(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చుడు.. అధికారంలోకి వచ్చాక హ్యాండ్ ఇచ్చుడు’.. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం అని ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఐదు గ్యారెంటీలు అని మాయమాటల చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఇచ్చిన హామీలు అమలుచేయకపోగా రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిందని మండిపడుతున్నారు. ఇక రాజస్థాన్లో అదే పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వంటగ్యాస్ సిలిండర్ను రూ.500కే ఇచ్చే పథకాన్ని సీఎం అశోక్ గెహ్లాట్ ఈ ఏడాది జూన్ 5న ప్రారంభించారు. అయితే పేరుకు స్కీమ్ను అయితే ప్రారంభించారు కానీ.. అది క్షేత్రస్థాయిలో అమలు కాలేదన్న విషయం తాజాగా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ప్రసారం చేసిన కథనంతో తేలిపోయింది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీడియా సంస్థ ఇటీవల ఆయా రాష్ర్టాల్లోని గ్రామీణ మహిళలను ఇంటర్వ్యూ చేసింది. రాజస్థాన్లోని గ్రామీణ మహిళల ఇంటర్వ్యూలను ప్రసారం చేసింది. కాంగ్రెస్ సర్కార్ చెబుతున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ తమకు ఇప్పటి వరకు సరఫరా కాలేదని మహిళలు చెప్పారు. రెండు నెలల క్రితం సిలిండర్ను రూ.1,200 పెట్టి కొన్నామని, ఇప్పుడు కూడా రూ.940కు తీసుకొంటున్నామని స్పష్టంగా పేర్కొన్నారు.
ఎలాగైనా గెలవాలని మాయమాటలు..
తెలంగాణలోనూ ఇదేవిధంగా ప్రజలను మోసగించేందుకు హస్తంపార్టీ కుట్ర పన్నుతున్నది. ఎలాగైనా గెలువాలని అమలు సాధ్యాసాధ్యాలపై ఆలోచనతో పనిలేకుండా ఎడాపెడా అలివికాని హామీలు గుప్పిస్తున్నది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు 6 గ్యారెంటీలంటూ ఊదర గొడుతున్నది. ముఖ్యంగా మహిళలను మభ్యపెట్టడానికి రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామంటూ కాకమ్మ కథలు చెబుతున్నది. అయితే రాజస్థాన్లో ఆ పార్టీ మోసం బయటపడిన నేపథ్యంలో కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే తమను కూడా ఇదేవిధంగా నట్టేట్ల ముంచుతారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఎన్నికలకు ముందు హామీ ఇవ్వకపోయినా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించిన సీఎం కేసీఆర్కు ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉన్నదని, ఎంత కష్టమైనా ఇచ్చిన మాటను అమలు చేస్తారనే విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు వెలిబుచ్చుతున్నారు.