CM KCR | ‘పాలమూరు జిల్లా పచ్చని పంటల పాలుగారు జిల్లా’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కరువునేల తలరాత మారిన తీరును వివరించారు. ‘పోరాటమే చెయ్యకుంటే ఇయ్యాల మేడ్చల్ జిల్లా అయ్యేదా?’ అని ప్రశ్నించారు. జడ్చర్ల, మేడ్చల్లలో బుధవారం జరిగిన ప్రజాఆశీర్వాద సభలో స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ సాగిన సీఎం ప్రసంగం ప్రజల్ని ఆలోచింపజేసింది.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కల్లబొల్లి కబుర్లు చెప్తున్న కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే, వాళ్లు అధికారంలోని రాగానే కరెంటు బంద్ పెడుతారని సీఎం కేసీఆర్ హెచ్చ రించారు. వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ రాష్ట్ర నేతల నుంచి జాతీయ నేతల వరకు అందరూ ఇప్పటికే తమ కడుపులో ఉన్నది కక్కేశారని, వాళ్లని నమ్మితే అదే నిజం చేస్తారని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందెవరో.. తెలంగాణ ప్రజలను ముంచిందెవరో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏండ్లు మనల్ని రాచి రంపాన పెట్టిందెవరో.. న్యాయం కోసం పోరా టం చేస్తే తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిందెవరో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. మళ్లీ అదే పార్టీకి ఓటేస్తే కరెంట్ బంద్ అవుతుందని, పరిశ్రమలు మూసివేసుకొనే పరిస్థితి వస్తుందని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలోని గుండ్లపోచంపల్లి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘రాష్ట్రం మళ్లీ విపక్షాల చేతిలో పడితే కరెంట్ కోతల బాధలు తప్పవు.. పరిశ్రమలు బంద్ అవుతాయి. అన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడతారు. కావున అంతా ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీకి అండదండలందించండి’ అని కోరారు. ఎన్నికల సమయంలో ఆపద మొక్కులు మొక్కేవాళ్ల పట్ల అప్రమత్తం గా ఉండాలని సూచించారు. మేడ్చల్ సభలో సీఎం సమక్షంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ట్రాన్స్ఫార్మర్లు కాలి ఏడ్చినా పట్టించుకోలే
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు ఏడ్చినా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. ‘నాడు పంట వేస్తే గ్యారెంటీగా సగం పొలం ఎండిపోవుడే.. మో టార్లు రెండుమూడు సార్లు కాలిపోవుడే అన్నట్టుగా దుర్బర పరిస్థితులు ఉండె. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిచేసుకున్నం. పాలమూరు ఎత్తిపోతల, ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పూర్తవుతున్నాయి. సాగునీళ్లు తెచ్చుకుంటు న్నాం. మంచినీళ్ల బాధలను పూర్తిగా తొలగించుకోగలిగాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘నాడు నేను తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే దిక్కులేని స్థితిలో రాజకీయ భిక్షగాళ్లలా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు, పదవుల కోసం నోరుమూసుకున్నారు. పైగా నాపై ఎన్నో నిందలు వేశారు. అవమానకరంగా మాట్లాడారు. హేళన చేశారు. వాటిని దిగమింగుకుం టూ.. ప్రజలను చైతన్యపరుస్తూ 15 ఏండ్లు పోరాడాను. నా పోరాట ఫలితంగానే రాష్ట్రం వ చ్చింది. వచ్చిన తెలంగాణ ఇప్పుడెట్లా ముందుకెళ్తున్నదో మీకు తెలుసు’ అని అన్నారు.
బానిసల్లా బతికిన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి తలొగ్గి.. గంగిరెద్దులా తలలు ఊపితే మనం 58 ఏండ్లు గోసపడ్డామని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. 1956లో చిన్న పొరపాటు జరిగి స్వరాష్ర్టాన్ని కోల్పోయాం. అనాటి తెలంగాణ కాంగ్రెస్ నేతలవల్ల 58 ఏండ్లు గోసపడ్డాం. మనకు మంచినీళ్లు, కరెంటు లేని పరిస్థితులు కల్పిస్తే ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రజలు వలస పోయి బతకాల్సి వచ్చింది. పాలమూరు వంటి జిల్లాలు సగానికి సగం ఖాళీ అయ్యి బొంబాయి వంటి ప్రాంతానికి పోయి బతికారు. భూదాన్ పోచంపల్లిలో ఒకేరోజు ఏడుగురు చేనేత కార్మికులు చనిపోతే, మేం వెళ్లి నాటి సీఎంను జోలె పట్టి అడిగినా ఒక్కరూపాయి సహాయం చేయలేదు. అంత దుర్మార్గమైన పరిపాలనను చూశాం. అసెంబ్లీలో నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని అహంకారానికి పరాకాష్టగా మాట్లాడినా ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అట్లెట్ల అంటావని ప్రశ్నించలేదు. వారు అంతటి బానిసల్లా బతికారు’ అని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాటమే చేయకుంటే నేడు మేడ్చల్ జిల్లా ఏర్పాటయ్యేదా? అని ప్రశ్నించారు.
మేడ్చల్కే 26 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు
పేదల కోసం లక్షల విలువచేసే డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 40 -50 లక్షలు విలువైన ఫ్లాట్స్ను ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అందజేశామ ని, ఈ కీర్తి ఒక్క తెలంగాణ రాష్ర్టానికే దక్కిందని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోనే 26 వేల ఇండ్లను నిర్మించి ఇచ్చామని తెలిపారు. రూపాయి భారం మోపకుండా హైదరాబాద్ వాసులకు మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని ఇటీవలే మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చామని గుర్తుచేశారు. పదేండ్లలోనే బ్రహ్మండంగా అభివృద్ధి సాధించామని, ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే రూ.350 కోట్లతో ప్రజలకు మంచినీరు అందించామని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నేడు దేశానికే తలమానికంగా ఉన్నదని అన్నారు.
ఇప్పటికీ కాంగ్రెస్లో అదే భావ దారిద్య్రం
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఊడిగం చేసిన పాలమూరు ప్రాంత కాం గ్రెస్ నేతలు, ఇప్పటికీ అదే భావ దారిద్య్రంలో ఉన్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘ఇక్కడి కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు నోరు లేక, అడగలేక జూరాల ప్రాజెక్టుతో సరిపెట్టుకొన్నారు. ఆ ప్రాజెక్టు చాలా చిన్నది. అందులో నిల్వ ఉండేదే 9 టీఎంసీల నీళ్లు. కానీ నేడు నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఒక్కరోజులో నది నుంచి తీసుకొనేది 2 టీఎంసీలు. మొత్తం మూ డు రోజుల్లో ఆ ప్రాజెక్టు నిండిపోతది. తెలంగాణను గోల్మాల్ చేయడానికి నాటి ఆంధ్ర సీఎంలు పాలమూరు ఎత్తిపోతలను జూరాల నుంచి ప్రతిపాదించారు. దానిని ఒప్పుకునేది లేదని, బాజాప్తా శ్రీశైలం నుంచే నీళ్లు తీసుకుంటామని అనాడే చెప్పాం. అయినా కాంగ్రెస్ దద్దమ్మలు ఇప్పుడు కూడా జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండెనని మాట్లాడుతున్నారు. ఆ నేతలు ఈ జిల్లాలో ఎట్ల పుట్టారో అర్థంగాదు. కాంగ్రెస్ నేతలకు తెలివి ఉన్నదా? జూరాలలో నీళ్లు ఎన్ని ఉన్నయో తెలుసా? ఎన్ని రోజులు వస్తాయో తెలుసా? ఆ రోజూ భావ దారిద్య్రమే. ఇయ్యాల కూడా అదే భావ దారిద్య్రం’ అని ధ్వజమెత్తారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగకుండా మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులే అ డ్డుపడ్డారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అయి న మొండి పట్టుదలతో పనులను పూర్తి చేస్తున్నామని, 9 ఏండ్ల పోరాటం తరువాత ఇప్పుడే అనుమతులన్నీ వస్తున్నాయని వివరించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు, టన్నెల్లు పూర్తయ్యాయని.. మోటర్లు బిగిస్తున్నారని తెలిపారు. రాబోయే 3-4 నెలల్లో ఆ రిజర్వాయర్లలో నీళ్లను చూస్తామని, పాలమూరు కరువు పోతదని చెప్పారు. ‘ఉద్దండాపూర్ పూర్తయితే జడ్చర్ల నెత్తిమీద నీళ్లకుండ ఉన్నట్టే. 1.5 లక్షల ఎకరాలకు సాగునీళ్లు వస్తయ్. కరువన్నది కన్నెత్తి చూడదు. హైదరాబాద్కు జడ్చర్ల సమీప ప్రాంతమే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 40 నిమిషాల ప్రయాణం. రాబోయే రోజుల్లో జడ్చర్లను బ్రాహ్మాండమైన పరిశ్రమల కేంద్రంగా, ఐటీ హబ్గా తీర్చిదిద్దుతాం’ అని హామీ ఇచ్చారు.
లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
జడ్చర్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి పట్టుదల ఉన్న నాయకుడని, ఉద్యమంలో మొదటి రోజు నుంచి తనవెంట నడిచారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. గెలుపోటములకు ఎక్కడా భయపడకుండా ఉద్యమంలో తనతోపాటు రాజీనామా చేసిన నిఖార్సయిన నాయకుడని కొనియాడారు. ఎన్నికలు పూర్తికాగానే లక్ష్మారెడ్డి కోరిక మేరకు 2 పోలీస్స్టేషన్లు మంజూరు చేస్తామని, ఉద్దండాపూర్ రిజర్వాయర్లో భూములు కోల్పోయినవారికి వెంటనే నష్టపరిహారం చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. లక్ష్మారెడ్డిని మరోసారి బ్రాహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కరువును గెలిచిన పాలమూరు
పదేండ్లలో పాలమూరు జిల్లాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఏ మూలకు పోయినా దుఃఖంతోనే పోయేవాడిని. ఈ ప్రాంత దరిద్రం పోవాలంటే పాలమూరులో కచ్చితంగా ఎంపీగా పోటీచేయాలని, ప్రజలు తప్పక గెలిపిస్తారని ప్రొఫెసర్ జయశంకర్ చెబితే పోటీ చేశాను. ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనాడు ముందుండి ఆ ఎన్నికను తన భుజాలమీద వేసుకొని గెలిపించారు. ఒకనాడు దుమ్ముకొట్టుకుపోయిన దుందుబి నేడు జీవనదిలా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్లో ఎక్కడా చూసినా వరిచేలు కనబడుతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తయితే కరువన్నదే కన్నెత్తి చూడదు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యం. కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమైతం. వాళ్లు వస్తే కరెంట్ను కాట్ల కలుపుతరు. రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీమ్ అంటరు. అందుకే బీఆర్ఎస్ను ఆశీర్వదించండి’ అని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ వస్తే కర్ణాటక గతే
తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేస్తే.. ఇప్పు డు కర్ణాటకలో ప్రజలకు పట్టిన గతే పడుతుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘కాంగ్రెస్ పార్టీ మొన్న కర్ణాటకలో గెలిచిం ది. ఎన్నికలప్పుడు 20 గంటలు కరెంటు ఇస్తమని డైలాగులు కొట్టిన్రు. 5 గంటల కరెంటుతో సరిపెట్టుకోండని నిన్ననే కర్ణాట క సీఎం ప్రకటించిండు. ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రైతులకు ఎందుకు 24 గంటల కరెంటు? 3 గంటలు సరిపోతది అంటున్నడు. కాంగ్రెస్ వస్తే కరెంటును కాట్ల కలుపుతరు’ అని హెచ్చరించారు.
సబ్బండ వర్గాలకు సంక్షేమం
తెలంగాణ ఏర్పాటు తరువాత పేదల గురించే ఆలోచన చేశామని, మతాలు, కులాలు, హిందువులు, ముస్లింలు అని చూడకుండా అందర్నీ కడుపులో పెట్టుకొని సమానంగా చూ స్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలకు ఇప్పటికే గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలను ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డనే. ఓట్ల కోసం లంగ మాటలు, అబద్ధాలు చెప్పలేదు. ఎట్ల చేస్తే మంచిగ నడుస్తదో అలా చేసుకుంట పోతున్నాం. రైతులకు చెందిన రూ.37 వేల కోట్ల అప్పులు మాఫీ చేశాం. మరో పదేండ్లు కష్టపడితే తెలంగాణ రైతు దేశంలోనే గొప్ప రైతుగా మారుతాడు’ అని పేర్కొన్నారు. లంబాడీ బిడ్డలు 50 ఏండ్లు కొట్లాడినా ఎవరూ తండాలను పంచాయతీలుగా చేయలేదని, తాము ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోనే 52 తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేశామని తెలిపారు.
విస్తరిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
హైదరాబాద్ను అనుకొని ఉన్న మేడ్చల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘హైదరాబాద్కు సమీపంలోని మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలు మినీ భారతదేశంలా ఉంటాయి. నగర పరిసర ప్రాంతాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు మొత్తాన్ని ఫెరిఫెరల్ ప్రాంతంగా పిలుస్తాం. తెలంగాణతోపాటు అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతాలు ఏటా విస్తరిస్తున్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు మౌలిక వసతులు పెంచేందుకు ప్రత్యేక బడ్జెట్ను రూపొందిస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంత్రి చామకూర మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘మల్లారెడ్డి జోవియల్ మనిషి. ఆయనకు భగవంతుడు గొప్ప సంపదనిచ్చాడు. సొంత డబ్బులతో గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
మల్లారెడ్డి వంటి అశయమున్న మనిషి ఉంటేనే మేడ్చల్ నియోజకవర్గంలోని ఆరు లక్షల మందిని మోయగలడు. మల్లారెడ్డి చాలా సింపుల్ మనిషి, చాలా చిన్న జీవితం నుంచి పైకి వచ్చి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి. ఆయన్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోజార్టీలో గెలిపించాలి’ అని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.ఒకనాడు పాలమూరులో మనుషులే కాదు అడవి కూడా బక్కవడ్డది. ఒక గోసకాదు.. అనేక సందర్భాల్లో ఏడ్చినం. గంజి కేంద్రాలు పెడుతుండె.. గుండెలు అవిసిపోయేటివి. కృష్ణా నది పక్కనుంచే పారుతున్నా ఏం దుర్గతి! ముఖ్యమంత్రులు రావడం దత్తత తీసుకోవడం శిలాఫలాలు వేయడం తప్ప ఒక్క లాభం కూడా జరగలె. ‘పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయె/పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలు ఎండె’ అని ఉద్యమంలో నేనే పాట రాసిన. అందుకే మహబూబ్నగర్ నా గుండెలో ఉంటది. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఎక్కువ ఉన్నది. బాధ ఎక్కువ ఉన్నది.
-సీఎం కేసీఆర్
నాడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. పంట వేస్తే గ్యారెంటీగా సగం పొలం ఎండిపోవుడే.. మోటార్లు రెండుమూడు సార్లు కాలిపోవుడే అన్నట్టుగా దుర్బర పరిస్థితులు ఉండె. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిచేసుకున్నం. పాలమూరు ఎత్తిపోతల, ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతల పథకాలు పూర్తవుతున్నాయి. సాగునీళ్లు తెచ్చుకుంటున్నాం. మంచినీళ్ల బాధలను పూర్తిగా తొలగించుకోగలిగాం.
-సీఎం కేసీఆర్
దుందుభి నది ఒకప్పుడు దుమ్ము కొట్టుకుపోయి ఉండె. ఇవాళ నదిపై ఎన్ని చెక్డ్యామ్లు కట్టుకున్నం! ఎక్కడ చూసినా బ్రాహ్మాండగా నీళ్లు ఆగి ఉన్నయ్. మొన్న నేను కొల్లాపూర్ పోతూ దుందుభి నది దాటుతుంటే చెక్డ్యామ్ల ఉన్న నీళ్లు చూసి ఆనందమైంది. దుందుభి జీవనదిలా మారింది.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్కు సమీపంలోని మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలు మినీ భారతదేశంలా ఉంటాయి. నగర పరిసర ప్రాంతాలు, మున్సిపాలిటీలు, గ్రామాలు మొత్తాన్ని ఫెరిఫెరల్ ప్రాంతంగా పిలుస్తాం. తెలంగాణతోపాటు అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతాలు ఏటా విస్తరిస్తున్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు మౌలిక వసతులు పెంచేందుకు ప్రత్యేక బడ్జెట్ను రూపొందిస్తాం.
– సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది. ఆడ ఏం డైలాగులు కొట్టిండ్రు. 20 గంటల కరెంటు ఇస్తమన్నరు. నిన్ననే కర్ణాటక ముఖ్యమంత్రి.. 5 గంటల కరెంటిస్తం, అండ్లనే సగవెట్టుకోండ్రి అన్నడు. అది తెల్లందాన్క సగం, పొద్దుందాన్క సగం! ఇంట్ల పండాల్నా? బాయికాడ పండాల్నా? రైతులేం జేయాలె? ఇక్కడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపుల మాట కక్కిండు. రైతులకు ఎందుకు 24గంటల కరెంటు.. వేస్ట్.. 3 గంటలు సరిపోతదని మాట్లాడుతున్నడు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం!.. దళితబంధుకు జైభీం! ఉన్నది ఆగమాగమైతది. కరెంటు కాట గలుస్తది.
– సీఎం కేసీఆర్