మహబూబ్నగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాలమూరు గులాబీమయమైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జిల్లాకు రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్ మధ్య సీఎం చేరుకున్నారు. జడ్చర్లలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి.. ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్లో మహబూబ్నగర్కు దాకా చేరుకున్నారు.
మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడి చాంబర్లోని సీటులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూర్చోబెట్టారు. అక్కడి నుంచి బస్సులో భారీ కాన్వాయ్తో నూతన కలెక్టరేట్కు చేరుకున్నారు. పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఇదే వేదిక మీదుగా సమరశంఖం పూరించారు. మళ్లీ అదే వేదికపై స్వరాష్ట్రం సాధించుకున్న తీరు.. జరుగుతున్న అభివృద్ధిపై మాట్లాడారు. మధ్యాహ్నం నుంచి ఎంవీఎస్ డిగ్రీ కళాశాలకు జనం భారీగా చేరుకున్నారు.
గులాబీ జెండాలు పట్టుకున్న టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్, కళాకారుడు సాయిచంద్ పాటలకు డ్యాన్స్లు చేశారు. సాయంత్రం సభ ప్రారంభం కాగానే జనంతో మైదానం కిక్కిరిసిపోయింది. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, మర్రి జనార్దన్రెడ్డి, బీరం హర్షవర్ధన్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, మహేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి, వాణీదేవి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్లు సీతారామారావు, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు.