CM KCR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిష్టతను దిగ్దిగంతాలకు తెలియజేసేలా, చిరస్థాయిగా ఉండేలా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, మాకు ధైర్యం, నిజాయితీ ఉందన్నారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘పార్లమెంట్కు కూడా అంబేద్కర్ పేరు పెట్టుకోవాలని చెప్పాం. రెడ్ ఇండియన్స్ను చిత్రహింసలకు గురి చేసి, బ్లాక్ అంటూ అవమానపరిచినటువంటి అమెరికన్ తెల్లజాతీయులు బరాక్ ఒబామాను అమెరికా అధ్యక్షుడిని చేయడం వల్ల వాళ్ల పాపాన్ని కడిగేసుకున్నరు అని చెప్పా. అట్లనే ఏదైనా దళిత సమాజాన్ని వివక్షకు గురి చేసినమో వాళ్ల కోసం పోరాటం చేసిన, సిద్ధాంతాలను తీసుకువచ్చిన మహనీయుడి పేరును భారత పార్లమెంట్కు పెట్టాలని చెబితే పట్టించుకోలేదు’ అన్నారు.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు సచివాలయ డోములను కూల్చివేస్తామంటూ మాట్లాడుతున్నారని సీఎం దృష్టికి తీసుకురాగా.. ‘కాళ్లు రెక్కలు విరిచి పడేస్తరు. ప్రజలు చూసుకుంటరు’ అన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించి ప్రజలు గెలిపించారు. ఇందులో మా గెలుపు ఉందని భావించి రెండోసారి గెలిపించారు. రూ.200 బదులుగా రూ.2016 తీసుకొని దర్జాగా బతుకుతున్నటువంటి పెన్షన్దారులు గెలిచారు రాష్ట్రంలో. అన్నమో రామచంద్ర అని అల్లాడి, నిరాధరణకు గురైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివాంగులు, వృద్ధులు వారంతా గెలిచారు.
బిందెడు నీళ్ల కోసం భుజాలు అరిగేపోలా నీళ్లు మోసిన వారు తమ కాపౌండ్లో నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీరు పొందుతున్న ఆడబిడ్డలంతా గెలిచారు. కాలిపోయే మోటార్లు, కూలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎకరం వేస్తే అరెకరం ఎండిపోయి అల్లాడిన రైతులు దర్జాగా 24 గంటల కరెంటు పొందుతున్న రైతన్నలు గెలిచారు. రైతుబంధు, రైతుబంధు పొందుకుంటూ 70లక్షల మంది రైతులు పంజాబ్నే తలదన్నే స్థాయికి పంటలు పండించి.. అద్భుతమైన గెలుపు గెలిచారు. వలసపోవాల్సిన గతం లేకుండా.. తమ జిల్లాకు తాము వాసప్ నుంచి ఇతర జిల్లాల నుంచి కూలీలను రప్పించుకుంటున్న పాలమూరు బిడ్డలు గెలిచారు. ధరణి తీసేస్తమని సభ్యులు అంటున్నారని.. కాంగ్రెస్ హయాంలో బ్రోకర్లు, పైరవీకారులు గెలిచారు. ప్రజలు పడిగాపులు పడ్డారు. మళ్లీ మీ రాజ్యం వస్తే అదే కాలం వస్తది. నేను మాట్లాడే మాటలు ప్రజలు వింటున్నరు.. గెలువాలో ప్రజలే ఆలోచించుకోవాలి’ అన్నారు.
‘దేశంలో ఎక్కడా లేనివిధంగా తరతరాల నుంచి ఇప్పుడిప్పుడే మొగ్గతొడుకున్న పథకం దళితబంధు. ఈ పథకాన్ని దర్జాగా పొందున్న దళితబిడ్డలు గెలిచారు. 50 సంవత్సరాలుగా తల్లాడినా రాకపోతే.. బీఆర్ఎస్ హయాంలో 3500 గ్రామ పంచాయతీలు స్థాపించుకొని.. వాళ్ల గ్రామాలను వాళ్లే ఏలుతున్న గిరిజన బిడ్డలు గెలిచారు. తెలంగాణ జనాభా దామాషాకు అనుగుణంగా గతంలో నిరాకరించబడ్డ.. కొత్తగా పదిశాతం రిజర్వేషన్ పొందిన గిరిజన, లండాబా బిడ్డలు గెలిచారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మరే ఇతర రాష్ట్రంలో వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న 5లక్షల బాలబాలిక అద్భుతమైన అద్భుతమైన గెలుపు సాధించారు.
జ్యోతిరావుపూలే అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద లబ్ధిపొందుతున్న వేలాది మంది తెలంగాణ బిడ్డలు గెలిచారు. మాకు నిజాయితీ ఉంది. ఈటల రాజేందర్ కేబినెట్లో ఉన్న సమయంలో నాకు సలహా ఇచ్చాడు. ఇవాళ సన్నబియ్యం తినకుంటూ చదువుకునే రైతులు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపులో చేతినిండా పనిలేక రోజుకు పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల, దుబ్బాకలో నేతన్నలు గతంలో ఆత్మహత్యలు చేసుకున్నరు. నేడు ఆ దుస్థితి నుంచి బయటపడి బతుకమ్మల చీరల రూపం, మరో రూపంలో చక్కటి ఉపాధి పొందుతూ అద్భుతమైన జీవితాలు పొందుతూ ఆత్మహత్యలు నివారించుకోగలిగిన నేతన్నలు గెలిచారు’ అని తెలిపారు.
‘వైన్స్లో 15శాతం లైసెన్స్ రిజర్వేషన్ పొందిన గౌడన్నలు గెలిచారు. భారీ ఎత్తున 75శాతం సబ్సిడీపై లక్షలాది గొర్రెలు తీసుకొని.. దేశంలోనే అత్యున్నత గొర్రెలు ఉత్పత్తి చేస్తున్న యాదవ బిడ్డలు కూడా అద్భుతమైన విజయం సాధించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోట్లాది చేప పిల్లలను పట్టుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న మత్స్యకారులు గెలిచారు. పెళ్లికావాల్సిన ఆడపిల్ల అంటే గుండెలపై కుంపటి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీతో 12లక్షల కుటుంబాలు కల్యాణలక్ష్మి పథకంతో అద్భుతంగా గెలిచారు.
అపురూపమైన కార్యక్రమం కంటివెలుగు. గుళ్లపల్లి నాగేశ్వరావు ఎల్వీ ప్రసాద్ తాను ఓ కార్యక్రమానికి వెళ్లాం. మొత్తం బ్లైండ్ నెస్ను అరికట్టేలా అని ఆలోచించా. 150 దేశాల్లోనూ కాన్ఫరెన్స్కు సరైన సంపూర్ణ సొల్యూషన్ రాలేదు. కానీ, ‘తెలంగాణ చీఫ్ మినిష్టర్.. దిస్మ్యాన్ వే టూ వరల్డ్’ అని చెప్పి నన్ను చూపించారు. కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. మసకచూపులు పోయి వెలుతును చూస్తున్న ముసలి తల్లులు తండ్రులు మేడిన్ తెలంగాణ అద్దాలు పెట్టుకొని మురిసిపోతున్నరు. ఇలా చెప్పుకుంటూ పోతో ఎన్నో విజయాలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగులు దేశంలోనే ఎక్కువగా జీతాలు అందుకుంటున్నారని, భవిష్యత్లోనూ ఉద్యోగుల జీతాలు పెంచుతామన్నారు. కష్టపడుతున్నరు కాబట్టి ఉద్యోగుల జీతాలు పెంచుతామన్నారు. మోదీకి చేతులు జోడించి కోరుతున్నా.. మోదీ సంకుచితమైన రాజకీయాలు మానుకోవాలని, తెలంగాణ రావాల్సిన నిధులు న్యాయంగా ఇవ్వాలని కోరారు. కేంద్రానికి మేం సహకరిస్తామని, మాకు కేంద్రం సహకరించాలన్నారు. రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి బడ్జెట్ కేటాయించామని, కరోనాతో కొంత ఇబ్బంది కలిగిందన్నారు. మహిళల రుణాలకు సైతం బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఆదేశించారు.