Minister Srinivas Yadav | సీఎం కేసీఆర్ (CM KCR) యాదవుల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallanna) స్వరూపం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రజ్ఞాపూర్ (Pragnapur)లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడా లేనివిధంగా రూ.11వేలకోట్ల వ్యయంతో 75శాతం సబ్సిడీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే, మన అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
మాయమాటలు చెప్పేవారిని కాకుండా చేతల ప్రభుత్వానికి మద్దతు తెలుపాలన్నారు. హైదరాబాద్ నగరానికే పరిమితమైన సదర్ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. నీతి నిజాయితికి మారుపేరు యాదవులు అని ముఖ్యమంత్రి అనేక సార్లు అసెంబ్లీలో ప్రకటించారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.