికగా ఆవిష్కృతమైన అద్భుత సుజలదృశ్యాన్ని వీక్షిస్తూ తన్మయత్వంలో మునిగింది. దశాబ్దాల కలసాకారం జేసిన మహానాయకుడు కేసీఆర్కు పబ్బతి పట్టింది. కరతాళధ్వనులు.. ఈలలతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. డప్పుచప్పుళ్ల జయజయ ధ్వానాలతో స్వాప్నికుడు.. సాధకుడికి నీరాజనం పలికింది. ముఖ్యమంత్రి ప్రసంగంతో గతాన్ని తడిమిచూసుకొన్నది. భవిష్యత్తు అంతా కేసీఆర్తోనే అని నినదించింది.
కొల్లాపూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి, సెప్టెంబర్ 16: పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా కొనసాగింది. ఎదురెక్కి వచ్చే కృష్ణవేణమ్మ పరవళ్లను కనులారా చూసేందుకు ఉమ్మడి మహబూబ్నగర్తోపాటు రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్హౌజ్ చేరుకున్నది మొదలు పైలాన్ ఆవిష్కరణ, ప్రత్యేక పూజలు నిర్వహించి, మోటర్ను ఆన్చేయడం వరకూ ప్రతి దృశ్యాన్ని మైమరచి చూశారు. డెలివరీ సిస్టర్న్ వద్ద పాలనురగలు కక్కుతూ.. ఎగిసెగిసిపడుతూ ఉప్పొంగుతూ కృష్ణమ్మ చేసిన తాండవాన్ని చూస్తూ ఒక్కసారిగా పాలమూరు గడ్డ పరవశించిపోయింది. ఫొటోలను తీసుకుంటూ ఆ ఉద్విగ్న క్షణాలను యువత పదిలపరచుకొన్నది.
సీఎం కేసీఆర్కు జయజయధ్వానాలు
నార్లాపూర్ నుంచి కొల్లాపూర్కు సీఎం కేసీఆర్ బయలుదేరగానే సభా ప్రాంగణం పెద్దపెట్టున జై కేసీఆర్ నినాదాలతో మార్మోగింది. ఈలలు.. డప్పు చప్పుళ్లతో హోరెత్తింది. సీఎం కేసీఆర్ కొల్లాపూర్ సభ ప్రాంగణం దరిదాపుల్లోకి చేరుకోగానే పాలమూరు బిడ్డల సంబురం అంబరాన్నంటింది. సభావేదికపైకి చేరుకున్న అనంతరం దాదాపుగా 10 నిమిషాలపాటు ఈలలతో సభికులు హోరెత్తించారు.
సభ ఆద్యంతం హర్షాతిరేకాలు
పాలమూరు ఎత్తిపోతల విజయవంతాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించగానే సభాప్రాంగణం నిశ్శబ్దంగా మారిపోయింది. పాలమూరు గత దీన పరిస్థితిని వివరించడంతోపాటు సీమాంధ్ర పాలకులు, స్థానిక నాయకులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేసిన విద్రోహాన్ని, ఆర్డీఎస్ దుస్థితి, దుమ్ముకొట్టుకుపోయిన దుందుభిని, పెద్దవాగు ఎండిపాయెరా అంటూ గోరెటి వెంకన్న పాలమూరు వాగులపై రాసిన పాటలను వివరించగా సభికులు గతాన్ని స్మరించుకున్నారు. ఇప్పటికీ కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చకుండా వివక్షచూపుతున్న కేంద్రంలోని మోదీ సర్కారుపై నిప్పులు చెరగగా, సభికులు కరతాళ ధ్వనులతో తమ మద్దతు పలికారు. తెలంగాణ స్వరాష్ట్రంలో మిషన్కాకతీయ, చెక్డ్యామ్ల నిర్మాణం, మిషన్ భగీరథ తదితర పథకాల ద్వారా ఇప్పటికే పాలమూరు సాధించిన అద్భుత విజయాలను వివరించగా..జేజేలు పలికారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కల సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి, ఆ దిశలో ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించి తుదకు విజయవంతం చేయడానికి చేసిన కృషి, ప్రాజెక్టు ద్వారా రాబోయే కాలంలో ఒనగూరే ప్రయోజనాలను వివరించగా ఆసక్తిగా ఆలకించారు.
మాట నిలుపుకొన్న మహానాయకుడు
సభకు విచ్చేసిన పాలమూరు యావత్తు కేసీఆర్ను వేనోళ్ల కొనియాడింది. ఏండ్ల తరబడి మాటలు చెప్పి, హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న నాయకులే తప్ప ఒక్కరూ నిలుపుకున్నది లేదని, పాలమూరు రాత మార్చింది లేదని చర్చించుకోవడం విశేషం. గతంలో పాలమూరు జిల్లాలోని భూత్పూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ చేసిన శపథాన్ని గుర్తుచేసుకొన్నారు. కోటి మంది చంద్రబాబులు అడ్డొచ్చినా పాలమూరు కట్టితీరుతామని, నీళ్లు పారించి చూపుతామని నాడు శపథం చేసిన కేసీఆర్ నేడు దానిని సజీవంగా ఆచరణలో తీసుకొచ్చారని కొనియాడారు. మాటిచ్చి నిలుపుకొన్న మొదటి నాయకుడంటూ కీర్తించారు.
నోటికి వచ్చినట్టు మాట్లాడితే క్షమించం: శ్రీనివాస్గౌడ్
పాలమూరు అభివృద్ధి ముఖచిత్రం అంతా కేసీఆర్ చలువేనని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. అభివృద్ధి ప్రదాతపై ఎవరైనా నోటికొచ్చినట్టు మాట్లాడితే క్షమించబోమని హెచ్చరించారు. కన్నీళ్లు పెట్టుకొని పాలమూరును బాగు చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఉమ్మడి ఏపీలో మన రాష్ట్రం నీళ్లు పక్క రాష్ర్టాలకు పోతే తెలంగాణలో ఉన్న నాయకులు సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. పాలమూరు బిడ్డలు దుబాయి, ముంబయి.. వలసలు పోతుంటే తాగడానికి నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. పీఆర్ఎల్ఐ అందుబాటులోకి వస్తుంటే కాల్వలు రిజర్వాయర్లు లేవని, కరెంటు లేదని కొందరు అంటున్నారని మండిపడ్డారు. ఇక్కడికి వచ్చి చూడండి కాల్వలు లేకుంటే నీళ్లు ఎలా పోతయని ప్రశ్నించారు. 70 ఏండ్లు పాలించిన పాలకులు పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. నాడు వలసలు పోయిన పాలమూరుకు ఇతర రాష్ర్టాల నుంచి నేడు కూలి పనులకు వలసలు వస్తున్నారని తెలిపారు. పాలమూరు వాసులకు ఇది ముందస్తుగా దసరా, బతకమ్మ పండుగ అని పేర్కొన్నారు.
పీఆర్ఎల్ఐ అద్భుతం: సీఎస్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని సీఎస్ శాంతికుమారి చెప్పారు. 145 మెగావాట్ల సామర్థ్యంతో పంప్లు, సుమారు 65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన పీఆర్ఎల్ఐని నిర్మించుకోవడం అద్భుతమని కీర్తించారు. మొత్తంగా 16 నియోజకవర్గల్లో సాగు నీరు, తాగు నీరు అందించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారని చెప్పారు. పీఆర్ఎల్ఐకి కృషి చేసిన ఇంజినీరింగ్ అధికారులకు సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు.