CM KCR | భూపాల్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే నారాయణఖేడ్ దశదిశ మారిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. సీఎం మాట్లాడుతూ.. ‘ఒకమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న నారాయణఖేడ్కు.. బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్న నారాయణఖేడ్కు ఢిల్లీకి ఆస్మాన్ ఫరాక్ అంత ఉన్నది. చాలా మార్పులు వచ్చాయి. దానికి ముఖ్యకారకుడు భూపాల్రెడ్డి. మా అందరికీ అంటే కూడా ప్రతి రోజు మీ మధ్యనే ఉంటూ, కూల్గా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించిన మా హీరో భూపాల్రెడ్డి. మేం అక్కడి నుంచి ఎంత పంపినా.. ఇక్కడ అమలు చేసే మంచి నాయకత్వం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఉప ఎన్నికల్లో మీరు ఆశీర్వాదం ఇచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అవసరం ఉన్నా భూపాల్రెడ్డి తన వ్యక్తిగతమైన పని అడుగలేదు. నియోజకవర్గానికి అవసరమైన కొత్త మండలాలు, పాఠశాలలు, సాగునీటి ప్రాజెక్టులు అడిగాడు. ఏనాడూ వ్యక్తిగతమైన కోర్కెలు కోరలేదు. అందుకే నారాయణఖేడ్ ఇంత మంది అభివృద్ధి సాధించింది’ అని చెప్పారు.
‘భవిష్యత్లో ఇంకా జరగాలి. నారాయణఖేడ్కు నేను చాలాసార్లు వచ్చాను. మంత్రిగా ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు కొంత పని చేశాం. కానీ, ఆ రోజు అన్నీ రేకుడబ్బాలు కనిపించేది మేయిన్ రోడ్డు మీద. కానీ ఇవాళ హెలీకాప్టర్ నుంచి చూస్తే ఎక్కడ చూసినా భవంతులు.. రెండు, మూడంతస్తులు బంగ్లాలు కనిపిస్తున్నయ్. చాలా సంతోషంగా ఉన్నది. ఒక్కప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు రావాలంటే భయపడేది. కానీ ఈ రోజు నారాయణఖేడ్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్డీవో ఆఫీస్, డీఎస్పీ ఆఫీస్ వచ్చింది. చాలా వసతులు పెరిగాయి. గతంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మంత్రి హరీశ్రావు వెళ్తే చిమ్నీబాయ్ అనే లంబాడి మహిళా మాకు మంచినీళ్లు రావడం లేదు ఎందుకు ఓటు వేయాలన్నది. మంచంలో కూసుండబెట్టి స్నానం చేస్తే.. కింద తాంబాలం పెట్టి ఆ నీళ్లను కాపాడి పశువులకు తాగిస్తున్నాం అని చెప్పింది. నేను మీకు హామీ ఇస్తున్నా. బసవేశ్వర, సంఘమేశ్వర లిఫ్టులను పెట్టుకున్నాం. ఎందుకంటే మీకు తెల్వాల కాబట్టి చెబుతున్నా. సింగూరు అప్పుడప్పుడు ఎండిపోతది కదా? అప్పుడు పరిస్థితి ఏంది అనుకుంటరు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు సింగూరుకు లింగ్ చేశాం. ఆటోమెటిక్గా సింగూర్ ఎప్పుడూ కూడా సంవత్సరం పొడువునా నిండి ఉండే పరిస్థితి ఉంటది. అది శాశ్వతమైన జలవనరుగా తయారైంది. దాని నుంచి అటు జహీరాబాద్, నారాయణఖేడ్కు లిఫ్ట్ పెట్టుకున్నాం. వాటి ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు వస్తయ్’ అన్నారు.
‘మల్లన్నసాగర్ నుంచి వస్తున్న కాలువ.. నర్సాపూర్ వరకు తవ్వకం పూర్తయ్యింది. మీ ప్రాంతంలో కావాల్సింది. దాంతో 30-40వేల ఎకరాలకు నీరు రాబోతున్నది. బసవేశ్వర పూర్తయి.. మల్లన్నసాగర్ కాలువ వస్తే దాదాపు లక్షా80వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీళ్లొస్తయ్. నేను ఇప్పుడు నల్లవాగు ప్రాజెక్టు మీద నుంచే వచ్చాను. అందులో నీళ్లు కనిపించాయ్ సంతోషం. రెండు పంటలు పండేలా లిఫ్ట్ ఇరిగేషన్ను పెట్టాలని కోరిండు. ఈ సారి భూపాల్రెడ్డిని గెలిపిస్తే.. నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేసే బాధ్యత నాది. గ్యారంటీగా దాన్ని చేయిస్తా. మాసన్పల్లి రోడ్డు కావాలని కోరాడు. దాన్ని కూడా మంజూరు చేయిస్తా. భూపాల్రెడ్డి కోరిన కోర్కెలు ఆయన కోసం కోరలేదు. బీసీ గురుకుల పాఠశాలలు, విద్యా సంస్థలను ప్రజల కోసమే భూపాల్రెడ్డి కోరాడు. భూపాల్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నారాయణఖేడ్ దశదిశ మారిపోయింది. ఆయన ఆటాటోపం మనిషి కాదు. అడ్డంపొడువు మనిషి కాదు. కూల్గా ఉంటూ సంతృప్తిగా పని చేసుకుంటూ.. నియోజకవర్గాన్ని చూసుకుంటున్నడు. హైదరాబాద్లో చాలా తక్కువ ఉంటడు.. నారాయణఖేడ్లో చాలా ఎక్కువ ఉంటడు. ప్రజల మధ్య ఉండే నాయకుడు’ అని తెలిపారు.