ఆదివారం ఢిల్లీలో జరుగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఎంత మొత్తుకొన్నా కంఠశోష తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఎంతో బాధతో ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించారు. ప్రణాళికాసంఘం స్థానే నీతి ఆయోగ్ను నెలకొల్పిన సందర్భంలో మోదీ చెప్పిన ఏ ఒక్క మాటలోనూ నిజం లేదని మండిపడ్డారు.
శనివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో కేంద్ర తీరుపై, నీతిఆయోగ్ వైఫల్యంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ సమావేశ బహిష్కరణకు గల కారణాలతో ప్రధాని మోదీకి లేఖ రాశారు. నీతిఆయోగ్ వల్ల 8 ఏండ్లలో ఒరిగిందేమీ లేదని గణాంకాలతో సహా వివరించారు. దేశంలో సహకార సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు పొడించిందని మండిపడ్డారు. కేంద్రం తీరువల్ల దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడిందన్నారు.