హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): అన్నార్తులు.. అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహాత్మాగాంధీ చూపిన దారిలో పునరంకితం కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కాపాడుకోవాలని, సముజ్వలంగా అంతర్జాతీయ విపణిలో భాసిల్లాలనేది తన ఆకాంక్ష అని ఉద్విగ్నంగా పేర్కొన్నారు. విశ్వమానవుడైన మహాత్ముడిపై ప్రస్తుతం కొన్ని దుష్టశక్తులు చేస్తున్న వెకిలి చేష్టలను ఎక్కడికక్కడ కట్టడి చేయాలన్నారు. సోమవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
అపూర్వ త్యాగాల ఫలం
అనేక త్యాగాలతో, పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి, స్వయంపాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారతావని రాబోయే 15వ తారీఖున 75 సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్నది. దీనిని మనం వజ్రోత్సవాలుగా నిర్వహించుకొంటున్నాం. సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారి కొత్త త రాలు వస్తున్నాయి. వారికి స్వాతంత్య్ర పోరాట సందర్భంలో జరిగిన సమరం, త్యాగాలు, ప్రాణత్యాగాలు.. విశేషించి మహిళలు, పురుషులు, బాలలు ప్రతి ఒక్కరూ కదిలి పోరాడిన చరిత్ర తెలియదు. ఈ విశేషాలను ఎప్పటికప్పుడు కొత్త తరానికి తెలియజేయడం పాత త రం వారి విధి, కర్తవ్యం.
ఏ దేశానికైనా స్వేచ్ఛా స్వాతంత్య్రం ఒక అపురూపమైన సందర్భం. భారత జాతి తన స్వాతంత్య్రం కోసం దాదాపు ఒకటిన్నర శతాబ్దంపాటు సుదీర్ఘమైన పోరాటం చేసింది. అనేకమంది పెద్దలు.. అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాడారు. 1857 సిపాయిల తిరుగుబాటు ఇందులో ప్రధానఘట్టం. కానీ, సిపాయిలు తిరుగుబాటు చేస్తే రాజ్యం పడిపోవాలె.. సాధారణంగా జరిగేది అదే.. విప్లవ పంథాలో విప్లవాలు చెలరేగినప్పు డు.. రాజ్యానికి సహకరించే సాయుధబలగాల్లో సగంమంది విప్లవకారులతో కలిసిపోయినప్పుడే ఆ విప్లవం విజయం సాధిస్తది.
సాయుధ బలగాలు పోరాటం చేస్తే తప్పనిసరిగా రాజ్యం పోవాలె. కానీ.. మన భారత స్వాతంత్య్ర సమరంలో ఉజ్వలమైన సిపాయిల తిరుగుబాటుతో బ్రిటిష్ వలసరాజ్యం కూలిపోలేదు. ఇంకా బ లంగా అణచివేత ప్రారంభించింది. కానీ, స్వా తంత్య్ర ఉద్యమకారులు ఏనాడూ నిరాశ చెందలేదు. అదే స్ఫూర్తితో వైఫల్యాలనుంచి పాఠాలు నేర్చుకొని పోరాటాన్ని సాగించారు. బాలగంగాధర్ తిలక్ నాయకత్వంలో సాంస్కృతిక పోరాటాలు వచ్చాయి. లాలా లజపతిరాయ్, బిపిన్చంద్రపాల్ అనేక పద్ధతుల్లో అనేక పోరాటాలు చేశారు. రాజులు, సంస్థానాధీశులు.. ఝాన్సీలక్ష్మీబాయి లాంటివాళ్లు.. ఆసేతు హిమాచలం ఒక్కటై పోరాడింది.
రాష్ట్రమంతటా స్వాతంత్య్ర స్ఫూర్తి రగలాలె
మహాత్మాగాంధీ వారసులుగా.. మనమెం తో గర్వంగా ఈ దేశ భవితవ్యాన్ని తీర్చిదిద్దటానికి కంకణం కట్టుకొన్న వ్యక్తులుగా ప్రజాసేవలో ముందున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి మీ అందరినీ శ్రమ పెట్టి ఈ కార్యక్రమానికి పిలిపించడానికి కారణం ఉన్నది. మహోజ్వలమైన స్వతంత్ర వజ్రోత్సవ దీప్తి వాడవాడలా, గ్రామ గ్రామాన చాలా అద్భుతంగా జరగాలె. ఎన్ని త్యాగాలతో.. ఎన్ని పోరాటాలతో.. ఎన్ని వేదనలు, ఆవేదనలతో స్వాతంత్య్రం వచ్చిందో.. దాని విలువ ఏమిటో గడప గడప కు తెలిసేలా చాలా గొప్పగా చెప్పాలె. ప్రతి జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో కమిటీలు ఉ న్నాయి.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు.. మున్సిపల్ మేయర్లు, చైర్మ న్లు, ఎంపీపీ అధ్యక్షులు.. మీమీ పరిధుల్లో ఈ కార్యక్రమాలను జాజ్వల్యమానంగా నిర్వహించాలి. అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించా లి. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎన్ని రకాలుగా త్యాగాలు చేశారు.. అలవోకగా తమ ప్రాణాలను దేశం కోసం ధారపోశారు.. మడమ తిప్పకుండా ఎంత తీవ్రంగా పోరాడారో.. ఆ స్ఫూ ర్తిని.. త్యాగనిరతిని అందరికీ తెలియజేస్తూ ముందుకు సాగాలి.
మహానుభావులు అందరికీ జోహార్లు
కొత్తతరం పిల్లలకు రాజకీయ నేతలకు కూడా చాలామంది గురించి తెలియదు. దేశానికి స్వతంత్రం రావటానికి చాలా సమయం పట్టింది. ఆ తరువాత ఏ దేశమైనా స్థిరపడటానికి అనేక ఒడిదుడుకులు.. ఒత్తిళ్లు.. దేశానికి ఒక సమగ్రత.. ఒక స్వరూపం రావాలంటే చాలా సమయం తీసుకుంటది. చాలా ప్రయాస.. శ్రమ, మేధోమథనం కలగలసి ఉంటాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినరోజు విచిత్రమైన పరిస్థితి ఉండేది. రాజుల పరిపాలనలో సుమారు 584 సంస్థానాలు ఉండేవి. మహాత్మాగాంధీ వెంట నడిచిన వల్లభ్భాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ.. తదితర పెద్దలందరూ విశేషమైన కృషిచేసి 584 సంస్థానాలను దేశంలో కలిపారు.
రాజులకు రాజభరణాలు, రాజప్రముఖ్ హోదాలు కల్పించడమే కాకుండా.. గవర్నర్ పదవులను కూడా ఇచ్చి.. ఒప్పించి ఇవాళ మన కండ్లముందున్న భారతదేశాన్ని ఆవిష్కరించారు. 1947 ఆగస్టు 15 నుంచి 1975 మే 16 వరకు రకరకాల పద్ధతుల్లో, రకరకాల ప్రక్రియల ద్వారా సంస్థానాల విలీనం జరిగింది. ఇది నా దేశం అని మనం అనుభవిస్తున్న ఇవాళ్టి భారతదేశాన్ని మనకు అందించడానికి ఎందరో పెద్దల కృషి.. ఎంతో సహనం.. మేధోమథనం.. జాతీయ అంతర్జాతీయ వేదికల మీద చేసిన ప్రయత్నం వల్లనే ఇంత గొప్ప కూర్పు జరిగింది. ఇందుకోసం వారు పడ్డ ప్రయాస, చేసిన కృషి ఎనలేనిది.. అమూల్యమైనది. ఈ సందర్భంగా వారందరికీ జోహార్లు. ఎంత బాధ్యతాయుతంగా కష్టపడితే ఈ దేశం ఇట్లా వచ్చిందని ఆలోచిస్తున్నప్పుడు.. ఈ దేశాన్ని ఏవిధంగానైనా కాపాడుకోవాలనే తపన నాకు కలుగుతుంది.
మనం స్ఫూర్తి పొందే సందర్భమిదే
తెలంగాణను కొంతలో కొంత బాగుచేసుకొన్నాం. రాష్ట్రం కావాలనే పోరాటం.. సాధన అనంతర 8 ఏండ్ల కాలంలో ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని ప్రాథమిక, మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించుకోగలిగాం. ఇంకా పురోగమించాల్సింది చాలా ఉన్నది. ఇలాంటి సందర్భంలో ఒక కఠోరమైన వాస్తవాన్ని మనమందరం అంగీకరించక తప్పదు. పేదరికం ఎంతవరకు దేశంలో ఉంటదో.. అప్పటివరకు ఆక్రందనలు, అలజడులు కొనసాగుతూనే ఉంటాయి. పేదరికాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం లభిస్తుంది.
ఈ వాస్తవాన్ని ఈ సందర్భంలో మనమందరం తెలుసుకోవాలి. ప్రజల ఆపేక్షలు అనుకొన్న స్థాయిలో నెరవేరలేదు. నేడు దళిత సమాజం వారికి జరగాల్సింది జరుగలేదని ఆక్రోశిస్తున్నది. అల్పాదాయ వర్గాలు, ఆదాయం సరిగా లేనటువంటి జాతులు, అన్ని వర్గాల్లో ఉండే పేదలు ఎంతో విలపిస్తున్నారు. ఈ వాస్తవాన్ని సమీక్షించుకొని.. ఆ దిశగా ప్రతిజ్ఞ బూని కదలాల్సిన అవసరమున్నది. 1940లో స్వతంత్రం రాకముందే.. తెలంగాణ గడ్డమీద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జాగీర్దార్ వ్యతిరేక పోరాటం జరిగింది. ప్రజల్లో అది చైతన్యాన్ని తెచ్చింది. ఆ పోరాటాన్ని మనం నిందించలేము.
తర్వాత నక్సల్ ఉద్యమం వచ్చింది.. ఇలా అనేకరకాలుగా అశాంతి ప్రదర్శితమవుతూ వచ్చింది. డిమాండ్లు చెలరేగుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించాలంటే.. ప్రజారంగంలో ఉన్న మనమందరం.. స్వార్థము, సంకుచిత భావాలను పక్కన పెట్టి విశాల దృక్పథంతో.. ఎవరైతే దీనార్తులు, అన్నార్తులు ఉన్నారో.. వారందరి సౌభాగ్యం కోసం ఈ వజ్రోత్సవ దీప్తిలో కంకణధారులం కావాలి. ప్రతి భారతీయుడు ఈ దేశం నాది. ఇందులో నేను వాటాదారుణ్ణి అని సగర్వంగా చెప్పుకొనే పరిస్థితులు సృష్టించాలి. ఇది ఎవరో బయటివాళ్లు వచ్చి చేయరు. దీన్ని మనమే ముందుకు తీసుకుపోవాలి.
రాష్ట్ర అధికారులకు నా సెల్యూట్
ఈ రోజు తెలంగాణ పునర్నిర్మాణంలో మీ రంతా ఎంత ప్రయాస పడుతున్నారో నాకు తెలుసు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నా వద్దకు వచ్చి ఏ విధంగా అడుగుతారో తెలుసు. కాలువల గురించి, చెరువుల గురించి, కరెంట్ సైప్లె సబ్స్టేషన్ల గురించి, పేదలకు జరగాల్సిన కార్యక్రమాల గురించి మీరు ఎంత ప్రేమతో ప్రయత్నిస్తారో నాకు తెలుసు. ఇప్పుడు మన రాష్ట్రం లో 24 గంటల కరెంట్ ఇస్తున్నమని సులువుగా చెప్పొచ్చు. కానీ దీన్ని ఒక చాలెంజ్గా తీసుకొని దేశంలోనే ఈ రోజు తెలంగాణ 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం, నాణ్యమైన వి ద్యుత్తును అందించే రాష్ట్రమని తలెత్తుకొని చెప్పుకొనే స్థితిని కల్పించిన జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల సారథులు, విద్యుత్తు శాఖ సిబ్బంది అందరికీ తెలంగాణ ప్రజల పక్షాన సెల్యూట్ చేస్తున్నాను.
తెలంగాణ గౌరవాన్ని, గర్వాన్ని జాతీయస్థాయి యవనికలో చేర్చిన మీకు తెలంగాణ ఎల్లప్పుడు రుణపడి ఉంటుంది. ఇలా ఇరిగేషన్ రంగంలో, మంచినీటి రంగంలో, డీజీపీ సారథ్యంలో ఎనిమిది సంవత్సరాల నుంచి అద్భుతమైన శాంతి భద్రతలు నిర్వహించి దేశంలోనే బెటర్ పోలీస్గా నిలిచిన పరిస్థితులు కావొచ్చు ఇలా అనేక విషయాల్లో రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పనిచేస్తున్న యావన్మంది తెలంగాణ అధికారులకు నేను సెల్యూట్ చేస్తున్నా.
నిఖత్ స్వర్ణం.. వజ్రోత్సవాల కానుక
తెలంగాణ సాధించుకొన్న తర్వాత మనం అనేక విజయాలు సాధించాం. మన క్రీడాకారులు ఇటీవల కాలంలో ఉజ్వలమైన విజయాలు సాధిస్తున్నారు. కామన్వెల్త్ పోటీల్లో మన తెలంగాణకు చెందిన నిజామాబాద్ జిల్లా బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ గెలుచుకోవడం మన తెలంగాణకు స్వాతంత్య్ర వజ్రోత్సవంలో అద్భుతమైన కానుక. మనందరి తరఫున నిఖత్ జరీన్కు అభినందనలు.
సామూహిక జాతీయ గీతాలాపనలో అందరూ పాల్గొనాలి
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమ బాధ్యతలను డీజీపీ మహేందర్రెడ్డి తీసుకొన్నారు. ఎక్కడున్న ట్రాఫిక్ను అక్కడే నిలిపేసి.. మనం కూడా కార్లలో ఉన్నా సరే దిగి నిల్చొని, ఎక్కడ ఉన్నవాళ్లం అక్కడే 58 సెకన్ల పాటు నిలబడి జాతీయ గీతాన్ని అద్భుతంగా ఆలపించాలి. ఉజ్వలమైన ఘట్టాలను సముజ్వలంగా నిర్వహించినప్పుడే భవిష్యత్తుకు మార్గదర్శకులమవుతాం. మన తాత, తండ్రి గొప్పతనాన్ని చెప్తేనే.. మన కొడుకులు బాగా తయారవుతారు. మన గురించి మన కొడుకులు వాళ్ల కొడుకులకు చెప్తేనే వాళ్లు బాగా తయారవుతారు. ఇది సంస్కృతి, సంస్కారాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించేటువంటి గొప్ప సందర్భమిది. దీన్ని ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా స్వీకరించి, ఇంటిపనిగా భావించి అవసరమైతే జేబులోంచి ఓ పది రూపాయిలు సొంత డబ్బు ఖర్చు పెట్టయినా సరే దీన్ని పరిపుష్టం చేసేందుకు ముందుకు వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయొద్దు.
విద్యార్థులకు ఉచితంగా గాంధీ సినిమా..
రాబోయే రోజుల్లో మేలు జరిగేందు కు, వాస్తవాలు తెలిసేందుకు మహాత్మాగాంధీ సినిమాను రాష్ట్రంలోని లక్షల మం ది విద్యార్థులకు చూపించడానికి మంత్రి తలసాని, సీఎస్ సోమేశ్కుమార్ అన్ని ఏర్పాట్లుచేశారు. మీ మీ మండలాల్లో, జిల్లాల్లో దాదాపు 560 థియేటర్లలో ప్రతి రోజు ఒక షోలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తారు. జిల్లా అధికారులు, మంత్రుల నేతృత్వంలో ప్రజా ప్రతినిధులందరూ ప్రభుత్వ ఖర్చులతో బస్సులను ఏర్పాటుచేసి ఆ పిల్లలకు గాంధీ సినిమా చూపించాలి. స్వాతంత్య్ర పోరాటం ఏమిటో, వీరుల త్యాగం ఏమిటో పిల్లలకు తెలియజేసి వారిని పరిపుష్టం చేయాలి.
దేశంలో విలీనమైన సంస్థానాలు
కశ్మీర్ : అక్టోబర్ 27, 1947
జునాగఢ్ : నవంబర్ 9,1947
ఇండోర్ : జూన్ 16, 1948
హైదరాబాద్ : సెప్టెంబర్ 17, 1948
పాండిచ్చేరి : నవంబర్ 1, 1954
గోవా : డిసెంబర్ 19, 1961
సిక్కిం : మే 16, 1975