తెలంగాణ రాష్ర్టానికి ఆవల తొలిసారి నిర్వహించిన బీఆర్ఎస్ సభ సూపర్ హిట్ అయ్యింది. మహారాష్ట్ర లోని నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని వినేందుకు మరాఠ్వాడా వాసులు తండోపతండాలుగా తరలివచ్చారు. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్సింగ్ సచ్ఖండ్ మైదానం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా జనమే, ఏ దారిలో చూసినా జనమే అన్నట్టుగా సభ సాగింది. ఈ ప్రాంతంలో ఇంత గొప్ప సభను తాము ఎన్నడూ చూడలేదని స్థానికులు చెప్పడం విశేషం.
నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం, ఫిబ్రవరి 5: ఉత్తరాదికి గేట్వేగా ఉన్న మహారాష్ట్రలో భారత రాష్ట్రసమితి నిర్వహించిన తొలి సభ విజయవంతమైంది. మరాఠ్వాడాలో గులాబీ సభకు అపూర్వ స్పందన లభించింది. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బో కర్, నాయిగాం, ముఖేడ్ డెగ్లూర్, లోహ ని యోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో సభ అనూహ్య రీతిలో విజయవంతమైంది. నాందేడ్ జిల్లా సరిహద్దు నియోజకవర్గాలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, జుక్కల్తోపాటు నిర్మల్, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణు లు తరలివెళ్లారు. నాందేడ్లోని తెలుగువారు సైతం తమ ప్రియతమ నేత ప్రసంగాన్ని వినేందుకు తరలివచ్చారు. ముసలి, ముతక, చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడాలేకుండా అన్ని వయసులవారు, అన్ని వర్గాలవారు సభకు తరలిరావడం మరో ప్రత్యేకత.
గురుద్వార సత్కండ్ మైదాన్ దగ్గరికి గులా బీ దళపతి, సీఎం కేసీఆర్ రాగానే ఆ ప్రాంగణమంతా ఉద్విగ్నతకు లోనైంది. ఎంతోకాలం నుంచి ఎదురుచూసిన నేత ఎదురుగా నిలబడేసరికి నాందేడ్ వాసులంతా పులకించిపోయారు. చప్పట్లు కొడుతూ జోతలతో (రెండుచేతులెత్తి నమస్కారం) ఆయనకు అపూర్వస్వాగతం పలికారు. వేదిక మీదికి వచ్చి అన్ని దిక్కులకు తిరుగుతూ సీఎం కేసీఆర్ అందరికీ అభివాదం చేశారు. ఆ సమయంలో సభాప్రాంగణం కేరింతలు.. ఈలలతో మారుమోగిపోయింది. వేదిక ముందున్నవాళ్లకు అభివాదం చేస్తూ వేదిక మీద ఉన్న మరాఠ్వాడ మహోన్నత వీరులు , సమాజ ఉద్దారకులులైన ఛత్రపతి శివాజీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, బావుసాట్, మహాత్మాజ్యోతిరావుపూలే, సావిత్రిబాయిపూలే విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాల వేస్తున్నప్పుడు సభా ప్రాం గణం అంతా పులకించిపోయింది. జై శివాజీ.. జై అంబేద్కర్.. జై పూలే మహారాజ్… అంటూ సభికులు నినాదాలు చేశారు. మహారాష్ట్ర ‘వీరోంకీ యాద్ కరే.. వీర్నేత కేసీఆర్జీకీ జై’ అనే నినాదాలు మిన్నంటాయి. మహారాష్ట్ర వీరపుత్రులకు కేసీఆర్ ఇచ్చిన గౌరవానికి నాందేడ్ భూమిపుత్రులు జేజేలు పలికారు.
నాలుగేండ్ల క్రితమే సీఎం కేసీఆర్తో నాం దేడ్ ప్రాంత ప్రజలకు మానసిక అనుబంధం అల్లుకున్నది. 2019 సాధారణ ఎన్నికలకు ముందే సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాల గురించి తెలుసుకుని మంత్రముగ్ధులయ్యారు. తెలంగాణ తరహా పథకాలు తమకూ కావాలని నినదించడం మొదలుపెట్టారు. సరిహద్దు గ్రామాల్లోని మరాఠా ప్రజలంతా తెలంగాణలో విలీనం అవుతామంటూ నినదించారు. తెలంగాణలో తమకు తాముగా వచ్చి కలుస్తామంటూ మరాఠాలు చేసిన ప్రకటన అప్పట్లోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడైనా పథకాలు కావాలంటే రోడ్డెక్కి ధర్నాలు చేస్తారు. ప్రభుత్వాలను నిలదీస్తారు. కానీ తెలంగాణ తరహా పథకాలు కావాలంటూ మహారాష్ట్రీయులు కోరడం రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ అధినేతగా స్వయంగా కేసీఆరే మరాఠా గడ్డపై అడుగిడటంతో కనీవినీ ఎరుగని రీతిలో అక్కడి ప్రజలు నీరాజనాలు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తమ హృదయాల్లో ఎంతటి స్థానం ఉన్నదో నిరూపించారు.
సీఎం కేసీఆర్ నాందేడ్ విమానాశ్రయానికి ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. అక్కడి నుంచి గురుద్వారాకు ప్రత్యేక కాన్వాయ్గా బయలుదేరారు. విమానాశ్రయం నుంచి గురుద్వారా వరకు రోడ్డుకు ఇరువైపులా వేలాది ప్రజలు చేరుకుని ఆయనకు ఘనస్వాగతం పలికారు. గురుద్వారలో సిక్కు సంప్రదాయం ప్రకారం కేసీఆర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురుద్వారాలో సీఎం కేసీఆర్కు పగిడికట్టారు. ప్రత్యేక దుస్తులు ధరింపజేశారు. ప్రార్థనల అనంతరం సీఎం కేసీఆర్ గురుద్వారా సత్కండ్ మైదాన్లో ఏర్పాటు చేసిన సభకు బయలుదేరారు.
తెలంగాణలో కులవృత్తుల కోసం ఏం చేస్తున్నారో కేసీఆర్ తెలిపారు. ఆయన మాటలు వింటే సంతోషం కలిగింది. అక్కడ పుట్టినా బాగుండు అనిపించింది. మహారాష్ట్రలో కులవృత్తులపై ఆధారపడిన వారు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లలు అందజేత, ఇస్త్రీ దుకాణాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే కులవృత్తులు చేసుకునే వారంతా బాగుపడుతారు.
– బాబు సాల్వే, హద్గా, నాందేడ్ జిల్లా
తెలంగాణలో వృద్ధులకు ప్రభుత్వం పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నది. దవాఖానల్లో వైద్యం ఉచితంగా ఇస్తున్నది. ఇగ మా దగ్గర పింఛన్లు కూడా సరిగా రావు. వైద్యం సరిగా ఉండదు. మందులు, ఖర్చులకు పిల్లలపై ఆధారపడుతున్నాం. తెలంగాణ పథకాలను అమలు చేస్తానని కేసీఆర్ చెప్పారు. ఆయనకు మా ఆశీర్వాదాలు ఉంటాయి.
– ధర్మాజీ రామన్న, దాంకీ, యావత్మల్ జిల్లా
కేసీఆర్ సార్ ప్రసంగం వినడానికి 60 కిలోమీటర్ల నుం చి బస్సులో వచ్చిన. తెలంగాణలో కేసీఆర్ సార్ రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. మేము పంటలకు నీళ్లు పెట్టుకోవడానికి కష్టంగా ఉంది. కరెంటు ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో తెలియదు. కరెంటుకు బిల్లులు కూడా కట్టాలి. కేసీఆర్ సార్ మాటలు విన్నంక.. రైతుల చేతిలో రూపాయి లేకున్నా పంటలు పండించవచ్చనే నమ్మకం ఏర్పడింది. కేసీఆర్ రైతుల పక్షపాతి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటు వేస్తాం. – మారుతి భూమాజీ, రైతు, ఉమ్రి, నాందేడ్ జిల్లా
మాది కరువు జిల్లా. వర్షాలు సరిగా పడక పంటలకు నీరందడం లేదు. అష్టకష్టాలు పడుతున్నాం. మా దగ్గర రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ప్రసంగం విందామని 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. అధికారంలోకి వస్తే దేశంలోని రైతులకు ఏం చేస్తారో అర్థమయ్యేలా చెప్పారు. ఉచితంగా కరెంట్ ఇస్తామన్నారు. సాగు నీటి సౌకర్యం అసలే లేదు. వృథాగా పోతున్న గోదావరి నీటిని ఎదురెక్కించి బీడు భూములకు మళ్లిస్తున్న కేసీఆర్ సార్ చాలా గొప్పోడు.
– సంజయ్, రైతు, దుదేగాం, అష్టి తాలూకా, బీడ్ జిల్లా
తెలంగాణలో రోడ్లు చూస్తే మంచిగనిపిస్తది. మా దగ్గర ఏ ఊరికి పోయినా గతుకుల రోడ్లే కనిపిస్తయి. అందుకే మరాఠా ప్రజలంతా ఎక్కువగా రైళ్లలోనే ప్రయాణం చేస్తుంటారు. గుంతల రోడ్లపై ప్రాణాలు పోగొట్టుకోవడం తప్పా ప్రయోజనముండదు. ప్రస్తుతం వేస్తున్న జాతీయ రహదారులు తప్పా రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లన్నీ ఘోరంగా ఉన్నాయి. నదులు, వాగులు, కాలువలపై నిర్మించే బ్రిడ్జిలు అంతంత మాత్రమే. వానకాలం వచ్చిందంటే మహారాష్ట్రలో సగానికి ఎక్కువ ప్రాంతానికి రాకపోకలే ఉండవు.
– ముత్యాల సదానందం, నాందేడ్