CM KCR | తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ జారీలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. ట్రాఫిక్ పోలీసులు పొద్దాక పొగలో ఉంటరు కాబట్టి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటరు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే 30శాతం అలవెన్స్ వారి వేతనంలో ఇస్తున్నాం. భారతదేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే. ఎక్కడ కూడా ఇంత ఇవ్వరు’ అన్నారు.
‘ఆటోరిక్షా పోరగాళ్లు ఉన్నరు. వాళ్లకు నేను ఇవాళ శుభవార్త చెబుతున్నాను. వారికి ఆదాయం వచ్చే తక్కువ. నరేంద్ర మోదీ విపరీతంగా డీజిల్ ధర పెంచేటట్టు చేసిండు. దేశవ్యాప్తంగా ఆటో రిక్షా కార్మికుల దగ్గర ముక్కుపిండి పన్ను వసూలు చేస్తరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాంగనే పన్ను రద్దు చేసిన. రూపాయి పన్ను లేదు. ఇప్పుడు వాళ్లకు ఏం బాధ ఉన్నదంటే. సంవత్సరానికి కోసారి ఫిట్నెస్ చేయించుకోవాలి. ఆ ఫిట్నెస్కు వెళితే రూ.700 ఛార్జి చేస్తరు. సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.500 ఛార్జీ వేస్తున్నరు. మొత్తం కలిపి రూ.1200 అవుతుంది. ఈ సారి బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఫిట్నెస్ పన్నును రద్దు చేస్తమని ప్రకటిస్తున్నా. కరీంనగర్కు నాకు ఏదో శ్రుతి ఉన్నది. కరీంనగర్ భీముడు కమలాకర్ మొన్న అన్నడు. మీకు కరీంనగర్కు ఏదో లింక్ ఉన్నది సార్ అన్నడు. లింక్ అయితే ఉన్నదనుకో ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్న. కరీంనగర్ పిల్లనే పెళ్లి చేసుకున్న. నేను కరీంనగర్ ఎప్పుడు వచ్చినా ఏదో స్కీమ్ ప్రకటిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్నెస్ ఛార్జి, సర్టిఫికెట్ ఛార్జీలను రద్దు చేస్తాం. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు అందరికీ అన్నీ చేసుకుంటూ పోతున్నాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు.