CM KCR | ఎన్నికల్లో ఏం పడితే మాట్లాడే దుష్ట సాంప్రదాయం దేశంలో వస్తుందని.. ఆగమవుడున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా మరోసారి వేముల ప్రశాంత్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బాల్కొండ నియోకవర్గానికి ఎప్పుడు వచ్చినా మొదటిసారిగా జ్ఞాపకం వచ్చేది మోతే గ్రామం. ఆ మట్టిలో ఉన్న బలం అటువంటిది. తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా ముందు మోతే గ్రామమే తీర్మానం చేసి.. తెలంగాణ కావాలని పిడికిలెత్తిన నిలబడ్డ గ్రామం. ఆ గ్రామం మట్టిని ముడుపుకట్టి హైదరాబాద్ తీసుకుపోయాను. మళ్లీ తెలంగాణ వచ్చిన తర్వాత అదే మట్టిని తీసుకువచ్చి గ్రామంలో కలిపారు. ఈ సందర్భంగా మోతె గ్రామానికి శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను’నని ప్రకటించారు.
‘అన్నదమ్ముళ్లు అక్కచెల్లెల్లకు దండంపెట్టి చెబుతున్నా. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ప్రజాస్వామ్య పరిణితి దేశంలో పెరుగుతలేదు. ఎన్నికలు రాంగనే ఆగమాగం అవుడున్నది. ఎన్నికలంటే ఎలా అయ్యిందంటే ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడొచ్చు. ఇష్టంమున్న ఆరోపణలు పెట్టొచ్చు. సాయి సంసారి అనొచ్చు. లచ్చి దొంగ అనొచ్చు. ఏం పడితే మాట్లాడే దుష్ట సాంప్రదాయం వస్తున్నది. ఎలక్షన్లు ఎన్నిసార్లు రాలే ? ఎవరో ఒకరు గెలవాల్సిందే. రెండో మూడో పార్టీలు నిలబడుతయ్. పార్టీకో మనిషి నిలబడుతడు. బీఆర్ఎస్ నుంచి ప్రశాంత్రెడ్డి ఉన్నడు. కాంగ్రెస్ ఒకాయన, బీజేపీకి ఒకాయన.. ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్ పోటీచేస్తడేమో. వీళ్ల సంగతి చూడాల్సిందే. ఈ అభ్యర్థి గుణగణాలు చూడాల్సిందే. వీళ్లు గెలువడమే కాదు. వీళ్ల గెలుపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీస్తుంది. అది ఏం చేస్తది ? ప్రభుత్వం ఏదో ఒకటి ఏర్పడాల్సి వస్తుంది. వీళ్ల వెనుక ఒక పార్టీ ఉన్నది’ అన్నారు.
‘కాంగ్రెస్ ఓ పార్టీ.. బీజేపీ ఒక, బీఆర్ఎస్ కూడా ఒక పార్టీయే. ఆ పార్టీలకు చరిత్రలు ఉన్నయ్. వాళ్ల వైఖరి ఏందో మీ ముందున్నది. వాళ్లకు అధికారం ఇచ్చినప్పుడు ఏం తొవ్వ నడిచిండ్రో.. ఏం నడకలు నడిచారో అది కూడా ప్రజల ముందున్నది. ఎవల చరిత్ర తెల్వక లేదు. కాబట్టి అభ్యర్థి, అభ్యర్థి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నడు ? ఆ పార్టీ దృక్పథం ఏంటీ ? రైతుల గురించి ఏం ఆలోచిస్తుంది ? పేదల గురించి ఏం ఆలోచిస్తుంది ? మొత్తం రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తుందనే దానిపై చర్చ జరగాలి. ఏ దేశంలోనైనా ఎన్నికలు వచ్చాయంటే చర్చ జరుగుతుంది. ఇంత హడావుడి ఉండదు. ఇంత భారీ సభలు ఏ దేశంలో ఉండయ్. అసలు సభలే ఉండయ్. వాళ్ల దగ్గర టీవీల్లోనే మాట్లాడుతరు. అక్కడ పరిణితి చెందింది కాబట్టి నాయకుల స్పీచ్ను టీవీల్లో వింటారు. పెద్ద పెద్ద మీటింగ్లు జరుగయ్. చాలాపెద్ద మీటింగ్ ఆరేడువేలు వస్తే సంతోషపడుతరు. కానీ, మనదగ్గర ఇంకా ఉల్టా కేసున్నది’దన్నారు.