CM KCR | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక పాలమూరు జిల్లాలో మూడేళ్లలో నీళ్లు దుంకిపిచ్చినమని సీఎం కేసీఆర్ అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఇంతకు ముందు పెట్టిన ఎలుగులు ఏంటి ? హర్షవర్ధన్రెడ్డి ఖరాబ్ చేసిందేంది? అందుకు నేను అనేది అనేది ఓట్లు అట్టిగనే వేయొద్దు. గ్రామాల్లో చర్చించండి. ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని కష్టాలుపడ్డమో మీరు చేశారు. నీళ్లు తేవడానికి ఎన్ని బాధలుపడ్డాం. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా కావొచ్చు. కాంగ్రెస్ రాజ్యంలో వాటికి పెండింగ్ ప్రాజెక్టులని పేరు పెట్టారు’ అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
‘మూడు దశాబ్దాలు అంటే 30 ఏళ్లు పెండింగ్ ప్రాజెక్టులే. తెలంగాణ వచ్చాక మూడేళ్లలో నీళ్లు దుంకిపిచ్చినమ్. మరి ఇప్పుడు నీళ్లు ఎట్ల వచ్చినయ్. మంత్రం వేస్తే.. మాయ చేస్తే వచ్చినయా? కష్టం చేస్తే.. పెయ్యి వంచితే.. మా ప్రజలకు నీళ్లు రావాలని గుండిగల కోరిక ఉంటే ఇవాళ నీళ్లు వచ్చినయ్. కొల్లాపూర్లో లక్ష ఎకరాలకుపైగా పారుతున్నది. హైలెవల్ కెనాల్ కావాలని హర్షవర్ధన్రెడ్డి అడుగుతున్నడు. మొన్ననే నేను వచ్చి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసిన. పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి అన్నంపెట్టే ప్రాజెక్టు.. మొన్న నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఒకసారి వచ్చిదంటే ఈ జిల్లా అంతా బంగారు తునక అయిపోతది. పాత మహబూబ్నగర్ జిల్లా మొత్తం 20లక్షల ఎకరాలకు నీరుపారుతుంది. మనకు కేంద్రాలు పెట్టుడు కాదు. ఎవరైనా భిక్షం కోసం వస్తే మనం గంజిపోసే పరిస్థితుల్లో ఉంటాం’ అన్నారు.
‘ఉద్యమం కోసం తిరిగినప్పుడు జయశంకర్ సార్ అని పెద్ద మనిషి ఉండే. మేం కూసొని మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ అన్నింటికన్నా ఎక్కువ దరిద్రం పాలమూరులోనే ఉన్నది. ఆ పాలమూరు బాగుపడాలంటే.. మీకు బాగా అర్థంకావాలి. అందుకోసం నువ్వు మహబూబ్నగర్ నుంచి ఎంపీగా నిలబడమని చెప్పిండు. నేను నిలబడితే మీరు ఎంతో ప్రేమతో ఆ నాడు గెలిపించారు. మహబూబ్నగర్కు దగ్గిన గౌరవం ఏంటంటే.. నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే మనం తెలంగాణ సాధించినం. ఏనాటికైనా అది నాగుండెల్లో ఉంటది. ఎంపీగా ఉండే టైములో కొంత.. ఉద్యమం టైమ్లో కొంత.. నిరంజన్రెడ్డి నేను కొందరు మిత్రులం కలిసి చాలా తిరిగాం. జోగులాంబ టూ గద్వాల నేను పాదయాత్ర చేశాను ఆర్డీఎస్పై అన్యాయం జరుగుతుంటే. ఆ రోజే స్టడీ చేసి.. ఎట్లయితే నీళ్లు రావాలే.. ఎట్ల బాగుపడాలనే ఆలోచన చేశాను’ అని గుర్తు చేశారు.
‘నేను చెప్పేవి తప్పు కాదు.. రాజకీయం కోసం చెప్పడం లేదు. రాజకీయం కాదు.. తెలంగాణ బతుకుదెరువు మాట. జీవన్మరణ సమస్య. మనం బతుకన్నా.. మనం చావన్నా ? అనే సమస్య. దీనిపై ప్రజలు తీవ్రంగా ఆలోచించాలి. తెలంగాణ వచ్చాక హుజూరాబాద్కు చెందిన జీఆర్రెడ్డి ఆర్థిక శాస్త్రవేత్త ఉంటే బిహార్ నుంచి రప్పించుకొని బాగా చర్చలు జరుపుకొని ఓ మార్గం వేసుకున్నాం. ఒకటి ఒకటి సమస్యలు పరిష్కారం చేసుకుంటు వస్తున్నాం. మొదట పేదసాదలను ఆదుకోవాలని నిర్ణయంచేశాం. విధివంచితులు ఉంటరో.. సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వమే వాళ్లను కాపాడాలి. మానవీయ కోణంలో ఆదుకోవాలని పెన్షన్లు రూ.వెయ్యి పెట్టుకున్నాం. ఆ తర్వాత రూ.2వేల పెంచుకున్నాం. రేపు రూ.5వేలకు పెంచుకోబోతున్నాం. సంక్షేమం తర్వాత రైతుల గురించి ఆలోచన చేశాం’ అన్నారు.
‘మహబూబ్నగర్లాంటి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ఆగమేఘాల మీద కంప్లీట్ చేశాం. అప్పుడు హరీశ్రావు అని నీళ్లమంత్రి ఉండే. ఇదే నిరంజన్రెడ్డి, నీళ్ల మంత్రి కాలువలపొంట తిరిగారు. నీళ్లు వట్టిగనే రాలే. వాటంతటవే వచ్చాయా? తెల్లందాక పొద్దందాక తిరిగి తండ్లాడితే రెండు రెండున్నరేళ్లలో నీళ్లు తీసుకురాగలిగాం. కాలువల ద్వారా వచ్చే నీళ్లకు భారతదేశం మొత్తం పన్నులు వసూలు చేస్తరు. ఇక్కడ నేను రద్దు చేశాను. పాత బకాయిలు మాఫీ చేశాం. కల్వకుర్తి, బీమా నుంచి వచ్చే నీళ్లకు ఇవాళ పన్ను లేదు. కరెంటు మీద ఆధారపడ్డ బతుకులున్నయ్ 24గంటలు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఇస్తున్నాం’ అన్నారు.