వరంగల్ : చరిత్రలో ఎవరూ చేయని విధంగా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ వ్యవసాయాన్ని దండుగ కాదు పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నిరూపించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. శనివారం దశాబ్ది వేడుకల(Decade Celebrations) రెండో రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్నారు.
ఎనుమాముల మార్కెట్, పరకాల నియోజకవర్గం గవిచర్ల, పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని రైతు సభల్లో మాట్లాడారు. రైతులకు ఎదురుపెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం మరెక్కడా లేదని గుర్తుచేశారు. రుణమాఫీ చేయడంతో పాటు సమృద్ధిగా నీరు, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత కరెంట్(Free Power), రైతు బంధు(Raitu Bandu), రైతు బీమా(Raitu Beema) వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
రైతుల భూములకు భద్రత కల్పిస్తూ, ధరణి పోర్టల్ తీసుకొచ్చారని వెల్లడించారు. రైతు వేదికలు, రైతు కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించి, పంటల నష్టాలకు ఎకరానికి రూ 10 వేల పరిహారం ఇస్తున్నారని పేర్కొన్నారు. రైతును రాజుగా చేయడానికి సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రైతాంగం కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) వల్ల భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు.
తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితిని రైతులు బేరీజు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సీపీ ఏవీ రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.