సూర్యపేట: కేంద్రం అవలంభిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలు తిప్పికొడుతున్న సీఎం కేసీఆర్ దేశానికి వేగుచుక్కగా కనబడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రములోని పాత వ్యవసాయ మార్కెట్లో పత్తి మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉండడంతో రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఊరట అని అన్నారు.
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పాటుపడుతూ రాష్ట్ర బడ్జెట్లో 60 శాతం వ్యవసాయానికి కేటాయించారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి కావలసిన సాగునీరు, పంట పెట్టుబడి, మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు విశేష కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 20 లక్షల బోర్లతో వ్యవసాయం చేసిన రైతులు నేడు 24 గంటల ఉచిత విద్యుత్ తో తమకున్న భూమిని అంతా వ్యవసాయం చేస్తున్నారన్నారు.
కేంద్రంలోని బీజపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా విద్యుత్ రంగంలో తనదైన విధానంతో దేశంలో ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అని వెల్లడించారు. ప్రజలకు ఒక పూట తిండి పెట్టలేని విధానాలు కేంద్రం అవలంబిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణను తీర్చిదిద్దారన్నారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే మార్కెట్లను బీజేపీ ప్రభుత్వం తీసివేయాలని చూస్తే తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో మార్కెట్లను నడుపుతున్నామని వివరించారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని పేర్కొన్నారు.