CM KCR | గద్వాలను గబ్బుపట్టించిన గబ్బునాయాళ్లు ఎవరు అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. గద్వాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. సభలో సీఎం మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఉండే అష్టాదశ శక్తి పీఠాల్లో మన జోగులాంబ తల్లి దేవాలయం ఓ శక్తిపీఠం. అందుకే జిల్లాకు జోగులాంబ గద్వాల జిల్లా అని పేరుపెట్టుకున్నాం. జిల్లా పేరు అనుకున్నప్పుడుల్లా అమ్మవారిని స్మరించుకున్నట్లు అవుతుందని ఆ పేరు పెట్టుకున్నాం. గద్వాల చరిత్ర చాలా గొప్పది. ఈ గద్వాల ఊరుపేరే బయటి ప్రపంచంలో మాట్లాడితే విద్వత్ గద్వాల అని మాట్లాడేది. ప్రసిద్ధిగాంచిన తిరుపతి వెంకటకవులను ఈ సంస్థానంలో సన్మానించిన ఘనత చరిత్ర ఉన్నది గద్వాల. ఇంత వరకు బాగేనే ఉంది. గద్వాలను గబ్బుపట్టించిన గబ్బుపట్టించిన గబ్బునాయాళ్లు ఎవరు? సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
‘నేను ఒక్కటే మనవి చేస్తున్నా. ఎలక్షన్లు వస్తయ్ పోతయ్. ఎట్ల 30 తారీఖున ఓట్లు పడుతయ్ ఎవరో ఒకరు గెలవాలి. ఇది జరిగేదే. మూడు పార్టీల నుంచి ముగ్గురు నిలబడుతరు. ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్గా ఉంటరు కావొచ్చు. బీఆర్ఎస్ తరఫున మన కృష్ణమోహన్రెడ్డి ఉన్నడు. కాంగ్రెస్కు ఎవరో ఒకాయన ఉంటడు. బీజేపీకి ఎవరో ఒకరు వస్తరు. ఇక్కడ నిలబడ్డ అభ్యర్థుల గుణం, గణం చూడాలి. ఎలాంటి వ్యక్తులు, మంచేంది.. చెడేంది అన్నది చూడాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పార్టీలు ఉన్నయ్. కృష్ణమోహన్రెడ్డి వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థి వెనుక కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ అభ్యర్థి వెనుక బీజేపీ ఉంటది’ అన్నారు.
‘ఆ పార్టీల చరిత్రను ప్రజలు చూడాలి. ప్రజాస్వామ్యంలో ఆ పరిణితి, విచక్షణా జ్ఞానం ఓటర్లకు రావాలి. ఆ పార్టీ నడవడిక ఎలాంటిది ? రైతుల గురించి ఏం చేస్తారు ? పేద ప్రజల గురించి ఏం చేస్తారు ? ఏం ఆలోచన చేస్తారు ? రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకుపోయేందుకు ఏం వ్యూహాలు చేస్తారు ? అనే ఆలోచన చేయాలి. పార్టీల చరిత్రలన్నీ మీ ముందున్నయ్. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దశాబ్దాలు పరిపాలించిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చరిత్రంతా మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలన ఎలా ఉందో.. ఈ పార్టీ ఎందుకు పుట్టిందో మీకు తెలుసు. రెండు విషయాలను చూద్దాం. కృష్ణా, తుంగభద్ర ఉండే నడిగడ్డ ప్రాంతాన్ని ఎటుగాకుండా ఆగం చేసి కరువు పాలు చేసిన పార్టీ ఏదీ ? దయచేసి చరిత్రను చూడాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.