కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశానికి పెనునష్టం వాటిల్లుతున్నదని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం వైఖరిని ఎండగట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎంపీలకు సూచించారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. ప్రజలను పీడిస్తున్నదని దుయ్యబట్టారు. ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడిచి, తెలంగాణ ప్రగతికి మోకాలడ్డుతున్నదని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రజా సమస్యలపై పోరాడాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సూచించారు. బీజేపీ సర్కారు విధానాలు ప్రైవేటు సంస్థలకు లాభం చేకూరుస్తూ దేశానికి నష్టం కలిగిస్తున్నాయని దుయ్యబట్టారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రంతోపాటు దేశంలోని ప్రజా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
కేంద్రం తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని కోరారు. ఆదివారం ప్రగతి భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశం పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యపూరిత, ప్రమాదకర విధానాల వల్ల దేశ భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతున్నదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది.
దేశ సమగ్రతను దెబ్బతీస్తున్న బీజేపీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆటంకాలుగా మారాయని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకొంటున్న సంపదంతా అప్పనంగా తమ కార్పొరేట్ స్నేహితులకు కట్టబెడుతున్నారు. తమకు అనుకూల కార్పొరేట్ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ, లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తున్నది. ఎల్ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెడుతున్నది. వారి కంపెనీల డొల్లతనం బైటపడుతూ వారి షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతూ లక్షల కోట్ల రూపాయలు ఒక రోజులోనే నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తున్నది.
వారి లాభాలు సంపదంతా నీటిబుడగలేనని స్పష్టమవు తున్నది. లాభాలను ప్రైవేట్ పరం చేస్తూ, నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రమాదకర ఆర్థిక విధానాల మీద పార్లమెంటు ఉభయ సభల్లో గొంతెత్తాలి. దేశ ప్రజల ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ఖండించాలె. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనిపైనా పార్లమెంటులో నిలదీయాలి’ అని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
కలిసి వచ్చే అందరితో పనిచేద్దాం
దేశ భవిష్యత్తు కోసం, ప్రజాసమస్యలపై పోరాటం లో కలిసివచ్చే ప్రతిఒక పార్టీని కలుపుకుపోవాలని బీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. ‘పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నయి. సామాన్యుడి బతుకు రోజు రోజుకూ భారమైపోతున్నా కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనుభవిస్తున్న బాధలను, కష్టాలను పార్లమెంటు ఉభయ సభల ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకపోవాలి. రోజురోజుకూ దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది. యువతను ఏమాత్రం పట్టించుకోకుండా, వారికి ఉద్యోగ భద్రత కల్పించకుండా, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీరని నష్టం చేస్తున్నది. ఈ అంశంపై మనం గట్టిగా గొంతు వినిపించాలి.
తెలంగాణకు రావాల్సిన విభజన హామీలపై కేంద్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. దీనిపై కూడా పోరాడాలి. తెలంగాణకు రావాల్సిన అనేక హకులను రాబట్టే దిశగా పార్లమెంటులో గొంతెత్తాలని’ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కే కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్రావు (లోక్సభ), ఎంపీలు సంతోష్కుమార్, కేఆర్ సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, దీవకొండ దామోదర్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి, మాలోత్ కవితా నాయక్, పసునూరి దయాకర్, బోర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు పాల్గొన్నారు.
గవర్నర్ల వ్యవస్థపై గళమెత్తాలె
ప్రగతిపథంలో నడుస్తున్న తెలంగాణ వంటి రాష్ర్టానికి ఆర్థికంగా ఆటంకాలు సృష్టిస్తూ ప్రగతిని అనేక రకాలుగా అడ్డుకోవడానికి కారణమేందో జాతికి చెప్పాలని కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ అన్నారు. ‘గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. రాష్ట్రాలను నిర్వీర్యపరిచే దిశగా గవర్నర్లను కేంద్రం తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తిస్తూ కేంద్ర, రాష్ట్రాల నడుమ సంధాన కర్తలుగా ఉండాల్సిన గవర్నర్లను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొంటున్న దుర్మార్గ విధానాలను బీఆర్ఎస్ ఎంపీలుగా మీరు ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలి. రాష్ట్ర క్యాబినెట్ సహా, అత్యున్నత సభలైన శాసన సభ, శాసన మండలి తీసుకొన్న నిర్ణయాలను సైతం ఉద్దేశపూర్వకంగా గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ప్రభావితం చేయాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న గవర్నర్ల విధానాలను, కేంద్రం వైఖరిని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలి’ అని సూచించారు.
నేడు అఖిలపక్ష భేటీ
మంగళవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నది. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదల, అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ రిసెర్చ్ నివేదిక తదితర అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగనున్నాయి.
ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి దశ జరుగుతుంది. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం(ఫిబ్రవరి 1న) 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఇదే పూర్తిస్థాయి బడ్జెట్ కానున్నది.