CM KCR | తెలంగాణ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటసాగుకు అంతరాయం లేకుండా సాగునీటి సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ అధికారులను సూచించారు. ఇందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదన్నారు. ‘పైసలు పోయినా ఫర్వాలేదు.. పంటలు కాపాడాలంటూ సీఎం ఆదేశించారు. రుతుపవనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యల కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిపై సైతం ఆరా తీశారు.
జులై మొదటి వారం దాకా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వర్షాభావ పరిస్థితుల రోజుల్లో సాగునీటి కోసం నీటి విడుదలకు కొద్ది రోజుల పాటు విరామం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలను, మిషన్ భగీరథ అవసరాలను సంబంధిత అధికారుల నుంచి సీఎం ఆరా తీశారు. జూలై మొదటి వారంలో వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తదితర అంశాలను సమీక్షించుకొని, పరిస్థితులకు అనుగుణంగా సముచిత నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కాళేశ్వరం పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వ వివరాలపై ఆరా తీశారు.
ప్రస్తుతం రంగనాయక సాగర్ జలాశయంలో మూడు టీఎంసీలకు 0.69 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్నాయని ఇంజినీర్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రంగనాయక సాగర్కు రెండు టీఎంసీల నీటిని మిడ్ మానేరు జలాశయం నుంచి తక్షణమే ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా రంగనాయక సాగర్ జలాశయం కింద ఆయకట్టుకు వానాకాలం పంటకు నీరందించడానికి వీలవుతుందన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయంలో ఉన్న 4.95 టీఎంసీల నీటి నిల్వలు ఆగస్టు చివరి వరకు మూడు తడులకు సరిపోతాయని, ఆ తర్వాత మరో మూడు తడులకు ఐదు టీఎంసీలు అవసరమని ఇంజినీర్లు తెలిపారు. ఇందుకు ఆగస్టులో 5 టీఎంసీలను కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాంసాగర్కు తరలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను సమీక్షించుకొని, కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30 నుంచి 35 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు.
సంవత్సరం మల్లన్నసాగర్లో మరో 10 టీఎంసీల నీటిని నింపాలని సమావేశంలో నిర్ణయించారు. వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్ ఫ్లో ఆగిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరి నదుల్లో ప్రవాహాలుంటాయని, రెండో పంట అవసరాల కోసం ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో తగినంత స్థాయిలో నింపి పెట్టుకోవాలని సమావేశం నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయంపై ఆపరేషన్ మాన్యువల్ తయారు చేయాలని సాగునీటి అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం ఏర్పడినటువంటి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సాగునీటి శాఖ సన్నద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.