యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. 3 గంటల్లో 60 దళిత కుటుంబాలను సీఎం కేసీఆర్ పలుకరించారు. వాడవాడలా కాలినడకన సీఎం కేసీఆర్ తిరిగి.. 60 ఇండ్లలోకి వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఎస్సీ కాలనీలో కూలిపోయే దశలో ఉన్న ఇండ్లను చూసి కేసీఆర్ చలించిపోయారు. ఇండ్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. దళిత బంధు పథకం గురించి తెలుసా అని సీఎం అడిగారు. ఇంటికి రూ. పది లక్షలు ఇస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఈ రూ. 10 లక్షలతో డెయిరీ ఫాం పెట్టుకుంటామని కొందరు తెలుపగా, ట్రాక్టర్లు కొంటామని కొందరు, వ్యాపారం చేసుకుంటామని మరికొందరు సీఎంకు చెప్పారు. దళిత బంధు డబ్బును సక్రమంగా ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.
నిరుపేద మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను కేసీఆర్ సావధానంగా విన్నారు. మహిళలు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఆసరా పెన్షన్లపై ఆరా తీశారు. పెన్షన్ రాని వారికి వెంటనే మంజూరు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. పెన్షన్ అందడం లేదని చెప్పిన 20 మంది బీడీ కార్మికులకు రెండు రోజుల్లో పెన్షన్ అందించాలని ఆదేశించారు.
నాయకుడంటే కేసీఆర్.. నిరుపేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. వానను సైతం లెక్క చేయలేదు. దళితుల సమస్యలను వినేందుకు వానలోనూ పర్యటించి వారి స్థితిగతులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాసాలమర్రిలోని దళిత కాలనీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తుండగా.. స్వల్పంగా వాన కురిసింది. అయినప్పటికీ కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. ఆ వానలోనే నడక సాగిస్తూ.. దళితుల్లో చైతన్యం నింపారు. దళిత బంధు పథకం ఉద్దేశాలను వివరించారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దయనీయంగా ఉన్న దళితుల ముఖాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. వాసాలమర్రి పర్యటనలో సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పలువురు అధికారులు ఉన్నారు.