CM KCR : తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా , స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar).. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అన్నారు. ప్రొ.జయశంకర్ జయంతి(ఆగస్టు 6)ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆయన చేసిన త్యాగం, సేవలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సకల జనుల సంక్షేమం, సబ్బండ వర్గాల సమానత్వం కోసమే తెలంగాణ రాష్ట్రమని తెలిపిన జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రాన్ని సాధించిన తొమ్మిదేళ్ల కాలంలోనే సాగునీటి రంగం, వ్యవసాయం, విద్యా, వైద్యం వంటి పలు రంగాల్లో అభివృద్దిని సాధిస్తూ నేడు దేశానికే ఆదర్శంగా తెలంగాణ పాలన సాగుతోందని, అలాగే సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని సీఎం వెల్లడించారు. వ్యవసాయ రంగం నుంచి ఐటీ టెక్నాలజీ రంగాల వరకు అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని కేసీఆర్ చెప్పారు. ప్రపంచ దేశాలు కూడా ఇవాళ తెలంగాణ వైపు చూసేలా అభివృద్ది సాక్షత్కార్యమైందని ఆయన అన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా, ప్రొ.జయశంకర్ కలలుగన్న సకల జనుల అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం పేర్కొన్నారు.