నిజామాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంతో బాన్సువాడ నియోజకవర్గంలో పేదలకు సొంతింటి కల నెరవేరుతున్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ నియోజకవర్గానికి 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసి సీఎం కేసీఆర్ గొప్ప మనసుచాటుకున్నారు. రికార్డు స్థాయిలో ఇక్కడ ఇండ్లను నిర్మించి ఇప్పటికే 7 వేల మంది పేదలకు గృహప్రవేశాలు చేయించారు. మరో 4 వేల ఇండ్ల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. రానున్న ఉగాది పర్వదినం నాటికి ఈ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు గృహప్రవేశాలు చేయించే విధంగా పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవతో.. తమకు డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయని, ఎన్నో ఏండ్ల నుంచి తీరని సొంతింటి కల ఇప్పుడు నెరవేరుతున్నదని బాన్సువాడ నియోజకవర్గంలోని పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోనే రికార్డు
బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 9 మండలాలున్నాయి. ప్రతి మండలంలోనూ సగటున 800 ఇండ్లను నిర్మించి ఆయా గ్రామాల్లో అర్హులైన పేదలకు పంపి ణీ చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో చేపడుతున్న గృహ నిర్మాణాలతో బాన్సువాడ నియోజకవర్గం డబుల్ బెడ్రూం ఇండ్లకు కేరాఫ్ అడ్రస్గా మారింది. బాన్సువాడ పట్టణంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలోనూ.. అందుబాటులో ఉన్న స్థలంలో ప్రభుత్వం జీ+1 పద్ధతిలో ఇండ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేస్తున్నది. వేల సంఖ్యలో ఇండ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేయడంలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బాన్సువాడలో నిర్మితమవుతున్న డబుల్ ఇండ్ల పురోగతిని సీఎం కేసీఆరే గతేడాది సెప్టెంబర్ 5న స్వయంగా మెచ్చుకున్నారు.
పారదర్శకంగా అర్హుల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం బాన్సువాడ నియోజకవర్గంలో పక్కాగా అమలవుతున్నది. థర్ట్ పార్టీ విచారణ ద్వారా అర్హులను గుర్తిం చి వారికే గృహాలు కేటాయిస్తున్నారు. ఇందులో మధ్యవర్తులు, దళారుల పెత్తనం లేకుండా, ఎలాంటి పొరపాట్లు జరగకుండా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇదివరకే రెవెన్యూ, పోలీస్ శాఖలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా డబుల్ ఇండ్ల పేరిట దందాలు చేస్తే జైల్లో పెడతామంటూ స్పీకర్ పలు మార్లు బాహాటంగానే హెచ్చరించారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి తదనంతరం ఆయా శాఖల ద్వారా రహస్యంగా విచారణ చేయించి ఇండ్లను కేటాయిస్తున్నారు. బాన్సువాడ పట్టణ ప్రాంతంలో వేలాది ఇండ్ల నిర్మాణాలతో ఇప్పుడు ప్రత్యేక కాలనీలు ఏర్పడ్డాయి.