Nani | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 4: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన సురక్షా దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగిసింది. ఆయా జిల్లాల్లో మంత్రులు పోలీసు ర్యాలీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహిళా సురక్షా సంబురాల్లో’ మంత్రు లు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మేయర్ విజయలక్ష్మి, సినీహీరో నాని, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్రూబెన్స్, నైనా జైస్వాల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
జిల్లాల్లో వైభవంగా వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డిలో నిర్వహించిన పోలీసుల ర్యాలీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీపాటిల్, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సురక్షా దినోత్సవంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. పోలీస్ యంత్రాంగం నిర్వహించిన వాహనాల ర్యాలీని బీజేఆర్ చౌరస్తా వద్ద జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీపీ శ్వేతలతో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. శాసన మండలి సభ్యు లు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్వహించిన సురక్షా దినోత్సవంలో విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు చేపట్టిన పోలీసుల సురక్షా ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
నల్లగొండలో పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోట్స్, ఫైర్ వెహికిల్స్తో ఏర్పాటు చేసిన భార్యీ ర్యాలీని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు జెండా ఊపి ప్రారంభించారు. భువనగిరిలో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 100 మీటర్ల జెండాతో కలెక్టరేట్ వరకు ఫుట్ పెట్రోలింగ్ బైక్లు, కార్లు, బ్లూకోట్స్, ఫైర్ వెహికిల్స్ శకటాలతో ర్యాలీ నిర్వహించారు. మహబూబ్నగర్లో పోలీసులు నిర్వహించిన ర్యాలీని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు.
ఖమ్మంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షా దినోత్సవంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి పోలీసుల ర్యాలీని ప్రారంభించారు.
సురక్షా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులు నిర్వహించిన ర్యాలీని ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సురక్షా దినోత్సవంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పోలీసు వాహనాలతో నిర్వహించిన ర్యాలీని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ జెండా ఊపి ప్రారంభించారు.
జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో వెస్ట్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షా దినోత్సవంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీసు వాహన ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, వెస్ట్జోన్ డీసీపీ పీ సీతారాం పాల్గొన్నారు.
శాంతిభద్రతల కోసం చేపడుతున్న సేవలను, పోలీసుల విశేష కృషిని వక్తలు కొనియాడారు. రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడంతో, ఆడబిడ్డలకు భద్రతను అందించడంలో సీఎం కేసీఆర్ నిర్వహించే పాత్ర అనిర్వచనీయమని, ఆయన విశేష కృషి వల్లే తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని, షీటీమ్స్ వంటి మాడ్యూల్స్ను దేశంలోని ఆయా రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని ప్రశంసించారు.