నాంపల్లి, అక్టోబర్ 25: గౌడల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్సీ గంగధర్గౌడ్, టీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి బోడకుంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వైన్ షాపుల నిర్వహణలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించి గౌడ వర్గాలకు వ్యాపార అవకాశం కల్పినంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేసేందుకు వచ్చిన ఆయన మంగళవారం మండల కేంద్రంలోని గౌడ కులస్తుల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. గతంలో ఏ ప్రభుత్వమూ గౌడ కులస్తులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి రూ.2,016 పింఛన్ ఇస్తున్న రాష్టం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. చెట్టు పన్నులను రద్దు చేసి గీత కార్మికులకు అండగా ఉన్నది సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డిని మునుగోడులో ఓడిస్తేనే బీజేపీకి గుణపాఠం చెప్పినట్టవుతుందని పేర్కొన్నారు.