Minister Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గతంలో అంబులెన్స్ నిర్దేశిత ప్రాంతానికి చేరేందుకు 30 నిమిషాలు పట్టేదని, ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్స్ సిద్ధంగా ఉంటున్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దీనిని మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. అంబులెన్స్లను ‘డైనమిక్ పొజిషన్’లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంబులెన్స్ను రోజంతా ఒకేచోట ఉంచకుండా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు సమీపంలో ఉంచేలా ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అత్యవసర సమయాల్లో సేవలు అందించే 466 కొత్త వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో 204 అంబులెన్స్లు, 228 అమ్మ ఒడి, 34 పా ర్థివ (హర్సే) వాహనాలకు జెండా ఊపారు. అనంతరం సభను ఉద్దేశించి మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకలు 50 వేలకు చేరుకొంటున్నాయని చెప్పారు. ‘కరోనానే కాదు భవిష్యత్తులో దాని తాతలాంటి మహమ్మారులు వచ్చినా ఎదుర్కొనేలా వైద్యరంగం సిద్ధంగా ఉన్నది’ అని స్పష్టం చేశారు.
ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంపై భరోసా
పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలతో ప్రజలకు వైద్యం మరింత చేరువ చేశామని మంత్రి హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని దవాఖానల్లో కనీసం 100 పడకలు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో 17 వేల పడకలు ఉండేవని గుర్తు చేశారు. దవాఖానల అప్గ్రేడేషన్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నగరం నలువైపులా నాలుగు టిమ్స్ దవాఖానలు, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య 50 వేలకు పెరిగిందని తెలిపారు.
‘మాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉన్నదనే భరోసా ప్రజల్లో కలిగింది’ అని చెప్పారు. ‘బిడ్డ కడుపులో పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, తర్వాత కేసీఆర్ కిట్, న డక వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలు, చదువుకోవాలనుకునేవారికి గురుకులాలు, స్కాలర్షిప్లు, స్వరాష్ట్రంలోనే ఉపాధి, ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులకు పింఛన్లు.. ఇలా ప్రతిదశలోనూ ప్రభుత్వం సాయం చేస్తున్నది’ అని వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో గతంలో 30 శాతం ప్రసవాలు జరిగితే ఇ ప్పుడు 70 శాతం అవుతున్నాయన్నారు. ఇందులో ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. హైదరాబాద్ పరిధిలో కొత్త ఆశా కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.
466 వాహనాల మొదలు సంతోషకరం
అత్యవసర సేవలు అందించే 466 అధునాతన వాహనాలను ఒకేరోజు ప్రవేశ పెట్ట డం తనకు సంతోషంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి 108 అంబులెన్స్లు 316 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 455కు పెరిగిందని, లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. ఇప్పు డు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు 2014 నాటికి ఒక్కటి కూడా లేదని, ఇప్పుడు జిల్లాకు ఒక టి ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో నవజాత శిశువుల కోసం అంబులెన్స్లు లేవని, ఇప్పుడు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దేశంలోనే అందరికన్నా ముందు వరుసలో నిలిచామని తెలిపారు. 108లో పనిచేస్తున్న పైలట్లు, టెక్నీషియన్లు, ఇతర ఉద్యోగుల వేతనాలను 4 స్లాబులుగా పెంచుతున్నట్టు చెప్పారు. 108 ద్వారా రో జుకు 2 వేల మంది, అమ్మ ఒడి వాహనాల తో రోజుకు 4 వేల మంది సేవలు పొందుతున్నారని చెప్పారు.
కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు ఎం ఎస్ ప్రభాకర్, వాణిదేవి, ఎమ్మెల్యేలు దా నం నాగేందర్, మదన్రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, డీపీహెచ్ శ్రీ నివాసరావు, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఈఎంఆర్ఐ చైర్మన్ కృష్ణంరాజు, ఎమ్మెల్సీగా నామినేట్ అయిన కుర్రా సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీ నం చేసినందుకు ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడ అభివృద్ధి.. అక్కడ కరప్షన్
రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వారు కేవలం విమర్శలకే పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణలో అభివృద్ధి కనిపిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కొట్లాటలు, కరెప్షన్ మాత్రమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో స్కీంలు నడుస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సాంలు బయటపడుతున్నాయని విమర్శించారు.