CM KCR | ఎన్నికలు రాంగనే ఆగం కాకుండా ప్రజలు రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి.. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘హుస్నాబాద్ అన్నాదమ్ముళ్లు, అక్కచెళ్లలకు నమస్కారాలు. 2018లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 88 సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించాం. ఈ సారి కూడా ఇక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు చెప్పారు. హైదరాబాద్లో అభ్యర్థులకు బీఫారాలు అందజేసి, అక్కడి నుంచి మేనిఫెస్టో ప్రకటించి నేను మీ దర్శనానికి వచ్చాను. ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతున్నా. నేను చెప్పే మాటలు విని విడిచిపెట్టి వెళ్లొద్దు. పట్టణంలో బస్తీలో, గ్రామానికో, తండానికో పోయిన తర్వాత కేసీఆర్ నాలుగు మాటలు చెప్పిండు.. ఇందులో నిజమేంత అని ఆలోచించాలి’ అన్నారు.
‘ఎన్నికలు వస్తుంటయ్ ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగం కావొద్దు. రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి. మనకు పనికి వచ్చేది ఏదో గుర్తు పట్టాలి. ఎవరో చెప్పారని అవలోకగా వేయొద్దు. ఓటు మన తలరాతను మారుస్తుంది. ఓటు తాలూక రాత, జిల్లా రాతను, రాష్ట్రం భవిష్యత్తును మారుస్తుంది. మా బావ మరిది చెప్పిండు. మా సుట్టం చెప్పండో.. మా మ్యానమామ చెప్పండని ఓట్లు వేయకూడదు. ఖచ్చితంగా ఆలోచించి స్పష్టమైన అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతాయి. తొమ్మిదిన్నర సంవత్సరాల కింద తెలంగాణ పరిస్థితి ఎలా ఉండే ఎలా ఉండే.. ఎక్కడ చూసినా భయమయ్యే పరిస్థితి. వలసలు, కరువు, సాగునీరు లేదు.. మంచినీరు లేదు. కరెంటు లేదు. ఆర్థిక పరిస్థితి ఎట్ల ఉంటదో తెలియదు. కొత్తకుండలో ఈగచొచ్చినట్లు కొత్త సంసారం. ఎక్కడ మొదలుపెట్టాలి. ఎక్కడికి తీసుకుపోయావాలి.. ఏవిధంగా పైకి వెళ్లాలని.. రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానీకాన్ని ఎలా ఆదుకోవాలనే జఠిలమైన సమస్య నా ముందు ఉండేది’ అన్నారు.
‘తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత బీఆర్ఎస్మీదనే ప్రజలు పెట్టారు. చాలా బాధ్యతగా పెద్ద ఆర్థిక నిపుణులు రాష్ట్రానికి చెందిన, బయట రాష్ట్రాలకు చెందిన రప్పించి రెండుమూడు నెలలపాటు మేధోమథనం చేశాం. ఎక్కడ ఉన్నాం.. ఏం చేయాలి.. ఎక్కడికి పోవాలి.. ఎక్కడ చూసినా కటిక చీకటి. నీళ్లు లేవు. పంటలు పండవు.. బతుకలేక వలసపోయిన వారు కొందరు.. ఇక్కడే ఒంటి సావలేక బతుకుతున్న వారు కొందరు. చాలా ఘోరమైన పరిస్థితులుండేవి. మీ అందరికీ తెలుసు. 14-15 సంవత్సరాలు ఏకబీగిన పోరాడి తెలంగాణను ఈ రోజు అనేక రంగాల్లో అందరి సహకారంతో నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయాం. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో, మంచినీటి రంగంలో, పల్లెల్లో పచ్చదనం, పారిశుధ్యం ఏర్పాటు చేయడంలో తెలంగాణ నెంబర్ వన్. పారిశ్రామిక విధానంలో మనకు ఎవరూ పోటీలో లేరు. సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో, 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో, పారిశ్రామిక విధానం, ఐటీ రంగంలో నెంబర్ వన్గా ఉన్నాం. కేంద్రం సహకారం లేకపోయినా.. ప్రతిపక్షాలు గౌరవెల్లి లాంటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఎన్నో కేసులు వేసినా, కుట్రలు చేసినా అధిగమించుకుంటూ ఒకటిఒకటి చేసుకుంటూ వచ్చాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించాం’ అని వివరించారు.