హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్దే విజయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సందర్భంగా దేశ రాజకీయాలు, టీఆర్ఎస్ పాత్ర తదితర అంశాలపై స్పందించారు. ‘ప్రజలు ఏపాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తూ.. ప్రజా ప్రయోజనాలు రక్షించే ఓ పర్మినెంట్ సంస్థగా టీఆర్ఎస్ నిలబడాలి ఉండాలని తెలంగాణ కోసం అనే కోరిక ఉన్నది. రాబోయే రోజులు నిర్ణయం చేసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయించి.. నియోజకవర్గ కేంద్రాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్ణయించుకుందాం. ఈ రోజు మనకు సభ్యత్వం ఉన్నది. కార్యకర్తలు ఉన్నారు. నాయకులు ఉన్నారు. అద్భుతంగా పురోగమిస్తున్నాం. ఇంకోమాట మనవి చేస్తున్నా. ప్రజలు ఎప్పుడూ కూడా సునిశితంగా గమనిస్తుంటారు. ఎవరు ఏం చేస్తున్నారో కనిపెడుతుంటారు..
జేబులో ఉన్న డబ్బులు తీసి ఎవరూ బజారులో వేయరు. ఇంత మంచి పని చేసే టీఆర్ఎస్ పార్టీని ఎవరో అవాకులు.. చెవాకులు పెలితే.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. తప్పకుండా శాసనసభ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా మనమే తిరిగి గెలుస్తాం. ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదు’ అన్నారు. మనమే విజ్ఞులం.. మనమే గొప్పవాళ్లమే అహంకారం లేకుండా.. కొన్ని సాంకేతికపరమైన విషయాలు అవగాహన చేసుకునేందుకు మనం కొంత కన్సల్టెన్సీని పెట్టుకున్నాం. వాళ్లు చేసిన సర్వేల్లోనూ 90పైచీలుకు పైస్థానాల్లోనూ అలవోకగా గెలుస్తామని రిపోర్టులు వస్తున్నాయ్. పార్టీకి సంబంధించిన నాయకులకు, కేడర్కు త్వరలోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలి.
పార్టీ మరింత విజ్ఞానాన్ని సముపార్జించాలని కేసీఆర్ అన్నారు. ‘టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను, ప్రధాన కార్యదర్శులను కోరున్నా. మనకు నిధులు పుష్కలంగా ఉన్నాయ్. వాటిని అభ్యుదయం కోసం వాడాలి. తెలంగాణ కోసం పార్టీ మరింత విజ్ఞానం సాధించాలి. కొన్ని దేశాలు తిరగడానికి పార్టీ ఖర్చుతోనే మనవాళ్లను దఫదఫాలుగా విదేశాలకు పంపాలి. ఇజ్రాయెల్, చైనాలాంటి దేశాలకు పార్టీ ప్రతినిధులు వెళ్లి రావాలని కోరుతున్నా. దానికి కొంత ఖర్చు పెట్టుకుందాం. మనకు నిధులు ఉన్నాయ్. మనకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకమాట జాతీయ రాజకీయాల గురించి ఆలోచన చేస్తున్నామంటే ముందుకెళ్లండి సార్ మా దీవెన ఉంది అని చెప్పారు.
చాలా మంది దాతలు విరాళాలు సమకూర్చారు. రూ.451కోట్లు ఫిక్సుడ్ డిపాజిట్లలో ఉన్నాయ్. ఈ మధ్య వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ దేశంలో చట్టాల ప్రకారం.. నిబంధనల ప్రకారం.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కలిగి ఉన్న నిధులు సంఖ్య రూ.861కోట్లు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫిక్స్డు డిపాజిట్లలో పెట్టాం. ఎందుకంటే వాటిని దుబారా చేయం. ఈ ఫిక్సుడ్ డిపాజిట్లపై నెలకు రూ.3.84కోట్ల వడ్డీ రూపంలో వస్తున్నది. ఈ డబ్బు మనకు జమ అవుతూ ఉంటది. జమైన డబ్బు కరెంటు అకౌంట్లలో ఉంటది. అది కూడా రూ.24.74కోట్లు నికరంగా కరెంటు ఖాతాల్లో ఉన్నది. వెరసి రూ.865కోట్ల నగదు మన టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్నాయని తెలియజేస్తున్నా. ఢిల్లీ కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాలు అన్నీ కలిపి సుమారు వెయ్యికోట్ల విలువైన ఆస్తులున్నాయి’ అన్నారు.
‘మనం పోతమని చెప్పినవారు పోయిండ్రు కానీ.. మనం పోలే. ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా ఆకాశమంత ఎత్తు ఎదిగి.. మన గులాబీ జెండా తెలంగాణ నింగిలో రెపరెపలాడుతున్నది రోజు.. నాకు చాలా గర్వంగా ఉన్నది. మనకు రెండు ఇన్నో వాహనాలు, ఒక ఫోర్డ్ వ్యాన్ కలిగి ఉన్నది. ఇవాళ కొంత మంది డొనేషన్లు ఇస్తమన్నరు.. చాలా మంది ముందుకు వచ్చి తప్పకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి పుష్కలంగా ఉన్నటువంటి వనరులు, వసతులు, మానవ వనరులు, యువశక్తి, మేధోశక్తిని రంగరించి దేశం కోసం పని చేయాలని చెప్పి ప్రోత్సాహం అందిస్తున్నరు. మన అందరం పురోగమించి ముందుకుపోదాం. అద్భుతమైన విజయాన్ని సాధిస్తామనడంలో అతిశయోక్తి లేదు’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.