హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన జార్ఖండ్కు చెందిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం కార్యాలయంలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరేన్తో కలిసి సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. నాటి ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబుతోపాటు జార్ఖండ్కు చెందిన కుందన్కుమార్ ఓఝా, గణేశ్ హన్సదా అనే సైనికులు మరణించారు. కుందన్కుమార్ ఓఝా సతీమణి నమ్రత కుమారి, ఆయన తండ్రి రవిశంకర్ ఓఝా, గణేశ్ హన్సదా మాతృమూర్తి కప్రా హన్సదాలకు కేసీఆర్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ కంటతడిపెట్టడంతో కేసీఆర్ కూడా ఉద్విగ్నతకు లోనయ్యారు. రవిశంకర్ను అక్కున చేర్చుకొని ఓదార్చారు. జార్ఖండ్ సర్కార్తోపాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమకు అండగా నిలిచిన కేసీఆర్కు అమర సైనికుల కుటుంబాలు ధన్యవాదాలు తెలిపాయి. సీఎం కేసీఆర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలని రవిశంకర్ ఓఝా ఆశీర్వదించారు. కేసీఆర్ సవినయంగా రవిశంకర్కు శిరసువంచి నమస్కరించారు. అక్కడున్నవారంతా కేసీఆర్ మానవీయతను చూసి ఆశ్చర్యపోయారు. సైనిక అధికారులు కూడా కేసీఆర్కు గౌరవంగా వందనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పాల్గొన్నారు.
కర్నల్ సంతోష్బాబుకు అంగరక్షకుడిగా ఉన్న నా కుమారుడు కుందన్ కుమార్ ఓఝా గల్వాన్ లోయలో వీరమరణం పొందారు. తెలంగాణ వాసి అయిన సంతోష్బాబుకు నా కుమారుడు రక్షణగా ఉంటే.. మా కుటుంబానికి తెలంగాణ సర్కార్ రక్షణగా నిలబడింది ఈ దేశ పౌరుడిగా ఆలోచిస్తే నా కుమారుడి వీరమరణం ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నది. తండ్రిగా ఆలోచిస్తే కుందన్ కుమార్ మరణం ఎంతో క్షోభ కలిగిస్తున్నది. ఇటువంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావ్జీ ఆర్థిక సహాయం చేసి మాకు అండగా నిలిచారు. మై కేసీఆర్కే హాథోంకో శతకోటి ప్రణామ్ సమర్పిత్ కర్తాహూ (కేసీఆర్ చేతులకు శతకోటి దండాలు). ఆయన ఉదారత గొప్ప మనోధైరాన్ని ఇచ్చింది. కేసీఆర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలి.
– రవిశంకర్ ఓఝా
శత్రు మూకలతో పోరాడుతూ మా సోదరుడు గనేశ్ హన్సదా వీరమరణం పొందాడు. ఇది మాకు ఎంతో గర్వకారణం. కానీ, కుటుంబపరంగా పెద్దలోటే. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జార్ఖండ్కు వచ్చి మమ్ములను ఓదార్చటం, అండగా నిలబడం మా అదృష్టం. మా కుటుంబానికి అండగా ఉంటానని, కష్టసుఖాల్లో పాలుపంచుకొంటానని ఆయన అభయమిచ్చి, ఆర్థిక సహాయం అందించారు. మమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని మా కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఆయన చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– దినేశ్ హన్సదా
గల్వాన్ లోయలో వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ధన్యవాదాలు. కర్నల్ సంతోష్బాబు మరణం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మాకు ఎంతగానో అండగా నిలిచారు. అమర జవాన్లందరి కుటుంబాలను ఆదుకొంటామని నాడు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా వెళ్లి సహాయాన్ని అందజేయడం చాలా ఆనందంగా ఉన్నది. ఇది సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్న సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు యావత్ దేశం అండగా ఉందన్న నమ్మకం కలిగిస్తున్నది.
-కర్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషి